నిషేధం ఎత్తేశారు: ఈ గజరాజు ఆ రాష్ట్రంలో ఇప్పుడో పెద్ద సెలబ్రిటీ
త్రిసూరు: సాధారణంగా ఆలయ ఉత్సవాల్లో ఏనుగులను చూస్తుంటాం. ఉత్సవాల్లో భాగంగా అవి పాల్గొంటూ ఉంటాయి. భక్తులు కూడా వీటిని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. కానీ కేరళలో ఓ ఏనుగుకు మాత్రం బీభత్సమైన అభిమానులున్నారు. అది కొన్ని రోజులు కనిపించకపోయేసరికి నిరాశ చెందారు. తిరిగి ఈ రోజు వారంతా మళ్లీ ఓ ఆలయం దగ్గర గుమికూడారు.. ఆ ఏనుగు తిరిగి ఉత్సవాల్లో పాల్గొంటుందన్న వార్త దావనంలా పాకడంతో అంతా దాన్ని చూసేందుకు పోటీ పడ్డారు.
ఈ గజరాజుకు అభిమానులు ఎక్కువే
ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఏనుగు పేరు తెచికొట్టుకావు రామచంద్రన్. ఇది కేరళలోని అతిపెద్ద ఏనుగు. త్రిసూరు ఆలయ ఉత్సవాల్లో ఇది ఎక్కువగా పాల్గొంటుంది. అంతేకాదు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా ఇది కనిపించకపోవడంతో స్థానికులు భక్తులు ఆందోళనకు గురయ్యారు. అసలు ఈ ఏనుగుకు ఏమైందో తెలియక తలలు పట్టుకున్నారు. అంతలా ఈ గజరాజుతో మమేకమయ్యారు. మళ్లీ త్రిసూరులోని ప్రధాన ఉత్సవం అయిన పూరం ఉత్సవాల్లో ఏనుగు కనిపించేసరికి దాన్ని చూసేందుకు తాకేందుకు గజరాజు అభిమానులు ఎగబడ్డారు.
రామచంద్రన్పై నిషేధం
అసలు విషయం ఏమిటంటే దాదాపు 10.5 అడుగుల ఎత్తు ఉండే ఈ ఏనుగు రామచంద్రన్ గురువాయుర్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ గృహప్రవేశం సందర్భంగా ఇద్దరి వ్యక్తులను తొక్కి చంపేసింది. దీంతో జిల్లా అధికారులు ఈ ఏనుగు ఆలయ ఉత్సవాల్లో పాల్గొనకుండా నిషేధం విధించారు. ఈ గజరాజుపై నిషేధం విధించడంతో ఎలిఫేంట్ అసోసియేషన్ వారు ఆలయ ఉత్సవాల్లో ఏ ఏనుగు పాల్గొనరాదంటూ హుకూం జారీ చేశారు. అసలే కేరళ... గజరాజు లేనిదే ఆలయ ఉత్సవాలు జరగవు. ఈ సారి పూరమ్ ఉత్సవాలకు ఏనుగులను సప్లై చేయమని అసోసియేషన్ తెగేసి చెప్పడంతో అధికార యంత్రాంగం దిగొచ్చి రామచంద్రన్ ఉత్సవాల్లో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది. ఇందుకు కొన్ని షరతులు విధించింది.
రామచంద్రన్ 13 మంది ప్రాణాలు తీసింది
ఇదిలా ఉంటే రామచంద్రన్ను ఈ ఉత్సవాల్లో పాల్గొనడం తనకు ఇష్టం లేదని ఇప్పటి వరకు ఈ ఏనుగు 13మంది ప్రాణాలు తీసిందని రెండు ఏనుగుల మృతికి కూడా కారణమైనందున తాను ఆమోద ముద్ర వేయలేదని జంతుసంరక్షణ బోర్డు సభ్యుడు ఎంఎన్ జయచంద్రన్ తెలిపారు. అంతేకాదు ఈ ఏనుగు కుడి కన్ను కనిపించదని ఆయన చెప్పారు. అయితే మెజార్టీ సభ్యులు ఆమోదం తెలపడంతో తిరిగి పూరం ఉత్సవాలకు రామచంద్రన్ అనే ఈ గజరాజు ముస్తాబవుతోందని తెలిపారు.
షరతులతో ఉత్సవాలకు అనుమతించిన కేరళ ప్రభుత్వం
ఇక పూరం ప్రధాన ఘట్టం రామచంద్రన్తోనే ప్రారంభం అవుతుంది. పురాతన వడకుంనాథన్ ఆలయ దక్షిణ ద్వారాలను ఈ ఏనుగు తెరవడంతో పూరం వేడుకలు ప్రారంభం అవుతాయి. ఇందుకోసమే ముందుగా ఏనుగుకు వెటెరనరీ డాక్టర్లు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి పూర్తిగా ఫిట్గా ఉందని తెలిసిన తర్వాతే పూరం ఉత్సవాల్లో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చారు. ఇక దీనిపై కోర్టుల్లో కూడా వాదనలు జరిగాయి. అయితే కోర్టు ఈ విషయంలో కలగజేసుకోబోదని తెలిపింది. దీంతో రాష్ట్రప్రభుత్వం న్యాయసలహాను అడిగింది. కొన్ని నిబంధనలతో రామచంద్రన్ను ఉత్సవాల్లో పాల్గొనేందుకు అనుమతించారు. రామచంద్రన్ తిరిగే సమయంలో ప్రజలు దీనికి దూరంగా ఉండి వీక్షించాలని , ఉత్సవాల్లో ఉదయం 9:30 గంటల నుంచి 10 :30 గంటల వరకే అనుమతించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇది వెళ్లే మార్గంలో ప్రజలు దగ్గరకు రాకుండా బారికేడ్లు ఉంచాలని అదే సమయంలో నలుగురు మావటి వాళ్లు దీనికి ఎస్కార్ట్గా వెళ్లాలని ప్రభుత్వం సూచించింది.
మొత్తానికి రామచంద్రన్ రాకతో ఉత్సవాలకు ఒక్కసారిగా మునుపటి కల వచ్చింది. రాష్ట్రం నలమూలల నుంచి దాన్ని చూసేందుకు ప్రజలు ఇప్పటికే త్రిసూర్కు చేరుకున్నారు.