వీడియోల నుంచి ఈమెయిల్స్ వరకు: వేర్పాటు వాదులపై NIA కన్ను..!
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో వేర్పాటువాదులకు పాకిస్తాన్ హైకమిషన్ నుంచి నిధులు అందుతున్నాయని జాతీయ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎన్ఐఏ కొద్దిరోజుల క్రితం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక కశ్మీర్లో అలజడి సృష్టించేందుకే వేర్పాటు వాదులు ఉన్నారని కూడా చెప్పింది. ఇదంతా జరగేందుకు పాకిస్తాన్ హవాలా మార్గాల ద్వారా వేర్పాటు వాదులకు నిధులు సమకూర్చేదని ఎన్ఐఏ చెప్పింది. ఇందుకోసం న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ వేదికగా నిలిచిందని ఎన్ఐఏ తేల్చింది. ఇదే విషయాన్ని చార్జ్షీట్లో దాఖలు చేసింది .తాజాగా చార్జ్ షీట్లో మరో సప్లిమెంట్ను చేర్చింది ఎన్ఐఏ.
చార్జ్షీట్లో వేర్పాటువాది యాసిన్ మాలిక్ పేరు
ఎన్ఐఏ దాఖలు చేసిన సప్లిమెంటరీలో జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ఛైర్మెన్ యాసిన్ మాలిక్ పేరును చార్జ్ షీట్లో చేర్చింది. ఇతనితో పాటు జమ్మూకశ్మీర్ డెమొక్రటిక్ ఫ్రీడం పార్టీ వ్యవస్థాపకుడు షబ్బీర్ అహ్మద్ షా, జమ్మూకశ్మీర్ ముస్లిం లీగ్ పార్టీ ఛైర్మెన్ మసరత్ ఆలం, దుఖ్తరన్ ఈ మిలాత్కు చెందిన సైదా ఆసియా ఆంద్రబి, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ రషీద్ షేక్ల పేర్లను చార్జ్షీట్లో చేర్చింది. కశ్మీర్లో అలజడి సృష్టించేందుకు వీరికి నిధులు సమకూరుతున్నాయని పేర్కొంటూ తొలిసారిగా 2017లో వీరిపై కేసు నమోదైంది. అప్పుడు లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ పేరు మాత్రమే చార్జ్షీట్లో చేర్చింది.
ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్న వేర్పాటువాదులు
ఇక విచారణ సందర్భంగా ఈ ఐదుగురి పేర్లు కూడా బయటకు వచ్చాయి. వీరు జమ్ము కశ్మీర్లో అలజడి సృష్టించడం, ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు తమ విచారణలో తేలినట్లు ఎన్ఐఏ తెలిపింది. దీంతో జమ్మూ కశ్మీర్లో 9 చోట్ల ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. సోదాల్లో భాగంగా 400 ఎలక్ట్రానిక్ వస్తువులు, 85 డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక దీని ఆధారంగా విచారణ వేగవంతం చేసింది ఎన్ఐఏ. వీరంతా ఎప్పుడు ఎలా అలజడి సృష్టించాలో అనేది ప్లాన్ చేసుకున్నారని ఎన్ఐఏ తెలిపింది.
ఉగ్రవాదుల నుంచి నిధులు
అలజడి ఎప్పుడు జరగాలో ఎక్కడ జరగాలో అనేది తేదీలతో సహా రాసుకున్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది. ఇలా కశ్మీర్లో అలజడి సృష్టించి అక్కడి ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావాలన్నదే టార్గెట్గా ఈ వేర్పాటు వాదులు పనిచేస్తున్నారని ఎన్ఐఏ వెల్లడించింది. పాకిస్తాన్ ఏజెన్సీలు ఉగ్రవాదుల నుంచి నిధులు సమకూర్చుకుని జమ్మూ కశ్మీర్లో దాడులకు ప్లాన్ చేసినట్లు చెప్పిన ఎన్ఐఏ .. దాడుల్లో భాగంగా రాళ్లు రువ్వడం, ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడం వంటివి చేసేందుకు కుట్రపన్నినట్లు ఎన్ఐఏ వెల్లడించింది.
వాట్సాప్ నుంచి వీడియోల వరకు...
ఇక విచారణ సందర్భంగా ఈ ఐదుగురు వేర్పాటు వాదుల వాట్సాప్, చాట్లు, మెసేజ్లు, వీడియోలను జాగ్రత్తగా పరిశీలించగా ఉగ్రవాదులతో సంబంధం ఉందని తేలినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. ఈ వీడియోలను పరిశీలిస్తే జమ్మూకశ్మీర్లో యువతను రెచ్చగొట్టడం, అక్రమాలకు పాల్పడాల్సిందిగా వారికి చెప్పడం, ఉగ్రవాదుల పట్ల సానుభూతి కలిగి ఉండటం చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఇదంతా పాకిస్తాన్ నుంచి వస్తున్న నిధులతోనే జరిగినట్లు ఎన్ఐఏ తెలిపింది. యాసిన్ మాలిక్, షబ్బీర్ షాల ఈమెయిల్స్ను రికవర్ చేసింది ఎన్ఐఏ. ఇందులో పాకిస్తాన్ నుంచి జరిగిన లావాదేవీలను గుర్తించారు అధికారులు.
పాక్ హైకమిషన్ కనుసన్నల్లోనే కశ్మీర్లో అలజడి ?
వేర్పాటువాది అయిన యాసిన్ మాలిక్కు హవాలా మార్గాల ద్వారా విదేశాల నుంచి నిధులు వచ్చేవని ఎన్ఐఏ గుర్తించింది. ఇక న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ నుంచి కూడా నిధులు అందేవని తెలిపింది. ఎక్కడ ఎలా వ్యవహరించాలో అనేది పాకిస్తాన్ హైకమిషన్ నుంచి వేర్పాటువాదులకు సూచనలు వెళ్లేవని ఆ ప్రకారంగా వీరు ఫాలో అవుతారని ఎన్ఐఏ వెల్లడించింది. ఇప్పటికే ఉగ్రవాది మసరత్ ఆలం నుంచి తగిన సమాచారం పొందామని చెప్పిన ఎన్ఐఏ, ఆసియా ఆంద్రబి, మాజీ ఎమ్మెల్యే రషీద్ల పాత్రపై కూడా ఆధారాలు దొరికినట్లు ఎన్ఐఏ తెలిపింది.