ఇదిగో సాక్ష్యం: సెల్ఫీలు ప్రాణాలు తీయడమే కాదు...ప్రాణాలు కూడా నిలబెడుతాయి.!
కొట్టాయం: రెండేళ్ల క్రితం హైదరాబాదులోని భరత్నగర్ రైల్వేస్టేషన్లో ఓ యువకుడు రైలు వస్తుండగా సెల్ఫీ కోసం ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. ఇలా సెల్ఫీ మోజులో పడి నదిలో కొట్టుకుపోయిన వారున్నారు... ఇతర ప్రమాదాల బారిన పడి మృతి చెందిన వారున్నారు. అయితే ఈ ఘటనలో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది. ఆత్మహత్య చేసుకుందామనుకున్న వ్యక్తి సెల్ఫీనే అతన్ని ప్రాణాలతో కాపాడింది.
కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి భార్యతో గొడవై ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ఇందుకోసం రైలుపట్టాలు పై పడుకొని తన బాధను చెప్పుకొని దాన్ని సెల్ఫీ తీసి తన స్నేహితులకు పంపాడు. తను ఇక బ్రతకదలుచుకోలేదని ప్రాణాలు తీసుకుంటున్నానంటూ చెప్పి వీడియో రికార్డు చేసి తన స్నేహితులకు పంపాడు. ఇది చూసిన తన స్నేహితులు అతన్ని కాపాడాలని భావించారు. అయితే తాను ఎక్కడున్నాడో తెలియదు. ఆ వీడియోలోనే ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని అదేపనిగా మళ్లీ చూశారు. అందులో ఓ పసుపు పచ్చ మైలురాయి కనిపించింది. అది రైల్వేకు సంబంధించిందని వెంటనే వారు రైల్వే అధికారులను సంప్రదించారు. ఆ మైలురాయి ఉన్న స్థలాన్ని రైల్వే అధికారులు గుర్తించారు.
న్యూఢిల్లీ నుంచి కేరళకు వెళుతున్న రైలులో వ్యక్తి స్నేహితుడు ఒకరు ఉన్నారు. వెంటనే ఆ వ్యక్తి రైలు డ్రైవర్ దగ్గరకు వెళ్లి ఆ వ్యక్తి ఉన్న ప్రదేశాన్ని గుర్తించాడు. మరోవైపు ఆ రూట్లలో వెళ్లే రైళ్లు నిదానంగా వెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఆ రూట్లో చిన్నగా వెళ్లాయి రైలు. ఆ వ్యక్తిని ప్రాణాలతో కాపాడగలిగారు. వెంటనే రైల్వే పోలీసులు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వ్యక్తి భార్యను కూడా పిలిపించి ఇద్దరికీ కౌన్సలింగ్ ఇచ్చారు. కాపురం అన్న తర్వాత చిన్న గొడవలు సహజమే అని వీటికే ప్రాణాలు తీసుకుంటే ఎలా అని మందలించారు పోలీసులు. మరోసారి గొడవ పడమని ఓ అండర్ టేకింగ్ లెటర్ను దంపతుల దగ్గర నుంచి తీసుకుని వారిని విడిచిపెట్టారు.