కాంగ్రెస్ను ప్రియాంకా ఇందుకే వీడిందా...అసలు కథ ఏంటి..?
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా చతుర్వేది శుక్రవారం శివసేన తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. శివసేనలోకి కొత్త సోదరి వచ్చిందని ఈ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే అన్నారు. ఏప్రిల్ 28 మహారాష్ట్రలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రియాంకా చతుర్వేది పార్టీ మారడం కాంగ్రెస్కు నిజంగా షాకే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. యువతను ప్రభావితం చేయడం... సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండటంతో కాంగ్రెస్ ఆమెకు ఉన్నత స్థానం కల్పించింది.
ప్రియాంకాలో ఎందుకంత అసంతృప్తి..?
మథురాలో తనపై అసభ్యంగా ప్రవర్తించిన వారిని కాంగ్రెస్ పార్టీ తిరిగి చేర్చుకోవడంపై ప్రియాంకా చతుర్వేది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే పార్టీని వీడేందుకు నిజంగా ఇదే కారణమా..? లేక టికెట్ రాలేదనే అసంతృప్తి కూడా ఉందా..? అనేదానిపై చర్చ జరుగుతోంది. వాస్తవానికి ప్రియాంకా చతుర్వేది ఉత్తర ముంబై లోక్సభ స్థానం టికెట్ ఆశించినట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే రాఫెల్ ఒప్పందం గురించి మాట్లాడేందుకు ఓ మీడియా సమావేశాన్ని మథురాలో ఏర్పాటు చేశారు. మీడియా సమావేశం సందర్భంగా చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారు.
ప్రియాంకా చతుర్వేదితో అసభ్యంగా ప్రవర్తించిన కాంగ్రెస్ నేతలు
సమావేశం మధ్యలోనే ప్రియాంకా చతుర్వేది వెళ్లిపోయారు. తన గదిలో ఉండగా అక్కడికి కూడా కాంగ్రెస్ నేతలు వెళ్లారు. దీనిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని భావించింది ప్రియాంకా చతుర్వేది. ఇక మథురా కాంగ్రెస్ నేతలు అశోక్ చక్లేశ్వర్, ఉమేష్ పండిల్, ప్రతాప్ సింగ్, అబ్దుల్ జబ్బర్, గిర్ధారీ లాల్ పాటక్, భూరి సింగ్ జయాస్, ప్రవీణ్ ఠాకూర్, యతీంద్రల పై ఫిర్యాదు చేయడంతో వీరిని సస్పెండ్ చేసింది కాంగ్రెస్. అయితే ఏప్రిల్ 15న తిరిగి వారందరినీ పార్టీలోకి చేర్చుకుంది కాంగ్రెస్. వీరంతా క్షమాపణ కోరుతూ రాతపూర్వకంగా ఇచ్చారు. వారిని పార్టీలోకి తీసుకోవడంపై ప్రియాంకా చతుర్వేది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక అప్పటి నుంచే శివసేన పార్టీనేతలతో ఆమె టచ్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఊర్మిళకు టికెట్ కేటాయించడంపై ప్రియాంక అలక
ప్రియాంకా చతుర్వేది గత 10 ఏళ్లుగా కాంగ్రెస్లో ఉంది. ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే కాంగ్రెస్ మాత్రం మరో కథను వినిపిస్తోంది. ఎన్నికల ముందు ముంబై కాంగ్రెస్లో విబేధాలు గుప్పుమన్నట్లు అధిష్టానం చెబుతోంది. సీనియర్ కాంగ్రెస్ నేతలు వారి మధ్య వారే గొడవపడుతున్న ఘటనలు బయటపడ్డాయని కాంగ్రెస్ చెప్పుకొచ్చింది. మరికొందరు ఎన్నికల్లో పోటీచేసేందుకు సుముఖత చూపలేదని చెప్పుకొచ్చింది. ఇదే అదనుగా భావించిన ప్రియాంకా చతుర్వేది తనకు టికెట్ వస్తుందని ఆశించింది. ముంబై నార్త్ లోక్సభ స్థానం నుంచి టికెట్ ఆశించారు. అలయితే ఈ స్థానం నుంచి సినీనటి ఊర్మిళకు టికెట్ కేటాయించడంతో ఆమె అలకపాన్పు ఎక్కినట్లు తెలుస్తోంది. దీంతో కలత చెందిన ప్రియాంక చతుర్వేది శివసేనతో చర్చల్లో వేగం పెంచింది.
మొత్తానికి మరో ఆరునెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రియాంకా చతుర్వేది పార్టీని వీడటం కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.