కూతురు స్మృతిలో: ఇద్దరి పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్ చేయించిన దంపతులకు హ్యాట్సాఫ్..!
విధి రాసిన గీతను ఎవరూ మార్చలేరు. ఇదే జరిగింది మహారాష్ట్రకు చెందిన డాక్టర్ దంపతులకు . తమకు నష్టం కలిగినప్పటికీ వారు దిగులు చెందలేదు. ఇతరుల్లో ఆనందం వెతుక్కున్నారు. కన్న బిడ్డ తమకు దూరమైనప్పటికీ... ఆ బాధను దిగమింగుకొని మరొకరు అలాంటి జబ్బుతో మరణించకూడదని భావించి ఆ డాక్టర్ దంపతులు మరో ఇద్దరికి ప్రాణం పోశారు. వారిలో మరణించిన తమ బిడ్డను చూసుకుంటూ ఆనందపడుతున్నారు.
మహారాష్ట్రలోని అమరావతిలో నివసిస్తున్న ఉమేష్ సవార్కర్ అశ్విని దంపతులు వృత్తిరీత్యా వైద్యులు. ఎందరికో ప్రాణాలు పోసే వారు.. తమ సొంత బిడ్డను మాత్రం కాపాడుకోలేకపోయారు. ఎంతమంది స్పెషలిస్టు వైద్యులకు చూపించినా ఫలితం దక్కలేదు. విధి ముందు వారు కూడా తలొంచారు. ఇంతకీ డాక్టర్ ఉమేష్ దంపతుల చిన్నారికి వచ్చిన జబ్బు ఏమిటో తెలుసా... గుండె జబ్బు. పుట్టిన నాలుగు నెలలకే ముద్దులొలికించే చిన్నారిని ఆ గుండె జబ్బు వెంటాడింది. చిన్నారి గుండెలో రంధ్రం ఏర్పడింది. ఎంతో సంతోషంగా సాగుతున్న వారి జీవితంలో ఈ విషయం ఎంతో బాధపెట్టేది. ఎంతో మంది డాక్టర్ల దగ్గర చూపినప్పటికీ ఫలితం దక్కలేదు. గతేడాది డిసెంబర్లో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. బుడిబుడి అడుగులు వేసే చిట్టి తల్లి కనిపించలేదు. ఆమె లేదన్న విషయాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేక పోయారు.
ఇక విధి తమ బిడ్డను తమనుంచి దూరం చేసిందన్న బాధ లోపల ఉన్నప్పటికీ ధైర్యంతో ముందుకు కదిలారు. ఇలాంటి పరిస్థితి మరో చిన్నారికి రాకూడదని భావించారు ఉమేష్ దంపతులు. గుండెలో రంద్రం ఉన్న ఇద్దరు పిల్లల ఆపరేషన్కు తామే నిధులు సమకూర్చాలని నిర్ణయించుకున్నారు. అలాంటి పిల్లల కోసం చాలా హాస్పిటల్స్ తిరిగారు. చివరకు శ్రీశాంత్ అచ్యుత్ మహరాజ్ హార్ట్ హాస్పిటల్లో ఇద్దరు చిన్నారులు గుండెలో రంద్రంతో బాధపడుతున్నారని తెలుసుకున్నారు. ఆ పిల్లల పేర్లు పాయల్, అస్వాషిల్. ఇద్దరి పిల్లల ఆపరేషన్కు తామే డబ్బులు ఇస్తామని తెలిపారు. అది కూడా తమ బిడ్డ పుట్టినరోజు నాడే జరిగింది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. వారి సంతోషంగా ఉండటం చూసి డాక్టర్ దంపతులు ఎంతో సంబరపడిపోయారు.