ఇదసలు భారత దేశమేనా? మా శరీరాన్ని చీల్చారు?: కన్నీరు పెట్టుకున్న ఫరూఖ్ అబ్దుల్లా
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడం వంటి చర్యల నేపథ్యంలో- ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పెద్ద దిక్కు ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పచ్చి అబద్ధాల కోరు అని అభివర్ణించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ప్రతిష్ఠ మసకబారేలా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. తనను గృహ నిర్బంధంలో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది స్వయంగా అమిత్ షాయేనని, అలాంటి వ్యక్తి నిండు సభలో అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి గల రాష్ట్ర హోదాను కేటాయించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన తరువాత ఫరూఖ్ అబ్దుల్లా మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఆయన కేంద్రంపై విరుచుకుపడ్డారు. నియంతలా పరిపాలిస్తున్నారని మండిపడ్డారు.
ఫరూఖ్ ను అరెస్టు చేయలేదు: అమిత్ షా
ఫరూఖ్ అబ్దుల్లా ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్నారు. శ్రీనగర్ లోని ఆయన సొంత ఇంట్లో.. బందీ అయ్యారు. ఫరూక్ అబ్దుల్లా గృహ నిర్బంధం వ్యవహారం మంగళవారం లోక్ సభ వాగ్వివాదానికి దారి తీసింది. ఆర్టికల్ 370 రద్దుపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ సభ్యురాలు సుప్రియా సులే ఈ అంశాన్ని సభలో లేవనెత్తారు. తన పక్కనే కూర్చునే ఫరూఖ్ అబ్దుల్లా నేడు చట్ట సభకు హాజరు కాలేకపోయారని, దీనికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. ఇదేనా మీరు కోరుకున్న జమ్మూ కాశ్మీర్? అంటూ నేరుగా ఆమె అమిత్ షాను టార్గెట్ గా చేసుకుని విమర్శలు గుప్పించారు. దీనిపై అమిత్ షా సమాధానం ఇస్తూ.. తాము ఫరూఖ్ అబ్దుల్లా అరెస్టు చేయలేదని అన్నారు. ఫరూఖ్ అబ్దుల్లా స్వచ్ఛందంగా ఇంట్లో గడుపుతున్నారని అన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మెదడు మోకాల్లో ఉందట!
మా శరీరాన్ని చీల్చారు..మా గుండెను కూడా కోసేయండి..
లోక్ సభలో అమిత్ షా చేసిన ప్రకటన పట్ల ఫరూఖ్ అబ్దుల్లా భగ్గుమన్నారు. నిండు సభలో అమిత్ షా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. ఓ ప్రైవేటు న్యూస్ ఛానల్ తో మాట్లాడారు. జమ్మూకాశ్మీర్ ను విభజించి, తమ శరీరాలను చీల్చేశారని అన్నారు. ఈ మాటలు అంటున్న సమయంలో ఫరూఖ్ అబ్దుల్లా కన్నీరు పెట్టుకున్నారు. మా శరీరాలను చీల్చేశారు. ఇక మా గుండెను కూడా కోసేయండి..` అంటూ ఆయన గద్గద స్వరంతో చెప్పారు. తనకు 81 సంవత్సరాల వయస్సు ఉందని, ఇలాంటి భారత దేశాన్ని తాను ఎప్పుడూ చూడలేదని చెప్పారు. ఇదసలు భారత దేశమేనా? అనే సందేహం తనకు కలుగుతోందని అన్నారు. ఇది భారత్ కాదని తాను విశ్వసిస్తున్నానని వాపోయారు.
ఈ దేశం ప్రతి ఒక్కరిదీ..
`భారత్ దేశం ప్రతి ఒక్కరిదీ. ఇక్కడ స్వేచ్ఛగా నివసించే హక్కు అందరికీ ఉంది. అయినప్పటికీ- కొంతమందికి మాత్రమే పరిమితం చేసేలా కేంద్రం ప్రవర్తిస్తోంది..` అని ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. భారత్ ప్రతి ఒక్కిరకీ దేశమే. హిందు, ముస్లిం, సిక్కులు, క్రైస్తవులు, ముస్లిం.. ఇలా అన్ని వర్గాలకూ చెందిన దేశం. దీన్ని కొంతమందికే పరిమితం చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇలాంటి భారత్ నేను ఎప్పుడూ చూడలేదు..` అని అన్నారు. కేంద్రం వేసే ఎత్తులకు తాము అంత తేలిగ్గా లొంగిపోమని, ఎదురుదాడికి దిగుతామని చెప్పారు. తన రాష్ట్ర ప్రజలను అకారణంగా, అన్యాయంగా జైలుపాలు చేస్తున్నారని విమర్శించారు.
మందులు లేవు, ఆహారమూ లేదు..
ప్రస్తుతం తాను గృహనిర్బంధలో ఉన్నానని ఫరూక్ అబ్దులా అన్నారు. ఇంట్లో భోజనం చేయనివ్వట్లేదని, మందులు అయిపోయాయని చెప్పారు. ప్రతి మూడు నెలలకూ ఓ సారి గోధుమలు, చక్కెర వంటి నిత్యావసర సరుకులను కాశ్మీరీలకు అందజేస్తున్నామని అమిత్ షా చెప్పడం పచ్చి అబద్ధమని అన్నారు. వాటిని కొనుగోలు చేయడానికి డబ్బులు సంపాదించుకునే మార్గాలు లేవని, వాటిని సరఫరా చేసి ఏం చేస్తారని ప్రశ్నించారు. కేంద్రానికి శాంతియుతంగా తాము నిరసన వ్యక్తం చేస్తామని అన్నారు. తామేమీ రాళ్లు, గ్రెనేడ్లు విసిరే వాళ్లం కాదని గుర్తు చేస్తున్నానని చెప్పారు.