ఆదర్శం: చదువు చెప్పాలన్న ఈ మాస్టర్ తపనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!
జీవితంలో దీక్ష పట్టుదల ఉంటే ఏమైనా సాధించొచ్చని నిరూపించాడు ఈ స్కూలు మాస్టర్ సంజయ్ సేన్. అవును సంజయ్ సేన్ ఎవరనేగా మీ అనుమానం. ఆయన రాజస్థాన్కు చెందిన వ్యక్తి. దివ్యాంగుడు. కానీ అతని దీక్ష పట్టుదల ముందు అంగవైకల్యం చిన్నబోయింది. సంజయ్ సేన్ పట్టుదల ముందు వైకల్యం ఓటమితో తలవంచింది. 2009 నుంచి రాజస్థాన్ ప్రభుత్వ పథకం శిక్ష సంబాల్ ప్రాజెక్టు కింద ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు చెబుతున్నాడు.
సంజయ్ సేన్ విద్యార్థులకు పాఠాలు చెబుతున్న ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది. పాఠాలు చెబుతున్నాడు సరే... కానీ అంగవైకల్యంతో బాధపడుతున్న వ్యక్తి ఎలాంటి సదుపాయాలు లేకుండా విద్యార్థులకు బోధిస్తుండటం చూస్తే కళ్లు చెమరుస్తాయి. ఎంత కష్టమైనప్పటికీ తను అనుకున్న పాఠం విద్యార్థులకు చెప్పే తీరుతానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. ఈ ఫోటో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో కొన్ని వేలమంది నెటిజెన్ల హృదయాలను కదిలించింది. పనిపై సంజయ్ సేన్కు ఉన్న అంకితభావానికి, నిబద్ధతకు నెటిజెన్లు సెల్యూట్ చేస్తున్నారు.
సంజయ్కి ఒక్కరికే సెల్యూట్ చేయడం లేదని తన కష్టాల్లో ఉన్న సమయంలో అండగా ఉండి ఇంతటి వాడిని చేసిన కుటుంబ సభ్యులకు, మిత్రులకు, ఆయనలో ఆశకలిగించేలా స్ఫూర్తి ఇచ్చినవారికి,మానసిక బలం చేకూర్చిన వారికందరికి సెల్యూట్ చేస్తున్నట్లు పింకి భట్టాచార్య అనే మహిళ ట్వీట్ చేశారు. మరోవైపు రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోంది అని చెప్పుకునే మంత్రులు ఒక్కసారి సంజయ్ పరిస్థితిని చూసి అతనికి వీల్ ఛైర్తో పాటు కనీస అవసరాలు కల్పించాలని డిమాండ్ చేసింది నిషా అనే మరో మహిళ.
శిక్షసంబాల్ అనేది రాజస్థాన్ ప్రభుత్వం మానసపుత్రిక ప్రాజెక్ట్. ఆర్థిక ఇబ్బందులతో చదువులు మానేసిన విద్యార్థులకు తిరిగి ఉచిత విద్యను అందిస్తోంది.అంతే కాదు స్కూళ్లలో సరిపడా బోధనా సిబ్బంది లేకుంటే అక్కడ టీచర్లను నియమిస్తుంది. ఈ పథకం అజ్మీర్, బిల్వాడా, చిత్తోర్ఘడ్, రాజ్సమంద్, ఉదయ్పూర్ జిల్లాలో అమలవుతోంది. శిక్ష సంబాల్ ద్వారా దాదాపు 70వేల మంది 9వ తరగతి నుంచి 12వ తరగతి చదివే విద్యార్థలు లబ్ది పొందుతున్నారు.