సంకల్పం ముందు పేదరికం ఓడింది: ఈ మహిళ కథ అందరికీ ఆదర్శం
పుట్టుకతోనే పలు అనారోగ్య సమస్యలతో పుట్టింది. ఇక చదవాలన్న ఆమె కోరికకు ఎన్నో అడ్డంకులు. అయినా సరే ఆత్మస్థైర్యం కోల్పోలేదు. అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేసింది. లక్ష్యాన్ని సాధించింది. ఇంతకీ ఆమె ఎవరు...? ఆమె ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలేంటి... ఆమె నెరవేర్చుకున్న లక్ష్యం ఏమిటి.. తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ప్రమితకు అన్నీ అడ్డంకులే
ఇదిగో ఇక్కడ ఫోటోలో న్యాయవాది డ్రెస్సులో కనిపిస్తున్న మహిళ పేరు ప్రమిత. వయస్సు 28 ఏళ్లు. పుట్టుకతోనే పలు ఆరోగ్య సమస్యలతో పుట్టింది. ఇక చదవుకోవాలన్న ఆమె బలమైన కోరికకు ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు. వీటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంది. ఆమె సంకల్పం ముందు ఇవన్నీ పటాపంచలయ్యాయి. చివరకు తను అనుకున్నది సాధించింది. జూన్ 16న ప్రమిత కేరళ హైకోర్టులో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యింది.
హేళన చేసిన తోటి విద్యార్థులు
ఎర్నాకుళం-త్రిస్సూర్ జిల్లాల సరిహద్దులో ఉండే ఉత్తర కుతియతోడ్ అనే చిన్న గ్రామం నుంచి వచ్చింది ప్రమిత. అలువాలోని సెయింట్ క్సేవియర్స్ మహిళా కాలేజ్లో ఎకనామిక్స్లో డిగ్రీ పూర్తి చేసిన ప్రమిత... ఆ తర్వాత ఎర్నాకుళంలోని ప్రభుత్వ న్యాయకళాశాల నుంచి న్యాయశాస్త్రం పూర్తి చేశారు. ప్రమిత 3.5 అడుగులు ఉంటుంది. స్కూలుకు వెళ్లిన సమయంలో ఆమె తోటి విద్యార్థులు వెక్కిరించేవారు. ఆనాటి చేదు జ్ఞాపకాలను చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమైంది. తాను పొట్టిగా ఉండటంతో తన తోటి విద్యార్థులు హేళన చేసేవారని చెప్పుకొచ్చింది ప్రమిత. ఏడవ తరగతి వరకు తన గ్రామంలోనే చదివినట్లు చెప్పిన ప్రమిత ఆ తర్వాత ఓ కాన్వెంట్లో చేరినట్లు చెప్పింది. ఆ సమయంలో తమ బంధువుల ఇంట్లో ఉండి చదువుకున్నట్లు చెప్పింది.
ప్రమితకు ఆరోగ్య సమస్యలు
ప్రమిత శరీరంలో ఎముకలు చాలా బలహీనంగా ఉంటాయి. దీంతో ఆమె ఎక్కువ దూరం నడవలేదు. ఇక పరీక్షల సమయంలో ఇతర విద్యార్థులు రాసినంత వేగంగా తాను రాయలేకపోయేదాన్నని ప్రమిత చెప్పింది. న్యాయశాస్త్రం చదివే సమయంలో కూడా ఇదే ఇబ్బందిని తాను ఎదుర్కొన్నట్లు తెలిపింది. ఇక ఆరోగ్యసమస్యలు ఒకవైపు ఉంటే ఆర్థిక సమస్యలు మరోవైపు ప్రమితను వెంటాడాయి. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ప్రమిత చదవుకు ఆర్థిక ఇబ్బందులు రాకూడదని తల్లిదండ్రులు వారికి సాధ్యమైనంత వరకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేవఆరు. తన తల్లిదండ్రులే తనకు బలమని తాను విశ్వసిస్తున్నట్లు ప్రమిత చెప్పుకొచ్చింది. తన తండ్రి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా.. తల్లి కిడ్నీలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. బ్యాంకు నుంచి రుణం పొందిన తమ కుటుంబం కొన్ని న్యాయపరమైన చిక్కులు చుట్టుముట్టడంతో ఆనాడే తాను న్యాయవాది వృత్తి చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు ప్రమిత చెప్పింది.
కేరళ వరదల్లో కొట్టుకుపోయిన ఇళ్లు
ఇక తను కన్న స్వప్నాన్ని నెరవేర్చుకున్న సంతోషం ఎంతో కాలం నిలవలేదని ప్రమిత చెప్పుకొచ్చింది. గతేడాది కేరళను వరదలు ముంచెత్తాయి. ఆ సమయంలో తమకు ఉన్న ఒక్క ఇళ్లు వరదల ధాటికి కొట్టుకుపోవడంతో తన కుటుంబం మొత్తం రోడ్డున పడ్డట్లు ఆవేదన వ్యక్తం చేసింది. గతేడాది ఆగష్టులో తమ బంధువు ఒకరు ఫోన్ చేసి డ్యామ్ల గేట్లు అన్ని ఎత్తివేస్తున్నారని వరదలు వచ్చే ప్రమాదం ఉందని చెప్పినట్లు ప్రమిత గుర్తు చేసుకుంది. అప్పటికే నీరు ఇంట్లోకి చేరి జరగాల్సిన నష్టం జరిగిపోయినట్లు చెప్పింది.ఇక తన ఎత్తుకు నీళ్లు చేరిపోయాయని నాటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది. ఆసమయంలో మూడు సహాయక శిబిరాల్లో తమ కుటుంబం తలదాచుకున్నట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన ఓ చిన్న :ఇంట్లో తామంతా నివసిస్తున్నట్లు చెప్పింది.ఇందులో ఆరుమంది ఉన్నట్లు చెప్పింది.
భవిష్యత్తులో తాను ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉందని వాటన్నిటినీ ఎదుర్కొంటాననే ధీమా వ్యక్తం చేసింది ప్రమిత. ఇప్పటి వరకు తన జీవితం తాను అనుకున్నట్లుగా లేదని ఈ క్రమంలోనే ఎన్నో అడ్డంకులు కూడా ఉంటాయని వెల్లడించింది. అయితే ఆ సమయంలో ఆత్మస్థైర్యాన్ని కోల్పోరాదని వెల్లడించింది. ఎదురొడ్డి పోరాడాలని చెప్పింది ప్రమిత. జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న ఆమె తన న్యాయవాది వృత్తిని నిబద్దతతో చేపట్టి న్యాయం కోసం పోరాడుతానని వెల్లడించింది.