ఆవు వల్ల మూడో ప్రపంచ యుద్దం జరగబోతుంది
భోపాల్ : బాధితులు దళితులు.. దాడులకు తెగబడుతున్న వారు గోరక్షక దళం సభ్యులు.. ఇందులో మరో ప్రస్తావనకు తావు లేదు. ఇక వారు నకిలీలా..! నకరాలు చేస్తున్నారా! అన్నది వారికే తెలియాలి.
సాక్షాత్తూ ప్రధాని గారు సైతం.. దళితులపై దాడులను దేశ విద్రోహ చర్యగా అభివర్ణించినా..! ఆ దాడులు ఆగట్లేదంటేనే దేశంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే.. గో రక్షక దళ ముసుగులో కొంతమంది నకిలీలే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మోడీ చేసిన వ్యాఖ్యలను.. ఏకంగా మూడో ప్రపంచ యుద్దం తప్పదన్న స్టేట్ మెంట్స్ తో ముడిపెట్టేస్తున్నారు కొంతమంది స్వామిజీలు.
మూడో ప్రపంచ యుద్దం తప్పదు :
మోడీ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆవు కోసం మూడో ప్రపంచ యుద్దం తప్పదని స్టేట్ మెంట్ ఇచ్చారు మధ్యప్రదేశ్ కు చెందిన గోపాలన్ ఎవమ్ పశుధనక సంవర్థన్ బోర్డు చైర్మన్ మహామండలేశ్వర్ స్వామి అఖిలేశ్వరానంద గిరి. పురాణాల నుంచి ఆవు వర్గాల మధ్య ఘర్షణకు కారణమవుతోందన్న ఆయన..1857 కాలంలో జరిగిన తొలి స్వాతంత్ర్య సంగ్రామంలోనూ ఆవు విషయంలో వివాదాలు చెలరేగినట్లు చెప్పుకొచ్చారు.
ఇంకా ఆయనేమన్నారంటే.. చనిపోయిన ఆవులను వాహనాల్లో తరలిస్తున్నప్పుడు కంటపడే ద్రుశ్యాలు గోరక్షకులకు సహజంగానే ఆవేశం తెప్పిస్తాయన్నారు. అది వారి మనోభావాలకు సంబంధించిన అంశమని, అయితే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని చెప్పారు. అలాంటి వాహనాలు కంటపడినప్పుడు.. వాటిని గనుక ఆపితే పోలీసులు వచ్చే వరకు వేచి ఉండాలన్నారు.
గోవధ చట్టాలను అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి కాబట్టి.. అక్రమంగా వాటిని రాష్ట్రాల సరిహద్దులు దాటించడం కష్టమన్నారు అఖిలేశ్వరానంద గిరి. ఆవు పాలకు, మూత్రానికి పేడకు కేన్సర్, మూర్ఛ లాంటి వ్యాధులను నయం చేసే ఔషధ గుణం ఉందన్నారు.
ఎవరీ అఖిలేశ్వరానంద గిరి? :
మధ్యప్రదేశ్ లో ఆవుల సంరక్షణ బాధ్యతలను నిర్వర్తిస్తోన్న గోరక్షక బోర్డుకు చైర్మన్ గా నియమింపబడ్డారు అఖిలేశ్వరానంద గిరి. అయితే ఓ మత వర్గానికి చెందిన వ్యక్తిని ఇలా చైర్మన్ గా నియమించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సన్యాసం స్వీకరించిన 12 ఏళ్ళ తర్వాత 2010 మార్చిలో నిరంజని అఖాడా మహామండలేశ్వర్ గా నియమింపబడ్డారు అఖిలేశ్వరానంద గిరి.