కిల్ఫీగా మారిన సెల్ఫీ: దుస్సాహసంతోనే ప్రాబ్లం
సెల్ఫీ మోజు ప్రాణాలు తీస్తున్నది. దుస్సాహం చేసి సెల్తో ఫొటోలు దిగాలని అనుకొంటున్నవారు మృత్యుముఖంలో పడిపోతున్నారు.
న్యూఢిల్లీ: సెల్ఫీ మోజు ప్రాణాలు తీస్తున్నది. దుస్సాహం చేసి సెల్తో ఫొటోలు దిగాలని అనుకొంటున్నవారు మృత్యుముఖంలో పడిపోతున్నారు.. ప్రపంచంలో కెల్లా ఇండియాలోనే ఈ వైపరీత్యపు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నట్లు అమెరికాలోని కెర్నెగీ మిలాన్ మూనివర్సిటీ, ఢిల్లీలోని ఇంద్రప్రస్థ ఇన్ఫరేషన్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు నిర్వహించిన సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది.
2014 మార్చి నుంచి 2016 సెప్టెంబర్ మధ్య వివిధ దేశాల్లో సెల్ఫీ మోజుతో 127 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో భారతీయులే 76 మంది ఉన్నారంటే మన దేశంలో సెల్ఫీ క్రేజ్ ఏస్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఏవైనా ఘటనలకు గుర్తుగా, తరువాత చూసుకొని సంతోషించడానికి మామూలుగా సెల్ఫీలు తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు.
కెమెరా ఫోన్లు, స్మార్ట్ ఫోన్ల రాకతో ఇలా
కానీ కెమెరా ఫోన్లు, స్మార్ట్ ఫోన్ల రాకతో కథ మారింది. సోషల్ మీడియా ప్రభావంతో యువత తాము వివిధ సందర్భాల్లో తీసుకొంటున్న ఫొటోలతో స్నేహితులకు పంచుకొనే అలవాటు బాగా పెరిగింది. ఇంటర్నెట్, వాట్సప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా కనెక్షన్లు అరచేతిలోకి అందుబాటులో రావడం, షేరింగ్లు, లైకింగ్ల పేరుతో సెన్షేషన్ కోసం క్రేజీ తీవ్రమై సెల్ఫీ..కిల్ఫీగా మారుతున్నది.
లైకుల కోసం ఆరాటం
సోషల్ మీడియాలో పెట్టే ఫొటోలకు ఎక్కువ లైకులు సంపాదించుకోవాలనే ఉత్సాహం, పోటాపోటీగా మారింది. దీనికి తోడు తమ పోస్టింగులు వైరల్ కావాలన్న ఫీవర్ పెరగడం మరొకటి. కొత్తదనంతో కూడిన సెల్ఫీల వేటలో యువత ఆ పని ఎంత ప్రమాదకరమైందన్న విషయం గమనించడం లేదు. అంతే తప్ప భద్రతాపరంగా సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఒకరు రైలు పట్టాల మీద నిలబడి సెల్ఫీ దిగితే, మరొకరు తాను అంతకుమించిన ఘనత సాధించాలన్న ఆశతో రైలు వస్తుండగా పట్టాల మీద నిలుచుని ఫొటో తీసుకొని దోస్తులకు పంపుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇది చూసి ఇంకొకరు జలాశయాలు, జలపాతాలకు దగ్గరగా, కొండలు, భవనాల అంచున నిలబడి సెల్ఫీలు తీసుకొంటున్నారు. ఆ ప్రయత్నాలు బెడిసికొట్టి ప్రాణాలు కోల్పోతున్నారు.
సెల్ఫీతో అలలకు బలి
ముంబైలో ఇటీవల ప్రీతి పీసే అన్నే 17 ఏండ్ల అమ్మాయి ఫ్రెండ్స్తో కలిసి మెరైన్ డ్రైవ్ ప్రాంతానికి వెళ్లింది. సముద్రం దగ్గర నీళ్లలో నిలుచుని సెల్ఫీ తీసుకొంటుండగా, పెద్ద అల వచ్చి కొట్టుకుపోయింది. 2016 మే9న బాంద్రా వద్ద బీచ్లో తరన్నుమ్ అన్సారీ అనే 18 ఏండ్ల యువతి కూడా ఇలాగే మరణించింది. ఆమెను కాపాడటానికి సముద్రంలోకి దూకిన రమేశ్ వలుంజ్ అనే వ్యక్తి కూడా చనిపోయాడు.
ఈ ఘటన చూశాక తరన్నుమ్ సోదరుడు ఇషాక్..సెల్ఫీ కాదు ముందు మీ భద్రత గురించి ఆలోచించండి. మీరు బతికుంటే ఎన్ని ఫొటోలైనా తీసుకోవచ్చు అని యువతకు హితవు పలికారు. తరన్నుమ్ను రక్షించడానికి ఆమె భర్త కూడా ముందూ వెనుక ఆలోచించక ప్రాణాలు పొగోట్టుకున్నారు. ఆయన లేక నా పిల్లల్ని పోషించుకోవడం కష్టంగా మారింది. ఈ ఘటన చూసైనా ఇతరులు గుణపాఠం నేర్పుకోవాలని రమేశ్ వలుంజ్ భార్య కల్పన అన్నారు.
బీచ్లు తదితర చోట్ల సెల్ఫీ ప్రమాదాలు నివారించడానికి మేం చర్యలు తీసుకొంటున్నాం. ప్రజలను హెచ్చిరిస్తున్నామని ముంబై జోన్-9 డీసీపీ పరంజిత్ చెప్పారు. 'మీరు తీసుకునే సెల్ఫీ మీ ప్రాణాలు తీసుకునేదిగా ఉండరాదు' అని పోలీసులు ట్విట్టర్ ద్వారా కూడా యువతను హెచ్చరిస్తున్నారు. సెల్ఫీ క్రేజ్ యువతలోనే కాదు పెద్దల్లో కూడా ఎక్కువగానే ఉంటున్నదని క్లినికల్ సైకాలజిస్టు సల్మా ప్రభు తెలిపారు.