నిన్ననే నితీశ్ పాదాలు తాకి... ఇవాళ మళ్లీ మాటల దాడి... విరుచుకుపడ్డ చిరాగ్ పాశ్వాన్...
రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ పొరపాటున మళ్లీ నితీశ్ కుమార్ విజయం సాధిస్తే... రాష్ట్రం అధోగతిపాలవుతుందని లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ అన్నారు. నితీశ్ మళ్లీ అధికారంలోకి వస్తే.. రాష్ట్రం వినాశనం అంచుకు చేరుతుందని విమర్శించారు. ఒకప్పుడు ప్రధాని మోదీ అంటే అసూయపడ్డ నితీశ్.. ఇప్పుడదే మోదీ చేసిన అభివృద్దిని తన పేరు మీద ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. నిన్ననే(మంగళవారం,అక్టోబర్ 20) నితీశ్ కుమార్ పాదాలు తాకి ఆయన ఆశీర్వాదం తీసుకున్న చిరాగ్ పాశ్వాన్.. ఆ మరుసటిరోజే ఆయనపై విమర్శల దాడి చేయడం గమనార్హం.
సచిన్-సెహ్వాగ్ జోడీలా నితీశ్-మోదీ - చైనా సరిహద్దులో బీహార్ సైనికుల ప్రాణత్యాగం: రాజ్నాథ్
నితీశ్... ఇక ఇదే చివరిసారి...
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా వారం రోజుల ముందు చిరాగ్ పాశ్వాన్ తమ పార్టీ ఎన్నికల క్యాంపెయిన్ను బుధవారం(అక్టోబర్ 21) ప్రారంభించారు.ఈ సందర్బంగా చిరాగ్ మాట్లాడుతూ... నితీశ్ ఒక కులతత్వ,మతతత్వ వ్యక్తి అని ఆరోపించారు. ఆయన నాయకత్వంలో బీహార్ అభివృద్ది చెందదన్నారు. మన ప్రస్తుత ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉండటం ఇదే చివరిసారి అని తాను చాలా బలంగా నమ్ముతున్నట్లు నితీశ్ను ఉద్దేశించి అన్నారు.
'బీహార్ ఫస్ట్,బీహారీ ఫస్ట్'
'బీహార్ ఫస్ట్,బీహారీ ఫస్ట్' విజన్తో రూపొందించిన తమ పార్టీ మేనిఫెస్టో బీహార్ ప్రజల సమస్యలను పరిష్కరిస్తుందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. వరదలు,కరువును నివారించడానికి రాష్ట్రంలోని అన్ని నదుల కెనాల్స్ను అనుసంధానం చేస్తామన్నారు.నిరుద్యోగులు,ఉద్యోగాలు కల్పించే సంస్థలను కనెక్ట్ చేసేలా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక వెబ్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకొస్తామని చిరాగ్ అన్నారు. అంతేకాదు,యూత్ కమిషన్ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో,మార్కెట్ల పరిధిలో మహిళలకు విడిగా టాయిలెట్స్ ఏర్పాటు చేస్తామన్నారు.
ఆ విమర్శలను తోసిపుచ్చిన చిరాగ్..
మొదటిసారి తన తండ్రి రాంవిలాస్ పాశ్వాన్ లేకుండా ఎన్నికల బరిలో దిగడం కాస్త ఇబ్బందిగానే ఉందన్నారు చిరాగ్ పాశ్వాన్. ఇక బీజేపీకి ఎల్జేపీ 'బీ' టీమ్ అన్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. ఏదో పార్టీకి బీ టీమ్లా తామెందుకు ఉంటామని... తమ పార్టీ 20 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉందని అన్నారు. తమ పార్టీ వ్యవస్థాపకుడు 51 ఏళ్లు క్లీన్ పొలిటీషియన్గా తన పొలిటికల్ కెరీర్ను కొనసాగించారని గుర్తుచేశారు. మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వితో లోపాయకారీ ఒప్పందం ఉందని వస్తున్న విమర్శలను కూడా ఆయన తోసిపుచ్చారు. తన సొంత భావజాలంతో,సొంత విజన్తో ఎన్నికల బరిలో దిగానని చెప్పారు.
నిన్ననే నితీశ్ పాదాలు తాకిన చిరాగ్...
ఇటీవల కన్నుమూసిన కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ స్మారకార్థం నిన్న సాయంత్రం (అక్టోబర్ 20) సాయంత్రం పాట్నాలో నిర్వహించిన కార్యక్రమానికి నితీశ్ హాజరైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ముగ్గురు రాజకీయ ప్రత్యర్థుల ఒక్కచోట చేర్చింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్,మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్,లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్.. ఈ కార్యక్రమంలో పక్కపక్కనే కూర్చొన్నారు. ఎన్నికల ర్యాలీల్లో ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్న వేళ... రాజకీయ విబేధాలన్నింటినీ పక్కనపెట్టి ముగ్గురూ ఒక్కచోట చేరడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదే కార్యక్రమంలో చిరాగ్ పాశ్వాన్ నితీశ్ పాదాలు కూడా తాకి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఓవైపు ఆయనపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే... ఇలా ఆయన కనబడగానే ఆశీర్వాదం తీసుకోవడం చర్చనీయాంశమైంది.