పెద్దల అనుమతి లేకుండా ప్రేమ పెళ్లి చేసుకోం: వాలెంటైన్స్ డే రోజు 10వేల మంది ప్రమాణం
సూరత్: గత కొంతకాలంగా ప్రేమికుల దినోత్సవపై వివాదం కొనసాగుతోంది. ప్రేమికుల దినోత్సవంకు కొందరు మద్దతు పలుకుతుంటే, పలు మతాల సంప్రదాయవాదులు దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఇదిలా ఉండగా, గుజరాత్ రాష్ట్రంలోని సూరత్లో వేలాది మంది యువత ఫిబ్రవరి 14వ తేదీన ఓ ప్రమాణం చేసేందుకు సిద్ధమయ్యారు.
తల్లిదండ్రులను ఎధిరించి పెళ్లి చేసుకోమని ప్రమాణం
గురువారం (ఫిబ్రవరి 14) ప్రేమికుల రోజు. ప్రేమించిన వారికి మనసులో మాట చెప్పడానికి ఉవ్విళ్లూరే వారు ఓ వైపు, జంటగా కనిపిస్తే పెళ్లి చేసేందుకు మరికొందరు ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రేమికుల దినోత్సవం వివాదంగా మారుతోంది. వీటికి భిన్నంగా సూరత్లో యువత ప్రమాణం చేయనున్నారు. దాదాపు పదివేల మంది విద్యార్థుల చేత పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకోమమని ప్రమాణం చేయించే కార్యక్రమం ఒకటి జరగనుంది. ఇది హాస్యమేవ జయతే అనే సంస్థ ఆధ్వర్యంలో జరుగుతోంది.
అందుకే ఇలా చేస్తున్నాం
దీనిపై ఆ సంస్థకు చెందిన సభ్యులు ఒకరు స్పందిస్తూ.. ప్రేమించడం, పెద్దలను ఎదిరించడం, పారిపోయి పెళ్లి చేసుకోవడం ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయాయని, పెళ్లి చేసుకున్న వారు సంతోషంగా ఉంటే ఏ సమస్య లేదని, కానీ కొందరు పెళ్లైన ఆరు నెలలలోపే విడాకుల తీసుకుంటున్నారని, లేదంటే ఎదిరించి చేసుకున్నందుకు పెద్దలే వారి మీద దాడి చేయడం వంటి సంఘటనలను నిత్యం చూస్తూనే ఉన్నామని చెప్పారు.
సమస్య తలెత్తకుండా
ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు, విద్యార్థుల చేత 'తల్లిదండ్రుల అనుమతి లేకుండా ప్రేమ వివాహం చేసుకోమ'ని ప్రతిజ్ఞ చేయిస్తున్నామని, 12 పాఠశాలల నుంచి దాదాపు 10 వేలకు పైగా విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని సదరు సభ్యులు తెలిపారు.