ఈ బామ్మ ఛాంపియన్ గురూ: 98 ఏళ్ల వయస్సులో పరీక్ష రాసి పాస్ అయ్యింది
ఇదిగో ఇక్కడి ఫోటోలో బామ్మను చూశారుగా... ఆమె వయస్సు 96 ఏళ్లు. అయినా ఈ వయసులో ఓ పరీక్ష రాసి విజయం సాధించింది. అది కూడా ఆషా మాషీ మార్కులతో కాదండోయ్... ఏకంగా 90శాతం మార్కులతో కేరళ ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో పాస్ అయ్యింది. ఈ పరీక్ష రాసిన వారిలో అత్యధిక వయసున్న వ్యక్తిగా ఈ బామ్మ రికార్డు సృష్టించింది .
ఇక అసలు విషయానికొస్తే... కేరళలోలోని అలపుజా జిల్లాకు చెందిన కార్తీయని అమ్మ అనే 98 ఏళ్ల వృద్దురాలు కేరళ ప్రభుత్వం అక్షరాస్యతపై నిర్వహించిన పరీక్ష రాసి విజయం సాధించింది. మొత్తం 100 మార్కులకు ఈ పరీక్ష నిర్వహించగా బామ్మ 90 మార్కులు సాధించింది. ఈ పరీక్షలో ఆమె చదివే విధానం చేతి రాతను పరిశీలించడమే కాదు, గణితంపై కూడా ప్రశ్నలు అడిగారు.అక్షరలక్ష్యం పేరుతో నిర్వహించిన అక్షరాస్యత పరీక్ష తమ రాష్ట్రంలో ఎంత అక్షరాస్యత ఉన్నది అంచనా వేస్తుంది కేరళ ప్రభుత్వం. ఇప్పటికే దేశం మొత్తం మీద 90 శాతానికి పైగా అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా కేరళ తొలిస్థానంలో ఉంది.
ఈ పరీక్షలో 42,933 మంది పాస్ అయ్యారు. దీంతో 100శాతం అక్షరాస్యత దిశగా కేరళ దూసుకెళుతోంది. 1991 ఏప్రిల్ 18న 90శాతానికి పైగా అక్షరాస్యత నమోదు కావడంతో కేరళ రాష్ట్రాన్ని యూనెస్కో పూర్తి అక్షరాస్యత ఉన్న రాష్ట్రంగా ప్రకటించింది. 2011 గణాంకాల ప్రకారం కేరళలో ఇంకా 18 లక్షల మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో 100శాతం అక్షరాస్యత నమోదు చేయాలన్న ఉద్దేశంతో ఈ ఏడాది జనవరి 26న అక్షర లక్ష్యం పేరుతో కేరళ ప్రభుత్వం పరీక్ష నిర్వహించింది. దీని వెనకున్న ముఖ్య ఉద్దేశం గిరిజనులు, మత్స్యకారులు, ఇతరత్ర వెనకబడినవారిలో ఉన్న నిరక్షరాస్యులను గుర్తించడం కోసమే అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.