రూ.650కోట్ల నల్లధనం: మార్చేందుకు 700మందిని వాడాడు!
ఇటీవల ఆదాయపు పన్ను శాఖ అధికారులకు రూ. 650కోట్ల నల్లధనంతో చిక్కిన టీ అమ్ముకునే సూరత్ వడ్డీ వ్యాపారి కిశోర్ భాజీవాలా కేసులో మరో సంచలన విషయం వెలుగుచూసింది. పెద్దనోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో డబ్బులు జమ
అహ్మదాబాద్: ఇటీవల ఆదాయపు పన్ను శాఖ అధికారులకు రూ. 650కోట్ల నల్లధనంతో చిక్కిన టీ అమ్ముకునే సూరత్ వడ్డీ వ్యాపారి కిశోర్ భాజీవాలా కేసులో మరో సంచలన విషయం వెలుగుచూసింది. పెద్దనోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో డబ్బులు జమచేసేందుకు, విత్డ్రా చేసేందుకు భాజీవాలా దాదాపు 700 మందికి పైగా ఉపయోగించుకున్నట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి.
నల్లధనాన్ని దాచేందుకు భాజీవాలాకు మొత్తం 27 బ్యాంకు ఖాతాలు ఉపయోగించినట్టు గుర్తించారు. అందులో 20 ఖాతాల దాకా బినామీ ఖాతాలే ఉండటం గమనార్హం. కాగా ఇప్పటి వరకు ఎంత డబ్బు జమ చేశాడు, ఎంత విత్డ్రా చేశాడన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు.
గత శనివారం అతడి ఇంట్లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు 10.45 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. మరో రూ.400 కోట్ల విలువ చేసే ఆస్తులు కూడా పట్టుబడ్డాయి. స్వాధీనం చేసుకున్న డబ్బులో రూ.1.45 కోట్లకు పైగా కొత్తనోట్లు ఉన్నాయి. ఇంకా రూ. 1.48 కోట్ల విలువైన బంగారం, రూ.4.93 కోట్ల వజ్రాల నగలు, రూ.1.39 కోట్ల విలువైన వజ్రాలు, రూ.77.8 లక్షల విలువైన వెండి కడ్డీలు స్వాధీనం చేసుకున్నారు.
పెద్ద ఎత్తున బ్యాంకు ఖాతాలతో పాటు ఈ కేసులో ప్రముఖలు ప్రమేయం ఉన్నట్టు అనుమానించిన ఐటీ శాఖ తదుపరి విచారణ కోసం సీబీఐకి అప్పగించింది. కాగా భాజీవాలా నవంబర్ 12, 13, 14 తేదీల్లో ఒక్కో బ్యాంకు ఖాతాలో లక్ష రూపాయల నుంచి నాలుగు లక్షల దాకా జమచేసినట్టు సీబీఐ వెల్లడించింది.
నల్లధనాన్ని మార్చుకునేందుకు దాదాపు 700 మందిని ఉపయోగించుకున్నట్టు తెలిపింది. బ్యాంకు లావాదేవీల కోసం సూరత్ సహకార బ్యాంకు సీనియర్ మేనేజర్ పంకజ్ భట్ సహకరించినట్టు తేల్చారు. కేసు విచారణ కొనసాగుతోందని తెలిపారు.