86 ఏళ్లు: చరిత్ర సృష్టించనున్న దాక్షాయణి అనే ఏనుగు
తిరువనంతపురం: కేరళ రాజధాని తిరువనంతపురానికి చెందిన 'దాక్షాయణి' అనే ఏనుగు గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కనుంది. ఈ ఏనుగు వయసు 86 ఏళ్లు. ప్రపంచంలో జీవించి ఉన్న ఏనుగుల్లో అత్యధిక వయసు కలిగిన ఏనుగుగా ఇది చరిత్ర సృష్టించింది.
దీంతో 'దాక్షాయణి' పేరును రికార్డుల్లోకి ఎక్కించాలని కోరుతూ ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు(టీబీడీ) గిన్నిస్ అధికార వర్గాలకు లేఖ రాసింది. వివరాల్లోకి వెళితే కేరళలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్న శబరిమల ఆలయంతో సహా 1,250కు పైగా ఆలయాలు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు పరిధిలో ఉన్నాయి.
ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు వద్ద ఉన్న 33 ఏనుగులను ఆయా ఆలయాల్లో జరిగే ఉత్సవాలకు సంబంధించి వివిధ సేవలకు గాను వీటిని వినియోగిస్తుంటారు. ఈ క్రమంలో 86 ఏళ్లు ఉన్న దాక్షాయణిని పేరుని గిన్నిస్ రికార్డుల్లో నమోదు చేయించేదుకు ప్రయత్నిస్తున్నామని టీబీడీ అధ్యక్షుడు ప్రయార్ గోపాలకృష్ణన్ సంకల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తైవాన్ లో 85 ఏళ్లు బతికిన ఏనుగు 2003లో మరణిచిందని తెలిపారు. దీని పేరుతో కేరళలో పోస్టల్ స్టాంపు కూడా విడుదల చేయనున్నామని వెల్లడించారు. 1949లో ట్రావెర్ కోర్ రాజకుటుంబం ఈ ఏనుగును టీబీడీకి బహూకరించిందని ఆయన తెలిపారు.