పరిస్థితి భయంకరంగా ఉంది... వార్తలను మేనేజ్ చేసి గెలవలేరు... సీఎం యోగికి ప్రియాంక ఘాటు లేఖ..
ఓవైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంటే... మరోవైపు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రం వార్తలను మేనేజ్ చేయడం,అడ్వర్టైజ్మెంట్లపై ఫోకస్ చేయడంతో కాలం వెళ్లదీస్తున్నారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం(జూలై 25) ముఖ్యమంత్రికి ఆమె లేఖ రాశారు.
'కరోనాతో పాటుగా అనేక సమస్యలు ఉత్తరప్రదేశ్ను వెంటాడుతున్నాయి. ఇప్పటికీ కరోనా పేషెంట్లకు పడకల కొరత ఉంది. ఆస్పత్రుల ఎదుట భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. మరణాల సంఖ్య పెరుగుతోంది. కాన్పూర్,లక్నో,గోరఖ్ పూర్ వంటి నగరాల నుంచి వస్తున్న రిపోర్ట్స్ ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరిని విడనాడి ప్రజా అనుకూల,పారదర్శక విధానాలతో ముందుకు సాగాలి.' అని ప్రియాంక గాంధీ సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇప్పటికీ తక్కువ సంఖ్యలోనే టెస్టులు జరుగుతున్నాయని ప్రియాంక పేర్కొన్నారు. 'నిన్న ఒక్కరోజే 2500 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పెద్ద నగరాలతో పాటు గ్రామాల్లోనూ వైరస్ తిష్ట వేసింది. మీ ప్రభుత్వం మాత్రం నో టెస్ట్.. నో కరోనా పాలసీని అవలంభిస్తోంది. పరిస్థితి మాత్రం చాలా ప్రమాదకరంగా ఉంది. టెస్టుల సంఖ్య పెంచనంతవరకు కరోనాపై మన పోరాటం పాదర్శకంగా లేనట్లే,అంతేకాదు అది ప్రమాదకర పరిస్థితికి దారితీయవచ్చు.' అని ప్రియాంక అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో క్వారెంటైన్ కేంద్రాలు,ఆస్పత్రులు అద్వాన్న స్థితిలో ఉన్నాయని ప్రియాంక ఆరోపించారు. వైరస్ కంటే ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితిని చూసే ప్రజలు భయడపడుతున్నారని అన్నారు. కరోనా పేషెంట్లకు 1.5లక్షల పడకలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం చెబుతోందని... కానీ 20వేల పడకల కొరత ఉందని వాస్తవ పరిస్థితులు చెబుతున్నాయని పేర్కొన్నారు.
అంతేకాదు,రాష్ట్రంలో కరోనా నియంత్రణకు మిలటరీ కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రియాంక అన్నారు. 'డీఆర్డీవో,పారా మిలటరీ ఆధ్వర్యంలో తాత్కాలిక ఆస్పత్రులను నిర్వహించాల్సిన అవసరం ఉంది. అలాగే హోమ్ క్వారెంటైన్,పేషెంట్లపై నిఘా,పర్యవేక్షణ వంటి వాటిపై ఇంకా సరైన సమాచారం ప్రజలకు చేరాల్సి ఉంది. హోమ్ క్వారెంటైన్లో ఖర్చులపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి.' అని ప్రియాంక లేఖలో పేర్కొన్నారు.
Recommended Video
'పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఇలాంటి తరుణంలో వార్తలను మేనేజ్ చేయడం ద్వారా,అడ్వర్టైజ్మెంట్ల మీరు గెలవలేరు. మీరు నా సలహాలను రాజకీయ కోణంలో చూసే అవకాశం లేకపోలేదని కూడా నాకు తెలుసు. గతంలో వలస కార్మికుల కోసం బస్సులు ఏర్పాటు చేస్తే రాజకీయం చేశారు. కానీ ఇప్పుడు కూడా అలాంటి ధోరణితో వ్యవహరించవద్దని కోరుతున్నాను.' అని ప్రియాంక లేఖలో చెప్పుకొచ్చారు.