మతానికి రోగానికి లింకుందా: ఆ హాస్పిటల్లో మతాన్ని బట్టి రోగం.. రోగాన్ని బట్టి మతం చెప్తారట..!
జైపూర్ : సాధారణంగా జబ్బు చేస్తే వైద్యం కోసం హాస్పిటల్కు వెళతాం. ఒకవేళ అడ్మిట్ కావాల్సి వస్తే ముందుగా మన సమాచారం అంతా ఓ ఫామ్లో నింపుతాం. మహా అయితే మన పేరు, వయస్సు, పురుషుడా స్త్రీ నా, ఇంటి అడ్రస్సు ఆ ఫారంలో నింపుతాం. కానీ జైపూర్లోని ఎస్ఎంఎస్ మెడికల్ కాలేజీలో మాత్రం వీటన్నిటితో పాటు ఫలానా పేషంట్ ఏ మతానికి చెందినవారో కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇలా ఎందుకు పూర్తిచేయాలో కూడా హాస్పిటల్ యాజమాన్యం వివరణ ఇస్తోంది.
పూర్తి వివరాలతో పాటు మతం కూడా ఎందుకు పూర్తి చేయమని చెబుతున్నారంటే అది తమ డేటా బేస్కు ఉపయోగపడుతుందట. అంటే ఫలానా జనాభాలో ఫలానా వ్యాధి ఎక్కువగా వస్తోందని నిర్ధారించేందుకట. ఈ మేరకు ఫారంలో పేషంట్ మతం కూడా నింపేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఎంస్ మెడికల్ కాలేజీ యాజమాన్యంతో అధికారులకు ఆదేశాలిచ్చింది. అంతేకాదు ఈ మెడికల్ కాలేజీ అనుబంధ హాస్పిటల్కు కూడా ఇదే తరహా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఎస్ఎంఎస్ హాస్పిటల్లో ఈ విధానం మొదలైంది.
ఈ వివరాలు సేకరించడం ద్వారా ఫలానా జబ్బులు ఏ మతస్తుల్లో ఎక్కువగా ఉన్నాయో అనేది నిర్ధారించడం సులభతరం అవుతుందని తద్వారా డేటాబేస్ రూపొందించుకుని భవిష్యత్తులో పరిశోధనలు చేయొచ్చని ఎస్ఎంఎస్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డీఎస్ మీనా చెబుతున్నారు. ఇందుకు ఆయన ఉదాహరణ కూడా ఇచ్చారు. ముస్లిం సామాజిక మహిళల్లో డీ విటమిన్ చాలా తక్కువగా ఉందని తెలిపారు. అదే సమయంలో హిందువుల్లో పురుషాంగం ద్వారా వచ్చే జబ్బులు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. ఇలాంటి సమాచారం పరిశోధనలకు చాలా ఉపయోగపడుతాయని వివరించారు.