అహ్మద్ వాణికి దేశం సలాం: ఈ ఫోటో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది
ఇదిగో ఇక్కడి ఫోటో చూశారుగా... ఈ ఫోటోకున్న ప్రత్యేకత ఏంటంటే ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరు కంటనీరు పెడుతున్నారు. ఇది అంతలా హృదయాలను కదిలిస్తోంది. ఓ తండ్రిని కొడుకు కౌగలించుకున్న ఫోటోలా ఉంది కదూ. అవును.. అయితే ఈ ఫోటోలు ఉన్నది తండ్రీ కొడుకులు కాదు. తన కొడుకు ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందడంతో కన్నీరు మున్నీరు అవుతున్న ఆయన్ను మరో ఆర్మీ ఆఫీసర్ ఓదారుస్తున్నారు. "నువ్వు ఒంటరి వాడివి కాదు...దేశం నీవెంట ఉంది"అంటూ రాసి ఉన్న ఫోటోను ట్విటర్లో పోస్టు చేశారు. ఇది వైరల్ అయ్యింది.
ఇక అసలు విషయానికొస్తే... జమ్ముకశ్మీర్లోని షోపియన్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వాణి వీరమరణం పొందారు. కుల్గామ్కు చెందిన అహ్మద్ టెరిటోరియల్ ఆర్మీలో ఉన్నప్పటికీ... ఆదివారం రోజున మాత్రం 34 రాష్ట్రీయ రైఫిల్స్తో చేరారు. అదే సమయంలో జరిగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాదుల తూటాలకు ఎదురొడ్డి వీరమరణం పొందారు. 2004లో భారత ఆర్మీలో చేరాడు అహ్మద్ వాణీ. అంతకుముందు వేరే చరిత్ర కలిగిఉన్న అహ్మద్ వాణీ భారత ఆర్మీకి లొంగిపోయి.. ఆ తర్వాత అదే ఆర్మీలో ఒక విలువలున్న సైనికుడిగా పనిచేశాడు. అంతేకాదు రెండు సార్లు సేనా మెడల్ గెలుపొందాడు.
తన తోటి జవాను కోల్పోయినందుకు పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ...ముందుగా కొడుకును కోల్పోయిన తండ్రిని ఓదార్చాలని భావించి అతన్ని ఓదార్చాడు ఏడీజీ పీఐ. ఆ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజెన్లు కామెంట్లు పెట్టారు. భారత యుద్ధ వీరుడికి సలాం అంటూ కొందరు రాశారు. ఈ ఫోటోను మాటలతో వర్ణించలేమని మనిషిని కోల్పోయిన బాధ ఫోటోలోని ఆ ఇద్దిరికే తెలుస్తుందంటూ పోస్ట్ చేశారు. నజీర్ అనే ఈ వీరసైనికుడిని దేశం ఎప్పుడూ గుర్తుంచుకుంటుందని అంటూ పోస్టు చేశారు.