హ్యాట్సాఫ్: సేంద్రీయ కూరగాయల కోసం ఈ కలెక్టర్ 10 కి.మీ నడిచి వెళతారట..!
మేఘాలయా: అసలే ఈశాన్యా భారతం. అడవులు ఎక్కువే. అక్కడ సదుపాయాలు కూడా చెప్పాలంటే కాస్త తక్కువే. ఎటు చూసిన కొండలు లోయలు. పైగా ప్రాణాలకు రక్షణ కూడా ఉంటుందన్న గ్యారెంటీ లేదు. అయితే అక్కడ ఓ కలెక్టర్ మాత్రం కూరగాయలు కొనేందుకు రోజూ 10 కిలోమీటర్లు నడిచి వెళ్తారట. తన కథను సోషల్ మీడియాలో పోస్టు చేయగానే వైరల్గా మారింది. ఇంతకీ ఆ కలెక్టర్ ఎవరూ.. ఆయన ఉంటున్న ఈశాన్య రాష్ట్రం ఏంటి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఆర్గానిక్ కూరగాయల కోసం 10 కి.మీ నడక
సోషల్ మీడియాలో ఓ ఐఏఎస్ ఆఫీసర్పై నెటిజెన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రం మేఘాలయాలో పశ్చిమ గారో హిల్స్ డిప్యూటీ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రామ్సింగ్ అనే ఐఏఎస్ ఆఫీసర్ వారానికి ఓసారి 10 కిలోమీటర్లు నడిచి కూరగాయలు కొంటారట. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే ఆర్గానిక్ కూరగాయల కోసమే తాను అంత దూరం నడిచి వెళతారని పోస్టులో తెలిపారు రామ్సింగ్.
ప్లాస్టిక్కు గుడ్బై.. వెదురు బుట్టకు వెల్కం
ఇక తన వంతు బాధ్యతగా ప్లాస్టిక్ బ్యాగుల వినియోగంకు గుడ్బై చెప్పేశాడు. పర్యావరణ ప్రేమికుడైన రామ్సింగ్ ప్లాస్టిక్ బ్యాగులను వీడి వెదురుతో తయారైన బుట్టను కూరగాయలు తీసుకునేందుకు వాడుతున్నారు. ఈ తరహా వెదురు బుట్టను అక్కడి గిరిజనులు వాడుతారు. అందులో వారు కట్టెలను ఇతర సామగ్రిని పెట్టి మోసుకెళతారు.
వాకింగ్కు రాంసింగ్ భార్య కూడా వస్తుంది
"21 కేజీల సేంద్రీయ కూరగాయల షాపింగ్. ప్లాస్టిక్ వినియోగం లేదు, వాహన కాలుష్యం లేదు, ట్రాఫిక్ జామ్ అంతకన్నా లేదు. మంచి మార్నింగ్ వాక్లా ఉంది" అంటూ కలెక్టర్ రాంసింగ్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. తాను కూరగాయలు కొనుగోలు చేసే ఫోటోలను కూడా తన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో పోస్టు చేశారు. ఇదిలా ఉంటే ఆయన ఒక్కరే ఇలా కూరగాయల కోసం వెళ్లరట. తనతో పాటు తన భార్య బిడ్డలను కూడా మార్నింగ్ షాపింగ్కు తీసుకెళతారని పోస్టులో చెప్పుకొచ్చారు.
వెదురు బుట్ట ఎన్నో విధాలుగా పనికొస్తుంది
"చాలామంది అంత బరువైన కూరగాయలను మోసుకెళ్లడం చాలా కష్టమని చెప్పారు. అందుకే వెదరుబుట్టను తమతో పాటు తీసుకెళ్లాలని వారికి సూచించాను. ఇలా చేయడం ద్వారా పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్కు కూడా స్వస్తి చెప్పిన వారమవుతాం. అయితే వారు నా సూచనలను విని నవ్వారు. అందుకే నేను నాభార్య వెదురు బుట్టను వేసుకుని మార్కెట్కు బయలుదేరాం. ఈ వెదురు బుట్ట ఎన్నో రకాలుగా పనికొస్తుంది" అని రాంసింగ్ చెప్పారు.
ఇదిలా ఉంటే రాంసింగ్ సోషల్ మీడియా పేజ్ను ఫాలో అయితే చాలా విషయాలు తెలుస్తాయి. ఆయన మారుమూల కొండ ప్రాంతాల్లో పర్యటించే ఫోటోలు, నడుచుకుంటూ వెళ్లటం, వాహనాల్లో లిఫ్ట్ అడిగి మరీ ప్రయాణించడం వంటివి కనిపిస్తాయి. రాంసింగ్ స్వస్థలం హిమాచల్ ప్రదేశ్. డిసెంబర్ 1, 2017 నుంచి మేఘాలయాలోని పశ్చిమగారో హిల్స్ డిప్యూటీ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.