Fact Check:సోషల్ మీడియాను చుట్టేస్తున్న ఆ మెడికల్ ప్రిస్క్రిప్షన్లో నిజమెంత..?
న్యూఢిల్లీ: కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తున్నాయి. వాటిలో 90శాతంకు పైగా వార్తలు అవాస్తవాలనే విషయం ప్రజలు గ్రహించాలని ప్రభుత్వాలు పదేపదే కోరుతున్నాయి. అంతేకాదు ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి శిక్ష కూడా విధిస్తోంది ప్రభుత్వం. కొద్ది రోజుల క్రితం లాక్డౌన్ పొడిగిస్తారంటూ వచ్చిన వార్తలపై కూడా కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. తాజాగా సోషల్ మీడియాలో మరో వార్త హల్చల్ చేస్తోంది. ఒక మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఫోటోతో పాటు వార్త కూడా చుట్టేస్తోంది. కరోనాపై పోరుకు ఐసీఎంఆర్ సూచించిన గైడ్లైన్స్ ఇవేనంటూ ఒక ప్రిస్క్రిప్షన్ హల్చల్ చేస్తోంది.
ఢిల్లీలోని గంగారామ్ హాస్పిటల్లో అనెస్తాలజీ డిపార్ట్మెంట్లో సీనియర్ కన్సల్టెంట్గా పనిచేస్తున్న డాక్టర్ రాజ్ కమల్ అగర్వాల్ నోట్ప్యాడ్పై రాసి ఉన్న ప్రిస్క్రిప్షన్ ఇప్పుడు వైరల్ అవుతోంది. కోవిడ్-19 పాజిటివ్ కాంటాక్ట్స్ను హోమ్ ఐసొలేషన్లో ఉంచాలని ఇది ఐసీఎంఆర్ గైడ్లైన్స్ అని పేర్కొంటూ రాసి ఉన్న ప్రిస్క్రిప్షన్ హల్చల్ చేస్తోంది. అంతేకాదు సామాజిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, మాస్కులు ధరించడంతో పాటుగా మెడిసిన్స్ కూడా తీసుకోవాలంటూ ఈ ప్రిస్క్రిప్షన్లో రాసి ఉంది. అయితే ఈ ప్రిస్క్రిప్షన్ తాను రాసింది కాదని స్పష్టం చేశారు డాక్టర్ అగర్వాల్. అంతేకాదు గంగారాం హాస్పిటల్ కూడా దీనిపై స్పష్టత ఇచ్చింది. ఇదంతా అవాస్తవమని క్లారిటీ ఇచ్చింది.
ఇక కరోనావైరస్ రాకుండా ఉండాలంటే హైడ్రాక్సి క్లోరోక్విన్ 400 గ్రాములు, విటమిన్ సీ మాత్రలు వారానికోసారి వేసుకోవాలని ఆ ప్రిస్క్రిప్షన్లో రాసి ఉంది. అయితే హెసీక్యూ మాత్రలు వినియోగించేందుకు ఐసీఎంఆర్ ఎలాంటి గైడ్లైన్స్ జారీ చేయలేదని అధికారులు స్పష్టం చేశారు. ఎవరో ఆకతాయిలు ఈ నోట్ప్యాడ్ను సృష్టించి డాక్టర్ అగర్వాల్ సంతకం ఫోర్జురీ చేశారని గంగారాం హాస్పిటల్ స్పష్టం చేసింది. ఇలా సర్క్యులేట్ అవుతున్న వార్తకు లేదా ప్రిస్క్రిప్షన్కు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. ప్రజలు తప్పుడు వార్తలను నమ్మరాదని చాలా అప్రమత్తతతో వ్యవహరించాలని గంగారాం హాస్పిటల్ కోరింది.