అభినవ షాజహాన్: భార్య కోసం తాజ్మహల్ కట్టించాడు... కానీ ఇప్పుడు?
ప్రేమ అనేది వర్ణించలేనిది. ప్రేమించిన వారికోసం ఏ త్యాగానికైనా సిద్ధపడతారు కొందరు. ఇలాంటివి చరిత్రలో కూడా చూశాం. తన భార్య ముంతాజ్ పై ఉన్న ప్రేమను తెలియపరుస్తూ ఆమె జ్ఞాపకార్థంగా ఆనాటి మొఘల్ చక్రవర్తి షా జహాన్ తాజ్మహల్ను నిర్మించారు. షా జహాన్లానే మరో వ్యక్తి ఉన్నడన్న సంగతి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇంతకీ ఈ అభినవ షాజహాన్ ఎవరు... ఆయన అసలు పేరేంటి... తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే...
భార్య పై ప్రేమతో తాజ్ మహల్ నిర్మాణం
ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ఫైజుల్ హసన్ ఖాద్రి. ఈయన పోస్టు మ్యాన్గా పనిచేస్తూ రిటైర్ అయ్యారు. ఇతనికీ షా జహాన్కు లింకు ఏమిటని ఆలోచిస్తున్నారా.. అక్కడికే వస్తున్నాం. ఫైజుల్ హసన్ ఖాద్రికి తన భార్య అంటే ఎంతో ఇష్టం. ఆమె మరణించాక ఆమె కోసమే ఓ చిన్న తాజ్మహల్ను నిర్మించాడు. షాజహాన్ ఎలా అయితే ముంతాజ్కు తాజ్మహల్ కట్టాడో.. అంత పెద్దగా కాకపోయినప్పటికీ చిన్న తాజ్మహల్ నిర్మించి తన అనంతమైన ప్రేమను చాటుకున్నాడు.
గొంతు క్యాన్సర్తో భార్య మృతి
ఖాద్రి తన సొంత గ్రామం ఉత్తర్ ప్రదేశ్లోని కసేర్ కలాన్ గ్రామంలో 5,500 చదరపు అడుగుల స్థలంలో ఎప్పుడో చనిపోయిన తన భార్య జ్ఞాపకార్థంగా ఈ బుల్లి తాజ్మహల్ నిర్మించాడు. ఇందుకోసం ఇటుకలు సిమెంటును వినియోగించాడు. అయితే ఇది తాజ్మహల్ను తలపించకపోవచ్చు కానీ... 82 ఏళ్ల ఖాద్రి ప్రేమను మాత్రం వ్యక్త పరుస్తుంది. ఖాద్రి భార్య పేరు తాజాముల్లి బేగం. ఆమెకు 57 ఏళ్ల వయసున్నప్పుడు గొంతు కేన్సర్తో 2011లో మృతి చెందింది. ఆమెపై ఉన్న అపారమైన ప్రేమతో ఖాద్రి అప్పటి వరకు దాచుకున్న డబ్బులతో పాటు ఆయన సొంత స్థలం కొంత అమ్మి భార్య తాజాముల్లి సమాధిపై ఈ చిన్న తాజ్మహల్ నిర్మించాడు.
రోడ్డు ప్రమాదంలో ఖాద్రీ మృతి
ఇక తాజ్మహల్ నిర్మాణం చేపట్టిన క్రమంను చూసి అక్కడి గ్రామస్తులు ఖాద్రిని పేదల పాలిట షాజహాన్ అని పిలుచుకునేవారు. 82 ఏళ్ల వయస్సులో కూడా ఎంతో యాక్టివ్గా కనిపిస్తారు ఖాద్రి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడే విషాదం అలుముకుంది. శుక్రవారం రాత్రి ఖాద్రిని ఓ గుర్తుతెలియని మోటార్ సైకిల్ ఢీకొట్టడంతో ఆయన మృతి చెందాడు. తను ఎంతగానో ప్రేమించే తన భార్య సమాధి పక్కనే ఖాద్రిని సమాధి చేయనున్నట్లు బంధువులు తెలిపారు. ఖాద్రి తన భార్య కోసం మినీ తాజ్మహల్ నిర్మించినప్పుడే దాని పక్కనే తన కోసం కూడా ఓ గొయ్యి తవ్వి ఉంచుకున్నాడు. ఒకవేళ తాను మరణిస్తే అతన్ని అక్కడే సమాధి చేయాలని తన బంధువులతో చెప్పాడు.
ఓ పేదవాడి ప్రేమను లిఖిస్తున్నాను: ఖాద్రి
ఖాద్రి మృతి తమను ఎంతో కలచివేసిందని బంధువులు చెప్పారు. ఆగ్రామానికి ఒక గుర్తింపును ఖాద్రి తీసుకొచ్చాడని చెప్పిన బంధువులు ఆయన చివరి కోరిక ప్రకారమే తన భార్య పక్కనే సమాధి చేస్తామని వెల్లడించారు. తన భార్య సమాధి పక్కనే మరికొంత స్థలాన్ని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వానికి దానంగా ఇచ్చారని చెప్పిన బంధువులు అక్కడ ఆడపిల్లల కోసం కాలేజీ కట్టాలని ప్రతిపాదించారని బంధువులు చెప్పారు. తన భార్యకోసం కడుతున్న మినీ తాజ్మహల్ పూర్తి చేసేందుకు కావాల్సిన డబ్బులు లేకపోవడంతో ఆనాటి యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆర్థిక సహాయం చేసినప్పటికీ దాన్ని సున్నితంగా తిరస్కరించారు. "ఓ పేదవాడి ప్రేమను నేను లిఖిస్తున్నాను. తను నిర్మిస్తున్న తాజ్మహల్ షా జహాన్ నిర్మించిన తాజ్మహల్లా పాపులర్ అవుతుందో లేదో తెలియదు కానీ... ఈ మినీ తాజ్మహల్ను మాత్రం ఉచితంగా చూడొచ్చు" అని 2015లో ఖాద్రి చెప్పారు.