నేను చాలా చిన్నవాడిని, భయపెట్టింది: ఉద్వేగానికి లోనైన కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ శానససభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వారికి తన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. విజయం సాధిస్తామని అనుకున్నాం గానీ ఇంత ఘన విజయం సాధిస్తామని తాను కూడా అనుకోలేదని ఆయన అన్నారు. ఈ విజయం తనను భయపెడుతోందని ఆయన అన్నారు.
ఢిల్లీ ప్రజలు మనకు ఇచ్చిన మద్దతు చూసి అహంకారం పెంచుకోవద్దని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బిజెపి అంతానికి ఢిల్లీ ఫలితాలు నాంది పలుకుతున్నాయని ఆయన అన్నారు. నిజాయితీతో నడిస్తే ప్రపంచం ఆదరిస్తుందని ఆయన అన్నారు తాను చాలా చిన్నవాడినని, ఒక్కడినే ఏమీ చేయలేనని, అందరం కలిసి నడిస్తేనే ముందుకు సాగుతామని ఆయన అన్నారు. ఢిల్లీని ప్రపంచ గర్వపడే నగరంగా తీర్చి దిద్దవచ్చునని ఆయన అన్నారు.
నీతికి, నిజాయితీకి దక్కిన విజయమని ఆయన అన్నారు. అహంకారంతోనే కాంగ్రెసు, బిజెపిలు ఓడిపోయాయని ఆయన అన్నారు. తన భార్యను అరవింద్ కేజ్రీవాల్ కార్యకర్తలకు పరిచయం చేశారు. తన భార్య సహకారం లేకుంటే ఏమీ సాధించలేకపోయేవాడినని ఆయన అన్నారు. భారత్ మాతాకీ జై అంటూ కేజ్రీవాల్ నినదించారు. పాంచ్ సాల్ కేజ్రీవాల్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.
కార్యకర్తల హర్షధ్వానాల మధ్య ఆయన తీవ్రమైన ఉద్వేగంతో ప్రసంగించారు. ఢిల్లీలో అవినీతిని ఉడ్చేయడం తన ప్రథమ లక్ష్యమని ఆయన అన్నారు. కేజ్రీవాల్కు కిరణ్ బేడీ అభినందనలు తెలిపారు. తెలంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కూడా కేజ్రీవాల్ను అభినందించారు.