ఎమోషనల్ స్టోరీ: పనిమనిషి కోసం పనోళ్లయ్యారు... నెటిజెన్ల మనసులు గెల్చుకున్న ఉద్యోగస్తులు
ముంబై: వారిద్దరూ ఎంబీఏ గ్రాడ్యుయేట్లు... ఇద్దరికీ మంచి ఉద్యోగం ఉంది. అయినా ప్రతిరోజు ఉదయం కండివాలి రైల్వే స్టేషన్ బయట ఒక ఫుడ్ స్టాల్ పెట్టి టిఫెన్లు అమ్ముతూ కనిపిస్తారు. మంచి ఉద్యోగం చేసుకుంటున్న వీరు ఎందుకు ఇలా టిఫెన్ సెంటర్ పెట్టాల్సి వచ్చింది అనేగా మీ డౌటు...? వీరి గురించి తెలిసిన వారుకూడా ఇదే అనుమానం వ్యక్తం చేశారు. కానీ వీరు ఎందుకు టిఫెన్ అమ్మాల్సి వచ్చిందో అనే కథను తెలుసుకున్న చాలామంది శభాష్ అంటున్నారు.
కొట్టిన కొబ్బరికాయ చిప్ప ఎగిరిపడి.. ఎంబీఏ విద్యార్థిని మృతి.. ఆరుగురికి తీవ్రగాయాలు
చీకట్లో 4 గంటల నుంచి ఉదయం 9:30 గంటల వరకు..
ముంబైలో నివాసముంటున్న అశ్విని షెనాయ్ షా దంపతులు ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల నుంచి ఉదయం 9:30 గంటల వరకు ముంబైలోని కండివాలి రైల్వే స్టేషన్ బయట పోహా, ఉప్మా, పరాఠా, ఇడ్లీలు అమ్ముకుంటూ కనిపించడం పలువురిని ఆలోచిపంజేసింది. ఇద్దరూ మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అయినప్పటికీ వారు టిఫెన్ ఎందుకు అమ్ముకుంటున్నారో చాలా మందికి అర్థం కాలేదు. అయితే వీరు ఎందుకు టిఫెన్ అమ్ముకుంటున్నారో తెలిసిన వారు మెచ్చుకుంటున్నారు. ఇక అసలు విషయానికొస్తే ఈ దంపతుల ఇంట్లో ఓ వంటమనిషి పనిచేస్తోంది. ఆమెకు 55 ఏళ్ల వయస్సు. తన భర్త అనారోగ్యంతో మంచం పట్టడంతో ఆయన చికిత్సకు కావాల్సిన డబ్బులు సమకూర్చుకునేందుకు ఏదో చేయాలని భావించింది.
వెలుగులోకి వచ్చిన అశ్వినీ దంపతుల కథ
అనుకున్నదే తడవుగా ఆమెకు వచ్చిన టిఫెన్లు చేసి అమ్ముకునేది. అయితే ఆ వంట మనిషి తన భర్త కోసం ఆ వయస్సులో పడుతున్న తాపత్రయం చూసిన అశ్వినీ దంపతులు తమ వంట మనిషి చేసే టిఫెన్లను తీసుకుని కండివాలి రైల్వే స్టేషన్ బయట ప్రతిరోజు చీకట్లో 4:30 గంటల నుంచి ఉదయం 9:30 గంటల వరకు అమ్ముతున్నారు. వచ్చిన డబ్బులను తీసుకెళ్లి వంటమనిషి చేతిలో పెడుతున్నారు. ఇక 9:30కు ఇంటికి చేరుకుని అక్కడి నుంచి తమ ఆఫీసులకు బయలుదేరి వెళతారు. వీరి స్టోరీని దీపాలీ భాటియా అనే యువతి సోషల్ మీడియాలో షేర్ చేసింది. తమ ఇంట్లో పనిచేసే వంటమనిషిని ఆదుకునేందుకు యజమానులు ఇలా సహాయం చేయడం నిజంగా ప్రశంసించాల్సిన విషయం అంటూ రాసుకొచ్చింది. దీపాలీ పోస్టు వైరల్ అవడంతో నెటిజెన్లు ఈ దంపతులకు సలాం చేస్తున్నారు.
వైరల్గా మారిన పోస్టు..సలాం అంటున్న నెటిజెన్లు
అశ్వినీ దంపతులు చేస్తున్న ఈ మంచిపని గురించి దీపాలీ తన ఫేస్బుక్లో పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే పోస్టు వైరల్ అయ్యింది. దాదాపు 3వేల షేర్లు ఈ స్టోరీకి దక్కాయి.పోస్టును చదివిన నెటిజెన్లు అశ్వినీ దంపతుల మంచి హృదయానికి హ్యాట్సాఫ్ చెప్పారు. కొందరైతే వీరి చేస్తున్నసేవకు మాటల్లేవు అని కామెంట్ చేయగా మరికొందరు సూపర్.. మీరు చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు అని రాసుకొచ్చారు. అదే సమయంలో దీపాలీకి కూడా వీరు చేస్తున్న సేవ గురించి బయట ప్రపంచానికి చాటినందుకు థ్యాంక్స్ చెప్పారు.