3BHK: ఇంద్రాణిని బ్లాక్ మెయిల్ చేసిన షీనా బోరా
ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యేకేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కన్న కూతురినే ఇంద్రాణి ముఖార్జియా చంపడానికి ఇదే కారణమని షీనాబోరా హత్యకేసుని దర్యాప్తు చేస్తోన్న పోలీసులు భావిస్తున్నారు. షీనాబోరా ఏకంగా తన తల్లినే బ్లాక్ మెయిల్ చేసిందట.
ముంబైలోని అత్యంత ధనిక ప్రాంతాల్లో ఒకటైన బాంద్రాలో త్రిబుల్ బెడ్రూం ప్లాట్ కావాలని కోరిందట. అది కొనివ్వకుంటే 'నీ గత జీవితానికి సంబంధించిన వివరాలన్నీ రాహుల్, పీటర్ లకు చెప్పేస్తా. నీ చెల్లెలిగా వారు నా మాట నమ్ముతారు' అని బెదిరించిందని కారు డ్రైవర్ రాయ్ పోలీసు విచారణలో పోలీసులకు తెలిపాడని సమాచారం.
'ఏమే.. నాకు పుట్టి నన్నే బెదిరిస్తావా, త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ అడుగుతావా.. ఇప్పుడు తీస్కోవే.. త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్..' అంటూ ఇంద్రాణి తన కూతురు షీనా గొంతు నులుముతుంటే కదలనివ్వకుండా ఆమె రెండో భర్త సంజీవ్ ఖన్నా పట్టుకున్నాడు. ఆ సమయంలో కారు లోపలే ఉన్న డ్రైవర్ శ్యామ్ రాయ్ పోలీసుల విచారణలో షీనా బోరా హత్యకు సంబంధించిన పలు కీలక విషయాలను వెల్లడించాడు.
దీంతో ఆర్ధిక కారణాలే ఇంద్రాణిని హత్యకు పురికొల్పిన ప్రధాన కారణం ఇదే కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఒకవేళ షీనాకు ఫ్లాట్ కొనిచ్చినప్పటికీ మళ్లీ తనను బ్లాక్ మెయిల్ చేయకుండా ఉంటుందనే నమ్మకం లేదని ఆలోచించిన ఇంద్రాణి షీనాను అడ్డు తొలిగించుకోవడం ఒక్కటే దారని కన్న కూతురిని హత్య చేసింది.
వీటితో పాటు పీటర్ ముఖర్జియాకు చెందిన ఆస్తి లావాదేవీలు కూడా హత్యకు మరో కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఈ కేసులో మూడో నిందితుడిగా ఉన్న డ్రైవర్ శ్యామ్ రాయ్ అప్రూవర్గా మారేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. సాధ్యమైనంతమేరలో శిక్ష నుంచి తప్పించుకోవాలని భావిస్తున్న శ్యామ్ రాయ్ అప్రూవర్గా మారాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇదే గనుక జరిగితే, గడిచిన నెల రోజులుగా సంచలనాలు సృష్టించిన షీనా బోరా హత్యకేసు ఓ కొలిక్కి వచ్చినట్లేనని ముంబై పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.