11 ఏళ్ళలో ఐదోసారి విశ్వాస పరీక్షకు యడ్యూరప్ప సిద్దం
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్ర 23వ ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప మే 17వ తేదిన ప్రమాణ స్వీకారం చేశారు. అయితే యడ్యూరప్ప 11 ఏళ్ళలో ఐదు దఫాలు విశ్వాస పరీక్షలను ఎదుర్కొన్నారు.అంతేకాదు మూడోదఫా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే రెండు దఫాలు సీఎంగా అర్ధాంతరంగానే తన విధులనుండి తప్పుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుతం చోటు చేసుకొంటున్న పరిణామాలు దేశ వ్యాప్తంగా రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. కర్ణాకటలో అతి పెద్ద రాజకీయ పార్టీగా అవతరించిన బిజెపిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ వాజ్భాయ్ వాలా ఆహ్వనించారు. బిజెపికి 104 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. కనీస మెజారీటికి సుమారు 8 ఓట్ల దూరంలో బిజెపి ఉంది.
కాంగ్రెస్, జెడి(ఎస్) కూటమికి సుమారు 116 సీట్లున్నాయి. అయితే కనీస మెజారిటీ కంటే ఎక్కువ సీట్లను గెలుచుకొన్న తమ కూటమికి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాన్ని గవర్నర్ కల్పించకపోవడంతో కాంగ్రెస్, జెడి(ఎస్)లు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సుప్రీం ఆదేశాల మేరకు మే 19వ తేది సాయంత్ర నాలుగు గంటలకు అసెంబ్లీలో యడ్యూరప్ప బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది.
యడ్యూరప్ప మే 19వ తేదిన ఎదుర్కొనే బలపరీక్ష ఐదవది ఇప్పటికే ఆయన నాలుగు దఫాలు విశ్వాసపరీక్షను ఎదుర్కొన్నారు. 2007 నవంబర్ మాసంలో యడ్యూరప్ప తొలిసారి విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు. జెడి(ఎస్) మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే జెడి(ఎస్) మద్దతును ఉపసంహరించుకోవడంతో వారం రోజులకే యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోవాల్సి వచ్చింది. 2008 జూన్ మాసంలో రెండోసారి యడ్యూరప్ప విశ్వాసపరీక్షను ఎదుర్కొన్నారు.ఈ విశ్వాస పరీక్షలో యడ్యూరప్ప విజయం సాధించారు.
2010లో మూడోసారి యడ్యూరప్ప విశ్వాసపరీక్షను ఎదుర్కొన్నారు. ఈ పరీక్షలో యెడ్డీ విజయం సాధించారు. వాయిస్ ఓటు ద్వారా యడ్యూరప్ప విజయం సాధించారు. దీంతో రాష్ట్రపతి పాలనకు అప్పటి రాష్ట్ర గవర్నర్ సిఫారసు చేశారు.2010 అక్టోబర్ మాసంలో యడ్యూరప్ప నాలుగోసారి విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు. మే 19, 2018 న ఐదోసారి యడ్యూరప్ప విశ్వాసపరీక్షను ఎదుర్కొంటున్నారు. ఈ విశ్వాస పరీక్షలో ఏం జరుగుతోందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.