పోలింగ్..ప్రశాంతం: పశ్చిమ బెంగాల్ ఘర్షణలు మినహా!
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశంలో మూడో విడత పోలింగ్ మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. తొలి, మలి విడతలతో పోల్చుకుంటే పోలింగ్ హింస తగ్గుముఖం పట్టింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు కూడా సజావుగా పనిచేశాయి. గుజరాత్-26, కేరళ-20, మహారాష్ట్ర-14, కర్ణాటక-14, ఉత్తర్ ప్రదేశ్-10, ఛత్తీస్ గఢ్-7, ఒడిశా-6, పశ్చిమ బెంగాల్-5, బిహార్-5, అసోం-4, గోవా-2 స్థానాలు సహా జమ్మూకాశ్మీర్, త్రిపుర, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూల్లో ఒక్కో స్థానానానికి మంగళవారం పోలింగ్ ముగిసింది. మొత్తం 116 లోక్సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఒడిశాలో అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ నిర్వహించారు.
ఉదయం నుంచే బారులు..
ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు క్యూలైన్లలో నిల్చున్నారు. తొలి రెండు దశల్లో ఇప్పటికే 70శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. మూడో దశ ఎన్నికల్లో మొత్తం 1600 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో మొత్తం 26 సీట్లకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించారు. కేరళలోని మొత్తం 20 సీట్లకు కూడా మూడో దశలోనే ఒకేసారి పోలింగ్ పూర్తయింది. కేరళ నుంచి బీజేపీకి ఒక్క ఎంపీ సీటు కూడా లేదు. ఈ సారి ఖాతా తెరుస్తామని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ సరళి తమకు అనుకూలంగా ఉందని వారు అంచనా వేస్తున్నారు.
ఎల్ కే అద్వానీ కోటలో అమిత్ షా అడుగు..
గుజరాత్ లోని గాంధీనగర్ లోక్ సభ స్థానం బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీకి కంచుకోట. పలుమార్లు ఆయన ఈ స్థానం నుంచి లోక్ సభకు ప్రాతినిథ్యం వహించారు. ఈ సారి ఈ స్థానంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అడుగు పెట్టారు. ఫలితం ఎలా ఉంటుందనేది సస్పెన్స్. ఈ సస్పెన్స్ వీడేది వచ్చేనెల 23వ తేదీ నాడే. పోలింగ్ సరళిని బట్టి చూస్తే.. హోరాహోరి పోరు తప్పదనేలా కనిపిస్తోంది. ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన సీజీ చావ్డా గాంధీ నగర్ లోక్ సభ బరిలో నిల్చున్నారు. చావ్డా నుంచి అమిత్ షా కు గట్టి పోటీ ఎదురైనట్లు తెలుస్తోంది.
దక్షిణాదిన ఎంట్రీ..రాహుల్ కు కలిసొస్తుందా?
ఇన్నాళ్లూ ఉత్తర్ ప్రదేశ్ నుంచి లోక్ సభకు పోటీ చేస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ తొలిసారిగా దక్షిణాది రాష్ట్రాల్లో అడుగు పెట్టారు. దక్షిణాదిన చిట్టచివరన ఉన్న కేరళలోని వాయనాడ్ లోక్ సభ నుంచి పోటీ చేశారు. ఈ స్థానానికి కూడా ఇవ్వాళే పోలింగ్ పూర్తయింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు నమోదు కాలేదు. ప్రతిష్ఠాత్మక తిరువనంతపురం లోక్ సభ స్థానం నుంచి శశిథరూర్ బరిలో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ నుంచి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ పోటీ చేశారు. ఉత్తర్ ప్రదేశ్లో మైన్ పురి నుంచి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా ములాయం సింగ్ యాదవ్, రామ్ పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా జయప్రద ఎన్నికల బరిలో ఉన్నారు.
పశ్చిమ బెంగాల్ లో హింస
మూడో విడత పోలింగ్ సందర్భంగా పశ్చిమబెంగాల్లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముర్షిదాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ పోలింగ్ బూత్ వద్ద ప్రత్యర్థులు బాంబులు విసురుకున్నారు. ఈ ఘటనలో ఒకరు మరణించారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చెందిన తూజమ్ అన్సారీ, మసాదుల్ ఇస్లామ్, మాలిక్ మండల్ గా గుర్తించారు. దాడి ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఘటనతో పోలింగ్ బూత్ వద్ద మరింత భద్రతా బలగాలను మొహరించి పోలింగ్ నిర్వహిస్తున్నారు. పోలింగ్ బూత్ను ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నిస్తున్న సందర్భంగా జరిగిన ఘర్షణలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం.
జమ్మూకాశ్మీర్ లో దారుణంగా పోలింగ్ శాతం..
సాయంత్రం 5:30 గంటలకు అందిన సమచారం ప్రకారం.. దాదాపు అన్ని చోట్ల 50 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. అస్సాం-74.05, బిహార్-54.95, ఛత్తీస్ గఢ్-64.03, దాద్రా, నగర్ హవేలీ-71.43, డామన్, డయ్యూ-65.34, గోవా-70.96, గుజరాత్-58.81, జమ్మూకాశ్మీర్-12.46, కర్ణాటక-60.87, కేరళ-68.62, మహారాష్ట్ర-55.05, ఒడిషా-57.84, త్రిపుర-71.13, ఉత్తర్ ప్రదేశ్-56.36, పశ్చిమ బెంగాల్-78.94 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా వెల్లడించింది.