దేవుడే మనిషై వస్తే: పేదవారికి ఈ వ్యక్తి దేవుడితో సమానం ఎందుకో తెలుసా..?
అన్ని దానాల్లోకెల్లా... అన్నదానం ఎంతో ప్రధానమైంది. ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నంపెడితే ఎంతో పుణ్యం వస్తుందంటారు. అంతేగాదు ఆకలితో ఉన్నవారి కడుపు నింపితే వారి నోట నుంచి వచ్చే ఆశీర్వాదాలు ఎంతో గొప్పవి కూడా. ఒకరి కడుపు నింపితే అందులో కలిగే తృప్తే వేరు. అలా ప్రతిరోజు అన్నం పెట్టేవారిలో అతికొద్ది మందే మనకు కనిపిస్తారు. ఇలాంటి వ్యక్తే దవీందర్ సింగ్.
ఐదు రూపాయలకే భోజనం
ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరే దవీందర్ సింగ్. ఊరు ఫరీదాబాద్ . దవీందర్ ప్రముఖ క్విజ్ ప్రోగ్రామ్ కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమానికి వెళ్లాడు. అమితాబ్ హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమంలో దవీందర్ సింగ్ తన గురించి పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఆయన "ఆప్కీ రసోయ్" పేరుతో తాను నడుపుతున్న ఓ మొబైల్ హోటల్ గురించి ప్రస్తావించారు. తన ఇన్నోవా కారులో ఆహారం తీసుకుని పేదవారికి ఆకలితో ఉన్నవారికి కేవలం ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నట్లు తెలిపాడు.
కౌన్ బనేగా కరోడ్పతిలో రూ. 6.40 లక్షలు గెలిచిన దవీందర్
బిగ్ బీ షో కౌన్ బనేగా కరోడ్ పతిలో పాల్గొన్న దవీందర్ సింగ్ అక్కడ రూ.6లక్షల 40 వేల గెలుచుకున్నాడు. ఆ డబ్బును మొత్తం తను నడుపుతున్న ఆప్ కీ రసోయ్కే ఖర్చు చేశారు. ప్రతి శనివారం రాత్రి ఆయన ఆహారం ప్రిపేర్ చేసి తన ఇన్నోవా కారులో తీసుకెళ్లి ఆకలితో ఉన్నవారికి అన్నం పెడుతూ ఉంటాడు. కేవలం ఐదు రూపాయలకే రుచి శుచితో కూడిన ఆహారం అందిస్తున్నాడు. ఐదు రూపాయలు కూడా వెచ్చించలేని వారికి ఉచితంగా భోజనం పెడుతున్నాడు.
ఆప్ కీ రసోయ్ పేరుతో భోజనం వడ్డిస్తుంటే ఎంతో తృప్తిగా ఉంది
కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివిన సింగ్... ఆప్ కా రసోయ్ ద్వారా నామమాత్రమపు రుసుంతో నాణ్యత కలిగిన భోజనం పెడుతున్నట్లు చెప్పారు. అంతేకాదు అది కూడా కట్టలేనివారికి ఉచితంగా భోజనం ఇస్తున్నట్లు చెప్పాడు. ఆప్ కా రసోయ్ ఐడియా తన కుటుంబ సభ్యులు ఇచ్చిందని తను వారానికోసారి ఇలా భోజనం పెడుతుంటే ఎంతో తృప్తినిస్తుందని సింగ్ తెలిపాడు. ప్రతి వ్యక్తికి రెండు కాయగూరలతో కూడిన కర్రీ, నాలుగు రోటీలు, కప్పు అన్నం వడ్డిస్తున్నట్లు దవీందర్ సింగ్ చెప్పాడు.
దవీందర్ను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ పేదల ఆకలిని తీరిస్తే సమాజంలో మార్పు తప్పకుండా వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఆకలితో అలమటించి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కేవలం వ్యవసాయం పై ఆధారపడే వారు... పంట చేతికిరాక అప్పులు పాలై, తినేందుకు తిండి లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.