దేశంలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం..డబ్ల్యూఈఎఫ్లో మోడీ
కోవిడ్ భయపెడుతున్న వేళ కోట్లాదిమంది ప్రజలకు విజయవంతంగా వ్యాక్సిన్లు పూర్తి చేశామని ప్రధాని మోడీ తెలిపారు. ప్రజాస్వామ్యంపై భారత్కు గల చెక్కుచెదరని నమ్మకం, భారతీయుల నైపుణ్యాలు, వారి స్వభావాలతో 21వ శతాబ్దాన్ని శక్తివంతం చేసే సాంకేతికత గురించి వివరించారు. సోమవారం నుంచి ఆన్లైన్లో ప్రారంభమైన ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో ప్రధాని మోడీ ప్రసంగించారు.
ఈ ఏడాది భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటోందని.. అదే సమయంలో 156కోట్ల మంది ప్రజలకు వ్యాక్సిన్ వేయడం పూర్తిచేశామని తెలిపారు. వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించాలంటే జీవన శైలిలో మార్పులు ఏ రీతిన చేసుకోవాలో వివరించారు. ఏ వస్తువునైనా వాడి పారేసే సంస్కృతి ప్రస్తుతం పెచ్చరిల్లుతోందని, ఈ ధోరణి, వినిమయతత్వం వల్ల వాతావరణ మార్పులకు సంబంధించిన సవాళ్ళు మరింత తీవ్రమవుతాయని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా మానవాళికి మంచి జరగాలనే మన లక్ష్యానిు నెరవేర్చుకోవాలంటే 2070కల్లా కర్బన ఉద్గారాలను పూర్తిగా తగ్గించాల్సివుందని, ఇందుకు తాము కట్టుబడి వున్నామని చెప్పారు.
దేశ పురోగతి అంతా పచ్చదనం, పరిశుభ్రత, సుస్థిరతలతో కూడినదిగా, విశ్వసనీయమైనదిగా వుంటుందని స్పష్టం చేశారు. సుస్థిర అభివృద్ధి కోసం తాము చేసే కృషి వంద శాతం వుంటుందని చెప్పారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా ప్రపంచ దేశాలకుభారత్ అందించిన సేవలను వివరించారు. బహుళ భాషలు, సంస్కృతులతో కూడిన ఈ దేశ వాతావరణం తమ బలమే కాదని, యావత్ ప్రపంచ బలమని మోడీ పేర్కొన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా, 80 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉచితంగా ఆహారం అందించగలిగామని చెప్పారు.
ప్రపంచంలోకెల్లా మూడవ అతిపెద్ద ఫార్మా ఉత్పత్తిదారుగా ఉందన్నారు. పలు దేశాలకు ముఖ్యమైన మందులు, వ్యాక్సిన్లు అందచేయడం ద్వారా ''వన్ ఎర్త్, వన్ హెల్త్' అనే దార్శనికతను భారత్ ఏ రీతిన అనుసరించిందో మనం చూశామని చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద పెద్దదైన, సురక్షితమైన, విజయవంతమైన డిజిటల్ చెల్లింపుల వేదికగా ఉందని వివరించా. గత నెలల్లో ఏకంగా 440కోట్ల లావాదేవీలను యుపిఐ ద్వారా జరిపిందన్నారు. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకుఇది మంచి సమయమని మోడీ చెప్పారు.