ఎందుకంటే?: చొక్కా లేకుండా, సైకిల్పై రఘురాం రాజన్ గురువు!
భోపాల్: ఆయనొక ఐఐటి ప్రముఖ ప్రొఫెసర్. ఆయన చెప్పిన పాఠాలు విన్న వారు ఇప్పుడు దేశంలోనూ, అంతర్జాతీయంగానూ ఉన్నత పదవుల్లో కొనసాగుతున్నారు. గత కొద్ది రోజుల వరకూ భారత రిజర్వు బ్యాంకు గవర్నర్గా పని చేసిన రఘురాం రాజన్ కూడా వారిలో ఒకరు కావడం గమనార్హం. ప్రస్తుతం ఒక మారుమూల గ్రామంలో సాధారణ వ్యక్తిలా జీవితం గడుపుతున్నారు. అక్కడి గిరిజనుల కష్టాలను తీరుస్తున్నారు. ఆయనే అలోక్ సాగర్. ఆయన గురించి పూర్తిగా తెలిస్తే.. ఆయనొక ఆదర్శ ప్రాయుడని చెప్పుకోక తప్పదు.
ఆ వివరాల్లోకి వెళితే.. అలోక్ సాగర్ 1973లో ఢిల్లీ ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో మాస్టర్ డిగ్రీ అందుకున్నాడు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బోస్టన్ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ పూర్తిచేశాడు. ఆ తర్వాత ఐఐటీ ఢిల్లీలో ప్రొఫెసర్గా పనిచేశాడు. ఎంతో మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాడు. అయినా ఆయన మనసులో ఏదో తెలీని వెలితి ఉండేది. సాధారణ జీవితానికి భిన్నంగా ప్రజలకు ఏదైనా చేయాలనే ఆలోచన ఆయన మెదడులో ఎప్పుడూ మెదలుతూ ఉండేది.
ఆ ఆలోచనలోంచే పుట్టిన కోరిక అతడ్ని ఊహించని నిర్ణయం తీసుకునేలా చేసింది. వెంటనే ఆ కోరిక తీర్చుకోవడానికి ఐఐటీ ఢిల్లీలో ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. కాగా, ఆ కోరిక ఎక్కడో కొండల్లో కోనల్లో నివసించే ఆదివాసీల కోసమే కావడం గమనార్హం. మారుమూల పల్లెల్లో నివసించే నిస్వార్థమైన ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపి వారి అభివృద్ధి కోసం కృషి చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న మధ్యప్రదేశ్లోని మారుమూల ప్రాంతానికి చేరుకున్నారు.
కనీసం విద్యుత్, రోడ్డు సౌకర్యంలేని మారుమూల గ్రామమైన కొచాముచేరుకున్నారు. అక్కడి ఆదివాసీ ప్రజల్లో ఒకడిగా మారిపోయారు. మూడు దశాబ్దాలుగా అలాగే జీవిస్తున్నాడు. బేతుల్.. హోషంగాబాద్ జిల్లాలో ఆదివాసీల అభివృద్ధి కోసం కృషిచేస్తున్నారు. దేశానికి సేవ చేయడం అంటే.. మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజల అభివృద్ధి కోసం కృషి చేయడమే అని నమ్మి మూడు దశాబ్దాలుగా వారి కోసం కష్టపడుతున్నారు. ఇప్పటివరకు ఆయన ఒక్కరే దాదాపు 50వేల మొక్కలు నాటడం గమనార్హం.
ఇప్పటికీ.. అలోక్ సాగర్ సాధారణ జీవితాన్నే గడుపుతున్నారు. కేవలం అతని దగ్గర మూడు జతల కుర్తాలు.. ఓ సైకిల్ మాత్రమే ఉన్నాయి. ప్రతిరోజు ఆ సైకిల్పైనే తిరుగుతూ విత్తనాలు సేకరిస్తూ.. మారుమూల ప్రాంతాల ప్రజలకు అందిస్తున్నారు. ఇటీవల బేతుల్ జిల్లాలో జరిగిన ఎన్నికల సమయంలో జరిగిన ఓ సంఘటన అతను ఎవరనే విషయం అక్కడి ప్రజలకు తెలిసేలా చేసింది.
ఎన్నికల సమయంలో అధికారులు అలోక్ విషయంలో దురుసుగా ప్రవర్తిస్తే తాను ఎవరు? ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చాడు? విద్యార్హతలు ఏంటన్న విషయాన్ని వెల్లడించాడు. అవి చూసి అక్కడి అధికారులు కూడా నమ్మలేదు. కానీ, అతను చెప్పిన వివరాలపై విచారించి.. నిజం తెలుసుకుని విస్తుపోయారు.
ఇలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించగా.. 'దేశంలో ప్రజలు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు. కానీ, చాలామంది ప్రజలకు సేవ చేయడం మరచి తమ సర్టిఫికెట్స్ చూపించుకునేందుకే వారి తెలివితేటలను ఉపయోగిస్తున్నారు' అని అలోక్ చెప్పుకొచ్చారు. మంచి ఉద్యోగం, విలాసవంతమైన జీవితం వదులుకుని.. సాధారణ వ్యక్తిలా కనీస సౌకర్యాలు లేని గిరిజనుల కోసం చేస్తున్న ఆయన కృషిని ప్రతీ ఒక్కరూ అభినందించడంతోపాటు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.