డసాల్ట్తో చాలామందికి తెలియని భారత్ ఫస్ట్ డీల్ ఇదే... రాఫెల్ కంటే ముందు అప్పట్లో...
రాఫెల్ యుద్ద విమానాల చేరికతో భారత వాయుసేన బలం అమాంతం పెరిగింది. భారత అమ్ముల పొదిలో చేరిన ఈ అత్యాధునిక యుద్ద విమానాలు శత్రు దేశాల గుండెల్లో గుబులు పుట్టిస్తాయనడంలో సందేహం అక్కర్లేదు. బుధవారం(జూలై 29) హర్యానాలోని అంబాలాలో ల్యాండ్ అయిన రాఫెల్ యుద్ద విమానాలను యావత్ దేశం ఆసక్తిగా తిలకించింది. ఫ్రాన్స్కి చెందిన డసాల్ట్ ఏవియేషన్తో ఒప్పందం మేరకు మొదటి విడుతలో భారత్కు ఐదు రాఫెల్ యుద్ద విమానాలు చేరాయి. చాలామందికి తెలియని విషయమేంటంటే డసాల్ట్ ఏవియేషన్తో భారత్కు ఇది రెండో ఒప్పందం.
Recommended Video
అప్పట్లో పాక్ F-16 కొనుగోలు చేయడంతో...
1980లో దాయాది దేశం పాకిస్తాన్ అమెరికా నుంచి F-16 యుద్ద విమానాలను కొనుగోలు చేసింది. అప్పటికీ భారత్ వద్ద MIG-21,MIG-23 యుద్ద విమానాలున్నాయి. అయితే పాక్ కొనుగోలు చేసిన అత్యాధునిక యుద్ద విమానాల స్థాయికి ఇవి సరిపోవు. దీంతో భారత్ కూడా అత్యాధునిక యుద్ద విమానాల కొనుగోలుపై దృష్టి సారించింది. అలా మిరాజ్ 2000 యుద్ద విమానాల గురించి తెలుసుకుంది. యుద్ద రంగంలో అప్పటికి అందుబాటులో ఉన్న విమానాలతో పోలిస్తే మిరాజ్ 2000 శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువ.
డసాల్ట్ నుంచి మిరాజ్ 2000 కొనుగోలు...
మిరాజ్ 2000 యుద్ద విమానాల గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసిన భారత్ ఎట్టకేలకు డసాల్ట్ ఏవియేషన్తో ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం 36 సింగిల్ సీట్ మిరాజ్ 2000 యుద్ద విమానాలు,నాలుగు ట్విన్ సీట్ మిరాజ్ 2000THs యుద్ద విమానాలకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో మొదటి విడతగా ఏడు మిరాజ్ విమానాలు జూన్ 29,1985న భారత్కు చేరాయి. ఇది జరిగిన 15 ఏళ్ల తర్వాత అదే కంపెనీకి చెందిన రాఫెల్ యుద్ద విమానాలను భారత్ కొనుగోలు చేయడం,నేడు అవి భారత్ గడ్డపై అడుగుపెట్టడం గమనార్హం.
బాలాకోట్ దాడిలో మిరాజ్ 2000
అప్పట్లో ఫ్రాన్స్ కాకుండా మిరాజ్ 2000ని ఉపయోగించిన మరో దేశం భారత్ మాత్రమే. తక్కువ ఎత్తులో ఎగురుతూ యుద్ద భూమిలో శత్రువులపై దాడి చేయగలిగే సామర్థ్యం దీని ప్రత్యేకత.1990లో జరిగిన కార్గిల్ వార్లో మిరాజ్ 2000 యుద్ద విమానాలు గేమ్ చేంజర్ పాత్రను పోషించాయి. గతేడాది పాకిస్తాన్లోని బాలాకోట్లో జైషే మహమ్మద్ శిబిరాలపై దాడులు చేయడంలోనూ మిరాజ్ 2000 యుద్ద విమానాలే కీలకంగా వ్యవహరించాయి. ఇజ్రాయెల్ స్పైస్ 2000 బాంబ్స్తో ఉగ్ర శిబిరాలపై దాడులు చేశాయి.
రాఫెల్ ప్రత్యేకతలు...
డసాల్ట్ ఏవియేషన్తో కుదుర్చుకున్న రెండో ఒప్పందంలో భాగంగా మొత్తం 36 రాఫెల్ విమానాలు భారత్ చేరాల్సి ఉంది. మొదటి విడతలో ఐదు రాఫెల్ విమానాలు బుధవారం భారత్లో అడుగుపెట్టాయి. ఇందులో మూడు సింగిల్ సీటర్ జెట్ ఫైటర్లు, రెండు ట్విస్ సీటర్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. హ్యామర్ మాడ్యులర్ ( Hammer Moduler ) రాకెట్స్ సహా వివిధ రకాల ఆయుధాలను ఇందులో అమర్చవచ్చు. గంటకు 1389కి.మీ వేగంతో అవిరామంగా 3700 కిలోమీటర్లు ప్రయాణించడం దీని ప్రత్యేకత. రాత్రి,పగలు,పల్లపు ప్రాంతాలు,పర్వతాలు అన్న తేడా లేకుండా ఎక్కడైనా రాఫెల్ తన లక్ష్యాన్ని పూర్తి చేయగలదు.