బిగ్ ట్విస్ట్-థర్డ్ ఫ్రంట్పై ప్రశాంత్ కిశోర్ అనూహ్య వ్యాఖ్యలు- అసలు పీకే మదిలో ఏముంది...?
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వేస్తున్న అడుగులు,ఆయన చేస్తున్న వ్యాఖ్యలకు పొంతన కుదరడం లేదు.ఓవైపు శరద్ పవార్తో భేటీ... ప్రత్యామ్నాయ ఫ్రంట్ దిశగా కదులుతూనే... మరోవైపు అలాంటిదేమీ లేదని చెబుతున్నారు. చెప్పడమే కాదు... అసలు 2024 లోక్సభ ఎన్నికల్లో థర్డ్ ఫ్రంట్,ఫోర్త్ ఫ్రంట్ లాంటివేవీ బీజేపీని ఢీకొట్టలేవని అంటున్నారు. దీంతో అసలు ప్రశాంత్ కిశోర్ వ్యూహమేంటి.. ఆయన మదిలో ఏముందన్నది సస్పెన్స్గా మారింది.
తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. 'థర్డ్ ఫ్రంట్ లేదా ఫోర్త్ ఫ్రంట్ వచ్చే 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని నిలువరించగలదని నేనైతే భావించట్లేదు. థర్డ్ ఫ్రంట్ అనేది పాత కాన్సెప్ట్.ఇప్పటికే ఆ మోడల్ను ప్రయోగించడం,పరీక్షించడం జరిగాయి. ఇప్పుడున్న పరిస్థితులకు ఆ మోడల్ సరిపోదు.' అని ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు.
పవార్తో వరుస భేటీలపై స్పందిస్తూ... గతంలో తాము కలిసి పనిచేయనందునా... ఒకరి గురించి మరొకరం మరింత తెలుసుకునేందుకు వ్యక్తిగతంగా కలుసుకున్నామని చెప్పారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిస్థితులపై సీరియస్గా చర్చించామన్నారు. రాష్ట్రాల వారీగా ఎక్కడెక్కడ బీజేపీని ఎలా ఎదుర్కోగలమో... ఎక్కడెక్కడ బీజేపీని ఎదుర్కోవడం సాధ్యపడదో వంటి అంశాలపై చర్చించామన్నారు. థర్డ్ ఫ్రంట్ తరహా మోడల్ గురించి ఇప్పటికైతే తమ మధ్య ఎటువంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో ప్రశాంత్ కిశోర్ సోమవారం(జూన్ 21) భేటీ అవడం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు పైనే వీరిద్దరు చర్చించినట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. మంగళవారం(జూన్ 22) విపక్ష పార్టీలతో సమావేశానికి శరద్ పవార్ పిలుపునివ్వడం దీనికి మరింత బలం చేకూర్చింది. కాంగ్రెసేతర పార్టీలన్నింటినీ ఒక్క తాటి పైకి తీసుకొచ్చి 2024 లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని ఢీకొట్టడమే లక్ష్యంగా ఈ కసరత్తులన్నీ జరుగుతున్నాయన్న ప్రచారం జరిగింది. కానీ ఇంతలోనే థర్డ్ ఫ్రంట్ మోడల్ ఇప్పటి పాలిటిక్స్కు సెట్ అవదని ప్రశాంత్ కిశోర్ ట్విస్ట్ ఇవ్వడం గమనార్హం. అంటే,పీకే థర్డ్ ఫ్రంట్ కాకుండా మరో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం సమాలోచనలు జరుపుతున్నారా... అసలు ఆయన మదిలో ఏముందన్నది సస్పెన్స్గా మారింది.
Recommended Video
మరోవైపు శరద్ పవార్ అధ్యక్షతన రేపు విపక్షాల భేటీ జరగనుంది. ఈ సమావేశానికి పలు రాజకీయ పార్టీల నేతలతో పాటు ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు కూడా ఆహ్వానం అందింది. బీజేపీ లక్ష్యంగా విపక్షాలను ఏకం చేసేందుకే ఈ సమావేశం జరుగుతున్నట్లు కనిపిస్తోంది.