నా పోటీదారు కత్రినా కైఫ్, ఆమె చెప్తే తాగుతారా: వ్యాపారి
ముంబై: తన వ్యాపారానికి బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ అతిపెద్ద పోటీదారు అని ఓ ముంబై వ్యాపారి చెబుతున్నాడు. ముంబైలో ఓ వ్యాపారి చాలా ఏళ్లుగా మామిడి పళ్లు అమ్ముకుండున్నాడు. అయితే, ఇప్పుడు తన పోటీదారు కత్రినా కైఫ్ అని చెబుతున్నాడు.
అయితే, ఆ వ్యక్తి తన పేరును వెల్లడించడానికి ఇష్టపడలేదు. కానీ తన పోటీదారు మాత్రం కత్రినా కైఫ్ అని చెబుతున్నాడు. అందుకు కారణం కూడా చెబుతున్నాడు.
హ్యూమన్స్ ఆఫ్ ముంబై ఫేస్బుక్ పేజీలో నిన్న ఆ మామిడి పళ్ల వ్యాపారి మనోగతాన్ని ప్రచురించారు. కథనంలో వ్యాపారి మనోగతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
పేరు చెప్పేందుకు ఇష్టపడని ఆ మామిడి పళ్ల వ్యాపారి మాట్లాడుతూ.. 'ఫుట్పాత్ మీద మామిడి పళ్లు అమ్ముకోవడమే నా జీవనాధారం. నేనే కాదు. తరతరాలుగా మా కుటుంబం ఇదే వృత్తిలో ఉంది. అయితే, అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు మా పరిస్థితి బాగా దిగజారింది.
విచిత్రం ఏమంటే ఇప్పుడు జనాలు మా మామిడి పళ్లను కొనడం లేదు. హీరోయిన్ కత్రినా కైఫ్ టీవీల్లో చూపించినట్లు.. బాటిళ్లు కొనుక్కొని తాగుతున్నారు. బాటిళ్లలో కెమికల్ రసాలతో పోల్చుకుంటే మా దగ్గర దొరికే తాజా మామిడి పళ్లు చాలా మంచివి.
కానీ ఇది వ్యాపారం. వ్యాపారం అంటేనే పోటీ. ఒకప్పుడు వ్యాపారికి, వ్యాపారికి మధ్య పోటీ ఉండేది. ఇప్పుడు మాత్రం పరిస్థితి మారిపోయింది. నా వరకు అయితే ప్రధాన పోటీదారు కత్రినా కైఫ్. ఆమె సరుకుల అమ్మకాలు తగ్గితేనే నాకు లాభం వస్తుందం'టూ తన పోటీదారు హీరోయిన్ అని చెప్పాడు.