మోడీ కేబినెట్లో అత్యధిక మంత్రి పదవులు దక్కిన రాష్ట్రం ఇదే..!
నరేంద్ర మోడీ రెండవ సారి దేశ ప్రధానిగా గురువారం ప్రమాణస్వీకారం చేశారు. పలువురు ఎంపీలు కూడా ఆయన కేబినెట్లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మోడీ కేబినెట్లో అత్యధిక మంత్రులు ఏ రాష్ట్రం నుంచి ఉన్నారు...?
ఉత్తర్ ప్రదేశ్కే మంత్రి పదవుల్లో అధిక ప్రాధాన్యం
సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బీజేపీ పార్టీ రెండవ సారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గురువారం రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా జరిగిన నరేంద్రుడి ప్రమాణ స్వీకారోత్సవంలో పలువురు ఎంపీలు కూడా మంత్రులుగా చేశారు. ఇందులో ఒక్క ఉత్తర్ ప్రదేశ్ నుంచే ప్రధాని మోడీతో కలిపి 10 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో అత్యధిక మంత్రులు కలిగిన రాష్ట్రంగా ఉత్తర్ప్రదేశ్ నిలిచింది. ఆ తర్వాత మహారాష్ట్ర నుంచి 7 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఏ రాష్ట్రానికి ఎన్ని మంత్రి పదవులు
రెండో దఫా మోడీ ప్రభుత్వంలో ఆయన సొంత రాష్ట్రం నుంచి ముగ్గురు, రాజస్థాన్, హర్యానాల నుంచి ముగ్గరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా... కర్నాటక, పశ్చిమ బెంగాల్, ఒడిషా మధ్యప్రదేశ్ల నుంచి ఇద్దరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక గుజరాత్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఒడిషా, పశ్చిమ బెంగాల్లో బీజేపీ పుంజుకుంది. వెస్ట్ బెంగాల్లో 2022లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో కమలం పార్టీ 18 ఎంపీ సీట్లను గెలిచి ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంది. అయితే బెంగాల్ నుంచి కేంద్రమంత్రులుగా బాబుల్ సుప్రియో మరియు దేవిశ్రీ చౌదరీలు మాత్రమే మోడీ కేబినెట్కు ఎంపికయ్యారు. ఒడిషాలో 8 సీట్లు సాధించిన బీజేపీకి ధర్మేంద్ర ప్రధాన్, ప్రతాప్ చంద్ర సారంగిలు కేంద్ర కేబినెట్లో ఉన్నారు. అయితే బీహార్ నుంచి ధర్మేంద్ర ప్రధాన్ రాజ్యసభకు ఎంపికయ్యారు.
మంత్రి పదవులు దక్కని రాష్ట్రాలు ఇవే
ఒక్క ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, సిక్కిం, త్రిపురాలు తప్పితే మోడీ కేబినెట్లో అన్ని రాష్ట్రాలకు మంత్రి పదవులు దక్కాయి. ఇక ఉత్తర్ ప్రదేశ్ నుంచి ప్రధాని మోడీతో పాటు రాజ్నాథ్ సింగ్, స్మృతీ ఇరానీ, మహేంద్రనాథ్ పాండే, సంజీవ్ బాల్యన్, సాధ్వీ నిరంజన్ జ్యోతి, వీకే సింగ్, సంతోష్ గంగ్వార్, హర్దీప్ సింగ్ పూరీ, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీలు ఉన్నారు. యూపీలో బీజేపీ 62స్థానాలు గెలచుకోగా మిత్రపక్షాలు రెండు సీట్లలో విజయం సాధించాయి. ఉత్తర్ప్రదేశ్లో 80 స్థానాలు ఉండగా మహారాష్ట్రలో 48 స్థానాలు, మధ్యప్రదేశ్లో 40 స్థానాలున్నాయి.