ఇది బీజేపీకి పెద్ద దెబ్బ అన్న మాయావతి, రాహుల్ కి అనంతకుమార్ కౌంటర్!
బెంగళూరు: కర్ణాటక రాజకీయ ఉత్కంఠకు తెరపడిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రజాస్వామ్యం గెలిచిందంటూ కొందరు అభిప్రాయపడుతుంటే.. ఓడినా బీజేపీ సానుభూతి దక్కించుకుందంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో బీఎస్పీ(బహుజన్ సమాజ్) అధినేత్రి మాయావతి మీడియాతో మాట్లాడారు. 'ఇది బీజేపీకి పెద్ద దెబ్బ. 2019 ఎన్నికల కోసం వారేదైతే ప్లాన్ చేసుకున్నారో.. అంతా విఫలమైంది. వాళ్ల రాజకీయంపై వాళ్లే ఇప్పుడు పునరాలోచించుకోవాలి.' అని ఆమె పేర్కొన్నారు.
కాగా, కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ తో బీఎస్పీ పొత్తు కట్టిన సంగతి తెలిసిందే. 18సీట్లలో పోటీ చేసిన ఆ పార్టీ కేవలం ఒక నియోజకవర్గంలో మాత్రమే విజయం సాధించింది. కొలిగల్ నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి మహేష్ భారీ మెజారిటీతో విజయం సాధించారు.
రాహుల్ కి మతి చెడింది?: అనంతకుమార్
కర్ణాటకలో ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల్లో ప్రధాని మోడీ ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నారని, దీంతో అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నానన్న ఆయన ప్రచారం వట్టిదేనని తేలిపోయిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఆరోపించారు.
రాహుల్ వ్యాఖ్యలపై వెంటనే కౌంటర్ ఇచ్చారు కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్దే. 'ప్రధాని గురించి అతనేం మాట్లాడుతున్నాడు?, ఈ ప్రధానే దేశంలో కుంభకోణాలు లేని పాలన అందిస్తున్నాడు. రాహుల్ ఇలాంటి ఆరోపణలు గనుక చేస్తే.. ప్రజలు అతనికి మతి చెడిందనుకుంటారు' అని ఆయన కౌంటర్ ఇచ్చారు.