ఇదో ఫేక్ బడ్జెట్... బ్యాంకుల్లో డిపాజిట్లకు కూడా భరోసా లేదు... దేశాన్ని అమ్మేస్తున్నారు : మమతా బెనర్జీ
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం(ఫిబ్రవరి 1) పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇది దేశాన్ని అమ్మేసే బడ్జెట్ అని ఎద్దేవా చేశారు. ఇది దేశ వ్యతిరేక,రైతు వ్యతిరేక బడ్జెట్ అని.. ఫేక్ బడ్జెట్ అని విమర్శించారు. మోదీ సర్కార్ అన్నింటినీ అమ్మేస్తోందని విరుచుకుపడ్డారు. తాజా బడ్జెట్పై కాంగ్రెస్ వర్గాలు కూడా పలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇంత దారుణమైనా బడ్జెట్ మునుపెన్నడూ చూడలేదని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం విమర్శించారు.
ఇదో ఫేక్ బడ్జెట్ : మమతా
'ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు... బాధపడకండి... అన్ని ధరలు పెరుగుతాయి... సెస్ పేరు చెప్పి కేంద్రమే అన్నింటినీ లాగేసుకుంటోంది. వాళ్లు రైతులకు చేసిందేమీ లేదు... ఇప్పటికీ వ్యవసాయ చట్టాలను రద్దు చేయలేదు. నిత్యం పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అసలు ఇది బడ్జెట్ యేనా... ఇదో ఫేక్ బడ్జెట్... ప్రజా వ్యతిరేక,దేశ వ్యతిరేక,రైతు వ్యతిరేక బడ్జెట్... అన్నింటినీ అమ్మేస్తున్నారు. కనీసం మీ ఇన్సూరెన్స్ డబ్బులైనా మీకొస్తాయా... ఆఖరికి బ్యాంకు డిపాజిట్లకు కూడా భద్రత లేకుండా పోయింది.' అని మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు.
మోసపూరిత బడ్జెట్...
'ఇన్సూరెన్స్ కంపెనీని కూడా అమ్మేస్తున్నామని ప్రకటించారు... అంటే కనీసం మీ డబ్బులు మీకు తిరిగొస్తాయా అన్నది కూడా కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. రైళ్లను ప్రైవేట్ పరం చేస్తున్నారు... బీఎస్ఎన్ఎల్,ఎయిర్ ఇండియా,పీఎఎస్యూలు... ఇలా అన్నింటినీ ప్రైవేటీకరిస్తున్నారు. పీఎస్యూల్లో పనిచేసేవారికి కూడా ఇక ఎంతోకాలం ఉద్యోగ భద్రత ఉండదు.' అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఈ బడ్జెట్ గురించి వివరించాలని తాను బెంగాల్ ఆర్థికమంత్రి అమిత్ మిత్రాను కోరానని... 'చెప్పేందుకు ఏమీ లేదు.. ఇదో మోసపూరిత,ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్' అని ఆయన బదులిచ్చారని తెలిపారు.
Recommended Video
కార్పోరేట్లకేనా...రైతులకు ఏం చేశారు...?
నిరర్ధక రుణాలను మాఫీ చేసే కేంద్ర ప్రభుత్వం రైతు రుణాలను మాత్రం మాఫీ చేయట్లేదని మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి ఆర్థిక అండదండలు అందిస్తున్న పార్టీలకు కేంద్రం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోందని ఆరోపించారు. తేయాకు తోటలకు తగిన సాయం అందిస్తామని ప్రకటించిన కేంద్రం ఆ మాట నిలబెట్టుకోలేదన్నారు. 'ఎన్నికలకు ముందు బెంగాల్లో హైవేలను అభివృద్ది చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు మాకు అవేమీ అవసరం లేదు. వెళ్లి రైతులను ఆదుకోండి. మా రోడ్ల సంగతి మేము చూసుకుంటాం.' అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. వలస కార్మికులను స్వగ్రామాలకు తరలించేందుకు కేంద్రం వద్ద డబ్బు ఉండదని... కానీ కోట్లు కొల్లగొట్టిన ప్రజా ప్రతినిధులను ప్రత్యేకే విమానాల్లో ఢిల్లీకి తీసుకెళ్లి పార్టీలో చేర్చుకుంటారని విమర్శించారు. బెంగాల్లో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్పై మమతా ఇలా పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.