Interesting:ఏనుగుల పేరిట ఆస్తి బదిలీ ..ఎందుకు, ఎంత రాశాడో తెలుసా...?
పాట్నా: కొద్ది రోజుల క్రితం కేరళలో గర్భం దాల్చిన ఏనుగు మృతి చెందిన విషయం సంచలనం రేపింది. అయితే ఆ ఏనుగు మృతికి కారణం ఎవరో అనేదానిపై విచారణ జరుగుతోంది. ఇప్పటికే కేసులో కొన్ని అరెస్టులు జరిగాయి. ఇదిలా ఉంటే మనిషి అనే వాడు మూగజంతువులపై ఇంత క్రూరంగా ప్రవర్తిస్తాడా అనే అంశం సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరిగింది. ఏనుగు ఘటన తర్వాత మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Recommended Video
కేరళ ఏనుగు హత్య: పైనాపిల్ కాదు.. బాంబులు పెట్టిన కొబ్బరికాయ తినడంతోనే..
అదే ఓ భారీ కొండచిలువ ఓ జింకను చుట్టేయగా అది ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఓ వ్యక్తి కొండ చిలువను కర్రతో కొట్టగా అది జింకను వదిలేసింది. దీంతో బతుకు జీవుడా అంటూ ఆ జింకా పరుగులు తీసింది. ఈ సందర్భంలో కఠినమైన మానవులే కాదు.. కనికరం ఉన్న మానవులు కూడా ఉన్నారని ఈ ఘటన నిరూపించింది. తాజాగా మరో వ్యక్తి కథ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు.. ఆయన కథేంటి..?
రాణి, మోతీలంటే ప్రాణం
బీహార్లో నిసించే అక్తర్ ఇమామ్ అనే వ్యక్తి రెండు ఏనుగులను పెంచుకుంటున్నాడు. ఈ రెండు ఏనుగులను సొంత బిడ్డల్లా చూసుకుంటున్నాడు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ అక్తర్ ఇమామ్ చేసిన ఒక ప్రకటన మాత్రం అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. తన తర్వాత తన ఆస్తి మొత్తం ఆ రెండు ఏనుగులు అయిన మోతీ, రాణి, పేరిట రాస్తానని చెప్పాడు. ఇప్పుడు ఇదే చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. అక్తర్ 12 ఏళ్ల వయసు నుంచే ఈ రెండు ఏనుగులను పెంచుకుంటున్నాడు. ఇందులో మోతీ అనే ఏనుగు వయస్సు 20 సంవత్సరాలు ఉండగా రాణికి 15 ఏళ్లు. కేరళలో గర్భం దాల్చిన ఏనుగు మానవుడి కర్కశత్వానికి బలికాగా ఆ వార్తను జీర్ణించుకోలేకపోయిన దేశ ప్రజలకు నిజంగా అక్తర్ వార్త చాలా ఊరటనిచ్చిందని చెప్పొచ్చు.
ఏనుగుల పేరిట కొన్ని ఎకరాల భూమి బదిలీ..
ఇక అక్తర్ ఇమామ్ ఏషియన్ ఎలిఫెంట్ రీహాబిలిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ యానిమల్ ట్రస్ట్కు అధ్యక్షుడుగా కూడా ఉన్నారు. ఇక తాను పెంచుకుంటున్న మోతీ, రాణి అనే ఈ రెండు ఏనుగుల పేరిట 6.25 ఎకరాల భూమిని బదిలీ చేశాడు. తన మరణం తర్వాత ఈ రెండు ఏనుగులు ఆకలితో ఎప్పుడూ బాధపడకూడదనే తాను ఆస్తిని రాసిఉంచినట్లు అక్తర్ చెప్పారు. సాధారణంగా ఆసియా జాతికి చెందిన ఏనుగులు 48 ఏళ్ల పాటు జీవిస్తాయి. అదే ఆఫ్రికన్ ఏనుగులు అయితే 56 ఏళ్ల వరకు జీవిస్తాయి. అయితే కొన్ని ఏనుగులు మాత్రం చాలా తక్కువ సమయం వరకే జీవిస్తాయి. దంతాల కోసం మనిషి సాగించే వేట ఒక కారణంగా నిలుస్తుండగా కరవు, నివాస ప్రదేశాలు ధ్వంసం కావడం వంటివి కూడా కొన్ని కారణాలుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఏనుగులు మరణిస్తే...
