Must Read: మొసలి నోట్లో తమ్ముడు.. అన్న భీకర పోరు.. చివరికి ఏం జరిగింది..?
రెండ్రోజుల క్రితం పంజాబ్లోని జలంధర్లో ఒక 15 ఏళ్ల బాలిక తన మొబైల్ ఫోన్ను దొంగలించేందుకు ప్రయత్నించిన ఇద్దరి దొంగలను ఎదుర్కొన్న తీరుపై దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే మరో సాహసం బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో వెలుగు చూసింది. పంజాబ్ అమ్మాయి దొంగలతో పోరాడి సాహసం ప్రదర్శిస్తే.. పాట్నా కుర్రాడు ఒక మొసలితో పోరాటం చేశాడు. మొసలితో పోరాడటం అంటే కేవలం సినిమాలోనే జరుగుతుంది అనుకుంటున్నారు కదూ... కానీ ఇక్కడ ఆ బాలుడు తన తమ్ముడి కోసం ఈ పోరాటం చేశాడు. ఇంతకీ ఆ పోరాటంలో ఏం జరిగింది..?
మొసలితోనే ఢీ
సాధారణంగా ఎదురుగా మొసలి నిలబడితేనే భయంతో ఆమడదూరం పరిగెడుతాం. కానీ బీహార్లో పశ్చిమ చంపారన్ జిల్లాలోని యోగపట్టి బ్లాక్లో నివాసం ఉంటున్న ఓ కుర్రాడు అత్యంత సాహసాన్ని ప్రదర్శించాడు. ఏకంగా మొసలితోనే ఢీ అంటే ఢీ అన్నాడు. అసలు విషయానికొస్తే నీరజ్ కుమార్ మరియు ధీరజ్ కుమార్ అనే సోదరులు వారి గేదెలను నీటితో కడిగేందుకు ఊరి చివరన ఉన్న స్థానిక నదిలోకి వెళ్లారు. ఎప్పటిలాగే తమ్ముడు నీరజ్ కుమార్ నీటిలోకి దిగగా... అన్న ధీరజ్ కుమార్ ఒడ్డున కూర్చొని ఉన్నాడు.
మొసలి కళ్లపై పొడిచాడు
ఇక నీటిలోకి దిగిన నీరజ్ కుమార్ ఒక్కసారిగా గట్టిగా కేకలు వేశాడు. ఏమైందో తెలుసుకునేందుకు ధీరజ్ అటుగా చూడగా ఇంకేముందు. ఓ పెద్ద మొసలి తమ్ముడు నీరజ్ను పట్టుకుంది. ఇది గమనించిన ధీరజ్ వెంటనే నీటిలోకి దూకాడు. ప్రాణాలకు తెగించి మొసలితో పోరాటం చేశాడు. మొసలి తోకను గట్టిగా పట్టుకుని దాన్ని ఇదిలించాడు. మొసలి కళ్లపై కుచ్చాడు. అయినప్పటికీ అది నీరజ్ను వదలలేదు. అయినా పట్టువిడవని విక్రమార్కుడిలా ధీరజ్ ప్రయత్నించి ఆ మొసలిని ముప్పు తిప్పలు పెట్టాడు.
దాదాపు 15 నిమిషాలు
ఇక ధీరజ్ మొసలితో దాదాపు 15 నిమిషాల పాటు పోరాడి దాన్ని ముప్పు తిప్పలు పెట్టడంతో అది ఎట్టకేలకు నీరజ్ను వదిలి నీటిలో దూరంగా పారిపోయింది. అయితే ఈ ఘటనలో నీరజ్కు తీవ్రగాయాలయ్యాయి. ఇక మొసలితో పోరాడిన ధీరజ్కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ముందుగా నీరజ్ను స్థానిక హాస్పిటల్కు తీసుకెళ్లగా అక్కడి నుంచి మరో పెద్ద హాస్పిటల్కు తీసుకెళ్లారు. నీరజ్ తొడను మొసలి బాగా కొరికేసిందని వైద్యులు చెప్పారు. అయితే ప్రస్తుతం ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు వెల్లడించారు.
Recommended Video
ధైర్య సాహసాలు భళా అంటున్న గ్రామస్తులు
మొసలి పలుమార్లు తన తోకతో కొట్టే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ తాను పట్టు విడవకుండా దాంతో పోరాడినట్లు ధీరజ్ చెప్పాడు. ఇక నీరజ్కు ఉచితంగా వైద్యం చేయాలని స్థానిక నాయకుడు హఫీజ్ గడీ చెప్పారు. అంతేకాదు ఇంత సాహసాన్ని ప్రదర్శించి సోదరుడిని మొసలి బారి నుంచి కాపాడిన ధీరజ్ను ప్రశంసిస్తూ ప్రభుత్వం అతనికి బహుమానం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే చాలా మొసళ్లు నదికి సమీపంలోని వాల్మికీ నేషనల్ పార్కు నుంచి లేదా నేపాల్ నుంచి నీటితో పాటు వస్తున్నాయని సామాజిక కార్యకర్త ముఖేష్ యాదవ్ చెప్పారు. వరదల సమయంలో మొసళ్లు ఎక్కువగా కొట్టుకొస్తున్నాయని ఇవి ప్రమాదకరంగా మారాయని చెప్పారు. ఇప్పటికే చాలా సార్లు స్థానిక అధికారులకు మరియు అటవీశాఖకు మొసళ్లు వస్తున్న సంగతి తెలిపామని అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.