బెంగుళూరులో మహిళా టెక్కీపై ఆటో డ్రైవర్ దాడి, సోషల్ మీడియాలో పోస్ట్
బెంగుళూరు: ఆటో మీటర్ కన్నా అధికంగా అడిగిన దానికి ఇచ్చేందుకు నిరాకరించినందుకు తనను ఆటో డ్రైవర్ కొడుతుంటే, చుట్టూ ఉన్నవారంతా చూసారే తప్ప రక్షించడానికి రాలేదని వాపోయింది బెంగుళూరుకి చెందిన ఓ మహిళా టెక్కీ. వెంటనే 100కి ఫోన్ చేసి చెప్తే, తాము అక్కడికి రాలేమని, పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయాలన్నారని సోషల్ మీడియాలో తన గొడును వెళ్లబోసుకుంది.
సంఘటనా వివరాలిలా ఉన్నాయి. ఓలా క్యాబ్స్లో డ్రైవర్గా పనిచేస్తున్న రిజ్వాన్ బాషా, ఖాళీ సమయంలో ఆటో నడుపుతుంటాడు. బెంగుళూరులోని ఒక ప్రైవేట్ సంస్ధలో పనిచేస్తోన్న ఓ మహిలా ఉద్యోగి మీటరుపై చెల్లించడానికి ఆటో మాట్లాడుకొని ఎక్కింది.
మార్గంమధ్యలో అదనంగా రూ. 30 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇందుకు ఆ మహిళ అంగీకరించకపోడవంతో రోడ్డు మధ్యలో ఆటో ఆపి తనపై గొడవకు దిగాడని పేర్కొంది. తనని తిడుతూ, చెయ్యి పట్టుకొని బయటకు లాగడంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటే, తనకేమీ భయంలేదంటూ పెద్దగా అరుస్తూ, తనపై పలుమార్లు చేయి చేసుకున్నాడని ఆరోపించింది.
అక్కడున్న వారంతా చుట్టూ చేరి ఆటో డ్రైవర్ తనపై దాడి చేస్తున్న సంఘటనను చూస్తున్నారే తప్ప, అడ్డుకునేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదని సోషల్ మీడియా వెబ్సైట్ ఫేస్ బుక్లో పోస్ట్ చేసింది. దీనిపై స్పందించిన ప్రముఖ యాప్ ఆధారిత ట్యాక్సీ సంస్ధ ఓలా ఆ డ్రైవర్ను తమ సర్వీసు విధుల నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొంది.
ఇక ఈ విషయంపై స్పందించిన పోలీసులు తమ ఫేస్బుక్ అకౌంట్ ద్వారా స్పందిస్తూ, కేసును ట్రాఫిక్ నిర్వహణ విభాగానికి బదిలీ చేశామని, సదరు ఆ యువతి ఇంతవరకూ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇవ్వలేదని పేర్కొన్నారు. డ్రైవర్కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆ మహిళా టెక్కీ తన కెమెరాతో ఫోటో తీసి ఫేస్ బుక్లో పోస్ట్ చేయడంతో పాటు జరిగిన మొత్తం కథనాన్ని వివరించింది.
ఢిల్లీకి చెందిన ఈ యువతి తన భర్తతో కలిసుంటూ బెంగుళూరులో ఒక ప్రముఖ కంపెనీలో ఐటీ ఉద్యోగిగా విధులను నిర్వర్తిస్తున్నారు. ఈ సంఘటన బెంగుళూరులోని దొమ్మలూరు ప్రాంతంలో చోటు చేసుకుంది.