ఆకట్టుకునేలా: రేపటి నుంచే చలామణిలోకి రూ.200 నోటు
సెప్టెంబర్ మొదటి వారంలో వస్తుందనుకున్న రూ.200 నోటు ముందే వచ్చేస్తోంది. శుక్రవారం(ఆగస్టు25) నుంచే కొత్త రూ.200 నోటు చలామణీలోకి రానున్నట్లు భారత రిజర్వు బ్యాంక్ ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది.
ముంబై: సెప్టెంబర్ మొదటి వారంలో వస్తుందనుకున్న రూ.200 నోటు ముందే వచ్చేస్తోంది. శుక్రవారం(ఆగస్టు25) నుంచే కొత్త రూ.200 నోటు చలామణీలోకి రానున్నట్లు భారత రిజర్వు బ్యాంక్ ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. నవంబరు 8 పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్తగా విడుదలవుతున్న నోటు ఇదే కావడం గమనార్హం.
కాగా, రూ.200 నోటు ఆకర్షణీయంగా రూపొందించారు. కొత్తగా విడుదల కానున్న ఈ నోటు ముదరు పసుపు రంగులో ఉంది. నోటు వెనుక భాగాన భారతదేశ సంప్రదాయ వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా సాంచీ స్తూపం బొమ్మను ముద్రించారు. ఈ నోటు ఎంపిక చేసిన కొన్ని బ్యాంకులు, ఆర్బీఐ కార్యాలయాల్లో శుక్రవారం నుంచి అందుబాటులోకి రానుంది.
కాగా, పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎదురవుతున్న చిల్లర సమస్యలను కూడా రూ.200 నోటు తగ్గించనుంది. అక్రమ నగదు చెలామణీ.. నకిలీ కరెన్సీ నోట్లకు అడ్డుకట్ట వేసేందుకు రూ.200నోటును ముద్రిస్తున్నట్లు గతంలో ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే.
రూ.100, రూ.500 మధ్య మరో కరెన్సీ నోటు ఇప్పటి వరకూ లేకపోవడం గమనార్హం. దీంతో రూ.200నోటు మంచి ఆదరణ పొందుతుందని ఆర్బీఐ భావిస్తోంది. అయితే, రూ.200 నోటు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో రూ.2వేల నోట్ల ముద్రణను తగ్గించే అవకాశం ఉంది.