వలస కార్మిక కష్టాలకు సింబాలిక్ గా .. మనసును పిండేస్తున్న రాంపుకార్ పండిట్ ఫోటో వెనుక అసలు కథ ఇదే
ప్రస్తుతం నిరుపేద వలసకార్మికుల కష్టానికి వారు ఎదుర్కొంటున్న విషాదానికి చిహ్నంగా నిలిచింది రాంపుకార్ పండిట్ హృదయ విదారక చిత్రం . ఇండియా మొత్తంగా ఈ చిత్రం వలస కార్మికుల పరిస్థితికి అద్దం పడుతుంది . లాక్ డౌన్ సమయంలో వలస కార్మికుల బాధలకు దర్పణంగా నిలుస్తుంది రాంపుకార్ పండిట్ ఫోటో . ఇంటికి చేరే మార్గం దొరక్క ఫోన్లో ఏడుస్తూ మాట్లాడుతున్న ఓ వలస కార్మికుడైన రాంపుకార్ పండిట్ కు సంబంధించిన ఫొటో వెనుక కన్నీళ్లు తెప్పించే కథ ఉంది. ఆ కథ తెలుసుకున్న ప్రతిఒక్కరి మనసును కలచివేస్తుంది.
'విడిచిపెడితే నడిచి నేను పోతా సారూ' .. మనసును మెలిపెడుతున్న వలస జీవుల వెతలపై పాట
చిత్రం చెప్పిన కథ .. రాం పుకార్ పండిట్ హృదయ విదారక బాధ
ఢిల్లీలో ఒక లేడీ ఫొటోగ్రాఫర్ అనుకోకుండా తీసిన రాంపూర్ పండిట్ హృదయ విదారక బాధ వెనుక పెద్ద కథ ఉంది . 39 ఏళ్ల వయసున్న రామ్ పుకార్ పండిట్ ఓ భవన నిర్మాణ కార్మికుడు. బీహార్ నుంచి వలస వచ్చి ఢిల్లీలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు . ఇక తాను సంపాదించింది కుటుంబానికి పంపి జీవనం సాగిస్తున్న అతన్ని కరోనా లాక్ డౌన్ తీరని వేదనకు గురి చేసింది. పని లేదు. ఇంటికి వెళ్ళే మార్గం లేదు.
కొడుక్కి జబ్బు చేసి సీరియస్ గా ఉన్నా వెళ్ళలేకపోయిన ఓ పేద వలస కార్మికుడి పరిస్థితి
అతడికి భార్య, ముగ్గురు అమ్మాయిలు , ఓ అబ్బాయి ఉన్నారు. వాళ్లంతా తమ స్వస్థలం అయిన బీహార్ లోనే ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా అతను రెండు నెలలుగా ఢిల్లీలోనే చిక్కుకుపోయి ఉన్నాడు. ఇంటికి వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇంతలో మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా ఏడాది లోపు వయసున్న అతడి కొడుక్కి జబ్బు చేసింది. సరైన వైద్యం అందక పరిస్థితి విషమించింది. అతడి ప్రాణం నిలిచే అవకాశం లేదని తేలిపోయింది. కొడుకును చివరి చూపు అయినా చూసుకుందామని బయల్దేరాడు రాం పుకార్ కుమార్. కానీ అతను చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి.
కొడుకు కోసం , కుటుంబం కోసం ఆక్రోశించిన రాం పుకార్ పండిట్ ఫోటో వైరల్
అక్కడ కొడుకు ప్రాణాల కోసం కొట్టు మిట్టాడుతున్నాడని ఫోన్లో తెలుసుకున్న రాం పుకార్ పండిట్ విలవిలలాడిపోయాడు. ఆ సమయంలో తీసిన ఫోటో .. అతని మనో వేదనకు , తన వారి కోసం నరాలు చిట్లిపోతున్నంత బాధతో విలపిస్తున్న తీరుకు అద్దం పడుతుంది. ఆ బాధతో ఏడుస్తూ మాట్లాడుతుండగా ఫొటో జర్నలిస్టు తీసిన ఆ చిత్రం ఇప్పుడు వైరల్ గా మారింది .ఆమె అతడి వివరాలు తెలుసుకుని, డబ్బులిచ్చి, పోలీసుల అనుమతి కూడా సంపాదించి అతణ్ని ఢిల్లీ దాటించింది. ఆమె చేసిన సహాయంతో బీహార్లోని బెగుసరాయ్ సిటీకి చేరుకున్నాడు కానీ అక్కడి నుంచి తన గ్రామానికి వెళ్లలేకపోయాడు.
కుమారుడి మరణం .. అయినా వెళ్ళలేని దుర్భర జీవితం .. ఇది వలస కార్మిక జీవితం
ఇంతా ప్రయత్నం చేసినా రాం పుకార్ తన వాళ్ళ దగ్గరకు వెళ్ళలేకపోయాడు . ఇంతలోతన ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడు. ఖననం కూడా జరిగిపోయింది. కొడుకును చివరి చూపైనా చూసుకోకుండా రాం పుకార్ కపూర్ క్వారంటైన్ లోనే విలవిలలాడాడు . ప్రస్తుతం బెగసరాయ్లోనే అతను క్వారంటైన్లో ఉన్నాడు. తన ఒక్కగానొక్క సంవత్సరం వయసున్న కుమారుడిని కోల్పోయిన తండ్రి పడుతున్న బాధ వర్ణనాతీతం . కొడుకు చనిపోయాడని తెలిసినా వెళ్ళలేకపోయాడు . ప్రస్తుతం బెగసరాయ్లో ఉన్న అతన్ని భార్య కుమార్తె దూరం నుండి చూశారు . కానీ కరోనా లాక్ డౌన్ ఒక వలస కార్మికుడికి వర్ణనాతీతమైన బాధను , మానని గాయాన్ని మిగిల్చింది .