రియల్ హీరో: సెలవుపై ఉన్నప్పటికీ... వందల ప్రాణాలు కాపాడిన మేజర్
ఇక్కడ ఫోటోలో మిలటరీ డ్రెస్లో కనిపిస్తున్న వ్యక్తి పేరు హేమంత్ రాజ్. ఆర్మీలో మేజర్గా పనిచేస్తున్నారు. సొంత రాష్ట్రం కేరళ. ఓనం పండగ సందర్భంగా తమ వారితో కొన్ని రోజులు సరదాగా గడుపేందుకు కేరళకు వెళ్లిన హేమ్ రాజ్... సెలవులో ఉన్నప్పటికీ కూడా తన డ్యూటీని మరువ లేదు. అక్కడికి వెళ్లాక కథ మరోలా మారింది.
ఆగష్టు 18న మేజర్ హేమంత్ రాజ్ కథ ప్రారంభమైంది. సెలవుపై కేరళకు వెళ్లేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నాడు. కొచ్చి విమానం ఎక్కాల్సి ఉంది. అయితే కొచ్చి విమానం రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అప్పటి వరకు కేరళను వరదలు ముంచెత్తాయన్న సంగతి హేమంత్కు తెలియదు. తన కుటుంబ సభ్యులు కూడా సహాయక శిబిరంలో ఉన్నట్లు తర్వాత తెలిసింది. తిరువనంతపురంకు ఒక టికెట్ కేటాయించాల్సిందిగా ఇండిగో విమాన సిబ్బందికి విజ్ఞప్తి చేశాడు.
తను వేసుకున్న మిలటరీ డ్రెస్సుకు గౌరవమిచ్చిన సిబ్బంది ఒక సీటును కేటాయించారు. ఆగష్టు 19న తెల్లవారు జామున రెండు గంటలకు తిరువనంతపురానికి మేజర్ హేమంత్ రాజ్ చేరుకున్నాడు.ఎయిర్ ఫోర్స్ అధికారులను తన గ్రామం చెంగనూరులో హెలికాఫ్టర్ ద్వారా డ్రాప్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. అందుకు అంగీకరించిన ఎయిర్ఫోర్సో మేజర్ హేమంత్ రాజ్ను చెంగనూరు ప్రాంతంలో వదిలింది. నీటిలో మునిగిన తన గ్రామాన్ని చూసి తల్లడిల్లిపోయాడు హేమంత్ రాజ్.
వెంటనే ఆరుగురు ఎక్స్సర్వీస్మెన్లు, కొంతమంది విద్యార్థులతో కలిసి మేజర్ హేమంత్ రాజ్ తన ఆపరేషన్ మొదలు పెట్టాడు. సహాయక చర్యలు చేపడుతున్న 13 గర్వాల్ రైఫిల్స్ సిబ్బంది ఎదురయ్యారు. అయితే వారికి భాషతో ఇబ్బందిగా ఉంది. దీంతో స్థానికంగా ఉండే ఒక రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగిని ప్రతి గ్రూపులో ఒకరిని ఉంచాడు. అంతేకాదు హేమంత్ రాజ్ చేపడుతున్న ఆపరేషన్లో పాల్గొనేందుకు స్థానిక మత్స్యకారులు కూడా కలిసి వచ్చారు. ఇక అందరూ జట్లుగా విడిపోయి చెంగనూరు గ్రామంలోని మారుమూల ప్రాంతాలకు వెళ్లి ముందుగా మహిళలను, పిల్లలను కాపాడారు.
తాను చేస్తున్న సహాయం చూసి కొందరు ఫోటోలు తీసి ఫేస్బుక్లో పోస్టు చేశారని...ఇది చూసిన తన భార్య తీర్థ తను ఎక్కడున్నానో తెలుసుకోగలిగిందని చెప్పారు హేమంత్ రాజ్. తామంతా కొట్టాయంలోని సహాయక శిబిరంలో తలదాచుకున్నట్లు తీర్థ తనతో చెప్పిందని హేమంత్ రాజ్ వెల్లడించారు. మూడురోజుల పాటు కంటిమీద కునుకు లేకుండా సహాయక చర్యల్లో పాల్గొన్నాడు మేజర్ హేమంత్ రాజ్. రోజుకు 10 టన్నుల ఆహారంను వరదబాధితులకు అందజేసింది మేజర్ హేమంత్ రాజ్ టీమ్. విద్యుత్ సరఫరా లేదు..సెల్ ఫోన్లు పనిచేయడం లేదు... దీంతో తనకు తెలిసిన ఓ రేడియో జాకీకి సమాచారం అందించాడు. రెస్క్యూ టీమ్స్ పవర్ బ్యాంకులు, పవర్ బోట్లు పంపాల్సిందిగా ప్రకటన చేయించినట్లు చెప్పాడు. దీంతో పవర్ బ్యాంకులు, పవర్ బోట్లు పంపారు. ఇక ఆలస్యం చేయకుండా గ్రామం చివర వరకు వెళ్లి అక్కడ వరదల్లో చిక్కుకున్న బాధితులను కాపాడినట్లు చెంగనూరులోని సహాయక శిబిరాలకు చేర్చినట్లు మేజర్ వివరించారు.
తను సెలవు తీసుకున్న మొదటి రోజు నుంచే సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు స్పష్టం చేశారు మేజర్. వరదలతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. కేరళ సర్వం కోల్పోయింది. అయినా సరే అధైర్యపడకుండా ముందుకు వెళ్లి తమ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుంటామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు మేజర్ హేమంత్ రాజ్. హ్యాట్సాఫ్ మేజర్ హేమంత్ రాజ్. నేషన్ సెల్యూట్స్ యూ.