విషం చిమ్మిన పాక్ మీడియా: అయోధ్య తీర్పుపై తప్పుడు కథనాలతో రిపోర్టింగ్
కరాచీ: దశాబ్దాలుగా వివాదాస్పదంగా మారిన అయోధ్య రామమందిరం బాబ్రీ మసీదు అంశంలో సుప్రీంకోర్టు అందరికీ ఆమోదయోగ్యమైన తీర్పు ఇచ్చింది. ఈ చారిత్రాత్మక తీర్పులో వివాదాస్పదంగా మారిన భూమిని రాముడి ఆలయంకు అప్పగిస్తూ అదే సమయంలో మసీదు నిర్మాణం కోసం ఐదెకరాల స్థలం సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలంటూ కేంద్రానికి సూచించింది. ఇక సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును విదేశీ మీడియా సైతం కొనియాడుతుండగా... దాయాది దేశం పాకిస్తాన్ మీడియా మాత్రం విషం చిమ్మింది. ఇంతకీ పాక్ మీడియా ఎలాంటి కథనాలు ప్రసారం చేసింది..?
తీర్పుపై విషం చిమ్మిన పాక్ మీడియా
ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన అంశం అయోధ్య భూవివాదం కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పును ఇచ్చిందని విదేశీ మీడియా కొనియాడింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రశంసలు కురిపించింది. కానీ పక్కనే ఉన్న పాకిస్తాన్ మీడియా మాత్రం కడుపుమంటతో రగిలిపోయింది. భారత దేశంలో ఉన్న ముస్లిం సంస్థలే సుప్రీంకోర్టు ఇచ్చి తీర్పును ప్రశంసిస్తుండగా ... పాకిస్తాన్ మీడియా మాత్రం తన కడుపు మంటను బయటపెట్టింది. సుప్రీంకోర్టు తీర్పు రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టేలా ఉందంటూ కథనాలను ప్రసారం చేసింది.
తీర్పు చిచ్చుపెట్టేలా ఉందన్న డాన్ పత్రిక
భారత్లోని హిందువులు ముస్లింలు కలిసి మెలిసి ఉంటున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఒక వర్గానికి తీర్పు అనుకూలంగా ఇచ్చి రెండు వర్గాలను చీల్చేలా ఉందని పాక్ ప్రధాన మీడియా డాన్ తన కథనంలో రాసుకొచ్చింది. 1.3 బిలియన్ జనాభాలో 14శాతం ఉన్న హిందువులు ముస్లింల మధ్య సుప్రీంకోర్టు ఇచ్చిన ఏకగ్రీవ తీర్పు చిచ్చు పెట్టేలా ఉందని రాసుకొచ్చింది.
జియో టీవీ ఎలాంటి కథనం ప్రసారం చేసిందంటే..
వివాదాస్పదంగా మారిన బాబ్రీ మసీదుకు సంబంధించిన భూమిని అయోధ్య ఆలయంకు కేటాయిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందంటూ పాక్ కేంద్రంగా పనిచేస్తున్న మరో మీడియా జియో టీవీ కథనాలను ప్రసారం చేసింది. ధ్వంసమైన బాబ్రీ మసీదు స్థానంలో మరో మసీదు నిర్మాణం కోసం వేరుగా భూమి కేటాయించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని కథనాలను ప్రసారం చేసింది.
ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ కథనం ఇలా..
బాబ్రీ మసీదు భూమి హిందువులకు కేటాయిస్తూ భారత సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని కథనాలను ప్రచురించి భారత్లో చిచ్చుపెట్టేందుకు ప్రయత్నించింది మరో పాక్ మీడియా ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్. అంతేకాదు అయోధ్య తీర్పు భారత ప్రధాని నరేంద్ర మోడీకి అతిపెద్ద విజయంగా తన కథనంలో అభివర్ణించింది. ఇక బారత్లో మైనార్టీలకురక్షణ ఎక్కడుందని కథనంలో ప్రశ్నించి విషం చిమ్మింది.