ఆ పాఠశాలలో చేరితో 1గ్రాం బంగారం, రూ.5వేల నగదు ఇస్తారు!
కోయంబత్తూరు: పట్టణాల్లోనే కాదు, గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల మోజులో పడి ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపించడం లేదు తల్లిదండ్రులు. అంతేగాక, ప్రభుత్వ పాఠశాలల్లో సరైన రీతిలో చదువు చెప్పరని, కనీస వసతలు ఉండవని వాదనలు కూడా ఉన్నాయి.
మూతపడే స్థాయికి పాఠశాలలు
ఈ నేపథ్యంలో అనేక గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు మూతబడే స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుత ప్రభుత్వాలు కొంత మేరకు పాఠశాలలను మెరుగుపరుస్తున్నప్పటికీ పిల్లల తల్లిదండ్రులు మాత్రం ఆసక్తి చూపడం లేదు. కేవలం ఆర్థిక పరిస్థితి బాగాలేని కుటుంబాల వారు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలను పంపిస్తున్నారు.
పాఠశాలను కాపాడుకునేందుకు..
ఇలాంటి పరిస్థితుల్లో తమ స్థానిక ప్రభుత్వ పాఠశాలను కాపాడుకునేందుకు నడుం బిగించారు తమిళనాడులోని కోయంబత్తూరు పరిధిలోని కోనర్పాలయం గ్రామస్తులు. ఈ విద్యా సంవత్సరంలో ఈ బడిలో చేరే తొలి పది మంది విద్యార్థులకు ఒక గ్రాం బంగారంతోపాటు రూ.5వేలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం ఇద్దరు వ్యాపారవేత్తలు ఆర్థికంగా సాయం చేస్తున్నారు.
పునర్ వైభవం కోసం.. కదిలిన హెచ్ఎం.. గ్రామస్తులు
1996లో ఈ పాఠశాలను ప్రారంభించగా.. తొలుత 165మంది విద్యార్థులతో కళకళలాడుతూ ఉండేది. ఆ తర్వాత ప్రైవేటు పాఠశాలల రాకతో ఈ పాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. చివరకు మూతపడే స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో పాఠశాలను ఎలాగైనా కాపాడుకోవాలని ప్రధానోపాధ్యాయుడు రాజేష్ చంద్రకుమార్.. ఆ ఊరి ప్రజలను కలిసి సమస్యను వివరించారు. తమ పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఇక్కడ కూడా చదువు బాగా చెబుతున్నామని తెలిపారు. దీంతో కొందరు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
బంగారం, నగదుతో..
కాగా, తమ గ్రామంలోని పాఠశాలను కాపాడుకునేందుకు ఆ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు శేఖర్, సెల్వరాజ్ కూడా తమవంతు సాయం చేస్తామంటూ ముందుకు వచ్చారు. పాఠశాలలో చేరే మొదటి 10మందికి గ్రామ్ బంగారం, రూ.5వేల నగదు ఇస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతున్నాయి. దీంతో ఆ ప్రధానోపాధ్యాయుడితోపాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.