ఇక రెండు ఏనుగులు తన కుటుంబ సభ్యులతో సమానం అంటున్నారు అక్తర్. అవి తన కళ్ల ముందు కనిపించకుంటే తాను ఉండలేనని చెప్పారు. అందుకే వీటి బాగోగుల కోసం తన భూమిని రెండు ఏనుగుల పేరిట రాసినట్లు చెప్పాడు అక్తర్. అంతేకాదు తన మృతి తర్వాత మోతీ రాణి అనే ఈ రెండు ఏనుగులు కూడా మరణిస్తే అప్పుడు ఆ ఆస్తి మొత్తం ప్రభుత్వంకు వెళ్లేలా డాక్యుమెంట్స్లో రాసి ఉంచినట్లు తెలిపారు. తన భార్య నుంచి పదేళ్ల క్రితం విడాకులు తీసుకున్న తర్వాత ఇక అప్పటి నుంచి పాట్నాలోని ఫూల్వారీషరీఫ్ ప్రాంతంలో ఈ రెండు ఏనుగులతో కలిసి జీవిస్తున్నాడు.
క్రిమినల్ నుంచి కాపాడిన మోతీ అనే ఏనుగు
ఓ సారి కొందరు దుండగులు తనను చంపేసేందుకు రాగా.. అప్పుడు మోతీ అనే ఈ ఏనుగు తన ప్రాణాలను కాపాడిందని గుర్తు చేశారు. ఓ రోజు పక్కనే ఉన్న గ్రామంలో ఒక ఏనుగుకు జబ్బు చేసిందంటే చికిత్స చేద్దామని మోతీతో కలిసి వెళ్లినట్లు చెప్పాడు. ఇక ఆ రాత్రి అక్కడే బసచేయాల్సి రావడంతో మోతీని అక్కడే తన గది బయట ఇనుప చైన్లతో కట్టేసి తాను పడుకున్నట్లు చెప్పాడు. అప్పుడే ఓ దుండగుడు తుపాకీతో తనపై దాడిచేసేందుకు వచ్చాడని ఆ సమయంలో మోతీ గట్టిగా ఘీంకరించిందని దీంతో నిద్ర మేల్కొని చూడగా తుపాకీతో దుండగుడు కనిపించినట్లు చెప్పాడు. తాను గట్టిగా కేకలు పెట్టినట్లు చెప్పిన అక్తర్... అప్పటికే మోతీ ఇనుప గొలుసును తెంపుకుని ఆ క్రిమినల్ను తరిమివేసిందని గుర్తు చేశాడు.
దేశవ్యాప్తంగా శిక్షణ ఇస్తున్న అక్తర్
ఇక రెండు ఏనుగుల పేరిట ఆస్తి బదిలీ చేసినందున తన కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉండొచ్చనే అనుమానంతో ముందస్తుగా ఫారెస్టు అధికారులకు జిల్లా ఎస్పీలకు సమాచారం ఇచ్చారు. ఆ రెండు ఏనుగులపై తనకు ఎంత ప్రేమ ఉందంటే వాటి పేరు మీద బ్యాంకు ఖాతా తెరిచి అందులో రూ.50,000 వరకు ఉంచాడు. ఇక ఏనుగులంటే ఎంతో ఇష్టం అని చెప్పే అక్తర్... దేశవ్యాప్తంగా పర్యటించి ఏనుగులకు ఎలాంటి హాని తలపెట్టకుండా వాటిని ఎలా కంట్రోల్ చేయాలనేదానిపై శిక్షణ ఇస్తున్నట్లు చెప్పాడు. అంతేకాదు ఏనుగుల దంతాలు, ఎముకలు స్మగ్లింగ్ అవుతున్న నేపథ్యంలో క్యాంపెయినింగ్ కూడా నిర్వహిస్తున్నారు అక్తర్.