నాటి నిర్భయ ఘటనలో సాక్ష్యంగా నిలిచింది ఈ బస్సు...దీని విశేషాలు ఏమిటో చూద్దాం
చూశారుగా... ఫోటోలో ఉన్న బస్సు... గుర్తుకొచ్చిందా... ఈ బస్సును చూస్తే ప్రతిఒక్కరి మదిలో మెదిలేది నాటి చేదు జ్ఞాపకాలే. 2013లో జరిగిన నిర్భయ ఘటనలో మూగ సాక్షిగా నిలిచింది ఈ బస్సు. మళ్లీ ఇంతకాలానికి అంటే దాదాపు ఆరేళ్ల తర్వాత మరోసారి ఈ బస్సు కనిపించి అందరికీ నాటి ఘటనను గుర్తుచేసింది.
ఇక ఈ బస్సులోపల చూస్తే ఒడో మీటర్పై రెండు లక్షల ఆరువేల ఏడువందల ఎనభై నాలుగు (2,6784కి.మీ) కిలోమీటర్లు తిరిగినట్లుగా ఉంది . ఇంజిన్ తుప్పు పట్టిపోయింది. సీటుకింద తుప్పుపట్టిన బెల్ట్ బకెల్ ఉంది. బహుశా నిందితులది అయి ఉండొచ్చు. ఇక బస్సు నెంబర్ DL 1PC 0149 అని నెంబర్ ప్లేట్ పై కనిపిస్తుంది. ఇది దినేష్ యాదవ్ అనే వ్యక్తికి చెందిన బస్సు. వసంత్ విహార్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబర్ 413/2012తో ప్రాపర్టీ కేసు కింద నమోదైంది.
బస్సును జాగ్రత్తగా కాపాడుతూ వచ్చిన పోలీసులు
ఆరేళ్ల క్రితం ఈ బస్సుకు ఆరుమంది పోలీసులు కాపలాగా ఉండేవారు. ఈ బస్సును తగులబెట్టాలని, ధ్వసం చేయాలని అప్పట్లో ఆందోళనకారులు చాలా ప్రయత్నించారు. నిర్భయపై ఆరుగురు దుర్మార్గులు అత్యాచారం చేసింది ఈ బస్సులోనే. కాబట్టి ఆనాడు ఆందోళనకారుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. కొన్నిరోజుల క్రితం ఈ బస్సు సాకెత్ కోర్టు కాంప్లెక్స్లో పార్క్ చేయబడింది. అయితే తన బస్సు తనకు అప్పగించాలని యజమాని యాదవ్ చాలా ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు మాత్రం అప్పగించలేదు. అప్పటికీ కేసు ఇంకా విచారణ దశలో ఉన్నందున ఒకవేల బస్సు యజమానికి అప్పగిస్తే శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడుతుందని పోలీసులు భావించిన బస్సును ఇవ్వలేదు.
నిర్భయ కేసులో ఆ మైనర్ నిందితుడు ఇప్పుడు ఎక్కడ? ఏం చేస్తున్నాడంటే?
కేసు పరిష్కారంలో బస్సే కీలకం
అత్యాచారం ఘటన జరిగిన మరుసటి రోజున బస్సును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ శాఖకు కావాల్సిన వేలిముద్రలు, ఇతరత్ర బుజువులు అన్నీ బస్సులోనే లభ్యమయ్యాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ బస్సే సగం కేసును పరిష్కరించింది. అత్యాచారం వార్త తెలియగానే దేశం మొత్తం రోడ్లపైకొచ్చి నిరసనలు తెలిపింది. బస్సు కనిపిస్తే కాల్చివేయాలన్నంత కోపం ఆందోళనకారుల్లో నెలకొంది. ఇందులో ఫోరెన్సిక్ శాఖ కావాల్సిన సాక్షాలు ఉన్నాయి కాబట్టి దీన్ని భద్రపరచాలని పోలీసులు భావించారు. ఆందోళనకారుల కంటపడకుండా జాగ్రత్తగా ఈ బస్సును కాపాడారు. ఎవరి కంట పడకుండా దక్షిణ ఢిల్లీలోని త్యాగరాజ స్టేడియంకు బస్సును తరలించారు. అక్కడే ఒక పోలీసును కూడా కాపలాగా ఉంచారు. ఇక్కడే ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి ఆధారాలు సేకరించారు. వేలిముద్రలు తీసుకున్నారు.
ఇక ఆ తర్వాత బస్సు సాకేత్ కోర్టు కాంప్లెక్స్లో ఉంచారు. అనంతరం వసంత్ విహార్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్లలో ఉన్న పాత వాహనాలను క్లియర్ చేసి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే మళ్లీ బస్సు వార్తల్లో నిలిచింది.
బస్సులో పరిస్థితి ఇలా ఉంది
బస్సులో చివరినుంచి రెండో సీటు కిందకు దించి ఉంది. బెడ్లా పరిచిఉంది. ఇది చూస్తే నాడు నిర్భయ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం తెలియజేస్తోంది. తనను బస్సు వెనక సీటుకు లాక్కెళ్లారని తనతో పాటు ఉన్న స్నేహితుడిని చితకబాదారని పోలీసులకు చెప్పింది నిర్భయ. బస్సు కిటీకీలకు ఉన్న పసుపురంగు కర్టన్లను నిందితులు అమ్మాయిపై అత్యాచారం చేసే సమయంలో దగ్గరకు వేశారు. ఇప్పుడు ఆ కలర్ పాలిపోయింది. అంతేకాదు చాలా కర్టన్లు చిరిగిపోయి కనిపించాయి. కొన్ని సీట్లను పురుగులు తినేసినట్లున్నాయి. బస్సుకు అద్దాలు లేవు. 2013లో కేసు విచారణ సందర్భంగా సాకేత్ కాంప్లెక్స్లో పార్క్ చేసి ఉన్న ఈ బస్సుపై ఆందోళనకారులు దాడి చేసి ధ్వంసం చేశారు.
యజమాని యాదవ్ అరెస్టు
బస్సులో అత్యాచారం జరగకముందు రెండేళ్లలో ఈ బస్సుపై 8 జరిమానాలు విధించబడ్డాయి. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ జరిమానాలు విధించబడ్డాయి.అయితే యాదవ్ ప్రతిసారి ఫైన్ కట్టి బస్సును విడిపించుకునేవాడు. కానీ అత్యాచారం జరిగిన తర్వాత బస్సుకు సంబంధించిన వివరాలు పూర్తిగా బహిర్గతం కావడంతో యాదవ్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అసలు తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించి బస్సును రోడ్లపై తిప్పుతున్నట్లుగా అభియోగాలు నమోదు చేశారు పోలీసులు. ఇలా 11 బస్సులు తిప్పుతున్నాడు యాదవ్. జైలు నుంచి తిరిగి వచ్చాక యాదవ్ మళ్లీ బస్సులను తిప్పుతున్నాడు. అయితే అన్నీ సరైన పత్రాలతోనే తిప్పుతున్నాడు. అంతేకాదు ప్రతి బస్సుకు జీపీఎస్ వ్యవస్థను అమర్చాడు. మళ్లీ ఇలాంటి దారుణం చోటుచేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు యాదవ్.