మహా రాజకీయాలను మలుపు తిప్పిన, ఎన్సీపీని రెండుగా చీల్చిన అజిత్ పవార్ ప్రస్థానం ఇదే
అజిత్ పవార్ మహారాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా మలుపు తిప్పిన నేత. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం గా మారిన నేత. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ లకు షాకిస్తూ బీజేపీకి అధికారం కట్టబెట్టిన నేత అజిత్ పవార్. ఎవరూ ఊహించని విధంగా ఎన్సీపీని రెండుగా చీల్చి,బిజెపికి మద్దతు ప్రకటించిన అజిత్ పవార్ తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
అజిత్ పవార్ మద్దతు లేఖను దుర్వినియోగం చేశారా..? అసలు లేఖలో ఏముంది..?
మహా రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన అజిత్ పవార్
బిజెపికి మద్దతు ఇచ్చి మహారాష్ట్ర రాజకీయాలలో ఊహకందని ట్విస్ట్ ఇచ్చిన అజిత్ పవార్ తమ మద్దతుతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ కు అవకాశం కల్పించి, తాను డిప్యూటీ సీఎంగా ఈరోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రాత్రికి రాత్రి, గంటల వ్యవధిలో మహారాష్ట్ర రాజకీయాలలో ఊహించని పరిణామాలకు కారణమైన అజిత్ పవార్ పై ఇప్పుడు దేశం చర్చిస్తోంది. అందుకే అజిత్ పవార్ రాజకీయ ప్రస్థానం ఒకసారి చూద్దాం.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సొంత అన్నయ్య కుమారుడే అజిత్ పవార్
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సొంత అన్నయ్య కుమారుడే అజిత్ పవార్. గోవిందరావ్ పవార్ దంపతులకు 11 మంది సంతానం. వారిలో శరద్ పవార్ ఒకరు. శరద్ పవార్ అన్నయ్య అనంతరావ్ పవార్ కుమారుడే అజిత్ పవార్. అజిత్ కుమార్ తండ్రి అనంతరావ్ పవార్ ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ 'రాజ్ కమల్ స్టూడియోస్'లో పని చేసేవారు. అజిత్ పవార్ చదువును కొనసాగిస్తున్న సమయంలో ఆయన తండ్రి హఠాన్మరణం చెందారు.దీంతో, విద్యాభ్యాసాన్ని వదిలేసి, అజిత్ పవార్ కుటుంబ బాధ్యతలను స్వీకరించారు.
1982లో రాజకీయ ఆరంగేట్రం చేసిన అజిత్ పవార్
1959లో జన్మించిన అజిత్ పవార్ కు విద్యా పరంగా ఎస్ఎస్సీ మహారాష్ట్ర బోర్డు సర్టిఫికెట్ ఉంది. ఆ తర్వాత కొద్ది రోజుల గ్యాప్ తర్వాత ఆయన మళ్ళీ తన చదువును కొనసాగించారు. అజిత్ పవార్ తన విద్యాభ్యాసాన్ని కొనసాగించడానికి పూణే నుండి ముంబైకి మకాం మార్చారు. ఇక ఆ తర్వాత అయినా 1982లో రాజకీయ రంగంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఒక బలమైన నేతగా ఉన్నారు శరద్ పవార్ . రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆయన మొట్టమొదటిగా ఆయన కోపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డుకు ఎన్నికయ్యారు.
బారామతి ఎంపీగా విజయం .. బాబాయి కోసం బారామతి ఎంపీ స్థానం త్యాగం
ఆ తర్వాత పూణే జిల్లా కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా పని చేశారు.ఇక ఆ పదవిలో 16 సంవత్సరాల కాలం కొనసాగిన అజిత్ పవార్ అదేసమయంలో బారామతి లోక్సభ నియోజకవర్గం నుండి ఎంపీగా మొదటిసారి గెలుపొందారు. ఆ తర్వాత బాబాయి అయిన శరద్ పవార్ కోసం బారామతి స్థానాన్ని వదులుకున్నారు. ఇక బారామతి నుండి పోటీ చేసిన శరద్ పవార్ విజయం సాధించి కేంద్ర రక్షణ మంత్రిగా పీవీ నరసింహారావు క్యాబినెట్లో పని చేశారు.
బారామతి ఎమ్మెల్యేగా అజిత్ పవార్ ప్రస్థానం ..
ఇక ఆ తర్వాత బారామతి ఎమ్మెల్యేగా అజిత్ పవార్ విజయం సాధించారు. ఇక ఇదే స్థానం నుండి వరుసగా ఆరు పర్యాయాలు ఆయన విజయకేతనం ఎగురవేశారు. 1995, 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వాల పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు. సుధాకరరావు నాయక్ ప్రభుత్వంలో వ్యవసాయం మరియు విద్యుత్ శాఖ మంత్రి (జూన్ 1991 - నవంబర్ 1992) గా కొనసాగారు. తరువాత శరద్ పవార్ ముఖ్యమంత్రిగా తిరిగి రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయన భూ పరిరక్షణ, విద్యుత్ మరియు ప్రణాళిక శాఖ మంత్రి (నవంబర్ 1992 - ఫిబ్రవరి 1993) అయ్యారు.
పలు కీలక శాఖల్లో మంత్రిగా పని చేసిన అజిత్ పవార్
1999 లో భారత జాతీయ కాంగ్రెస్-ఎన్సిపి సంకీర్ణం అధికారంలోకి వచ్చినప్పుడు, అజిత్ పవార్ కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొందారు. మొదట విలాస్రావ్ దేశ్ముఖ్ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖలో (అక్టోబర్ 1999 - డిసెంబర్ 2003), సుశీల్కుమార్ షిండే ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖకు (డిసెంబర్ 2003 - అక్టోబర్ 2004) అదనపు బాధ్యతలు ఆయనకు ఇచ్చారు. 2004 లో కాంగ్రెస్-ఎన్సిపి కలయికతో తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు, అజిత్ పవార్ దేశ్ముఖ్ ప్రభుత్వంలో మరియు తరువాత అశోక్ చవాన్ ప్రభుత్వంలో జల వనరుల మంత్రిత్వ శాఖను కొనసాగించాడు. ఆయన 2004 లో పూణే జిల్లాకు గార్డియన్ మంత్రి అయ్యాడు మరియు 2014 లో కాంగ్రెస్ - ఎన్సిపి సంకీర్ణం అధికారాన్ని కోల్పోయే వరకు ఈ పదవిలో ఉన్నారు.
మహా రాజకీయాల్లో, ఎన్సీపీలో, పవార్ కుటుంబంలో అజిత్ పవార్ చిచ్చు
ఇక ఆయన మహారాష్ట్ర మాజీ మంత్రి పదం సిన్హ పాటిల్ కుమార్తెను వివాహం చేసుకున్నారు. ఇక తాజాగా అజిత్ పవార్ ఊహించని విధంగా ఎన్సీపీ ని రెండుగా చీల్చి మహా రాష్ట్ర రాజకీయాల్లో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఇది మహా రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, అటు ఎన్సీపీలో , ఇటు పవార్ కుటుంబంలో సైతం కుదుపుకు కారణమైంది.