కశ్మీర్ వైపు ప్రపంచం చూపు.. ఆగస్టు 15: లాల్ చౌక్ లో నాడు మోదీ..నేడు షా..!!
దేశం మొత్తం 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబు అవుతోంది. ఆగస్టు 15 వేడుకలకు ఢిల్లీ నుండి గల్లీ దాకా ప్రత్యేక సంబరాలు. కానీ, ఈ సారి ఆగస్టు 15కు ప్రత్యేకత ఉంది. దేశం మొత్తం 72 ఏళ్లుగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటుంటే..జమ్ము కాశ్మీర్ లో ఈ సారి దేశంతో కలిసి వేడుకలు జరపుకోవటానికి రంగం సిద్దమైంది. భారత దేశంలోనే ఉంటూ మువ్వెన్నల జెండా ఎగురవేయాలంటే భయం. ఎక్కడ వేర్పాటు వాదులకు టార్గెట్ అవుతామో..ఎక్కడ ఉగ్రవాదుల దాడులు జరుగుతాయో అనే టెన్షన్. కానీ, ఇప్పుడు దేశం మొత్తం అదే కాశ్మీర్ వైపు సగర్వంగా చూస్తోంది. అక్కడ జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ పైనే యావత్ జాతి ఆసక్తిగా ఉంది. 1992లో లాల్ చౌక్ లో నేటి ప్రధాని..నాటి బీజేపీ నేత నరేంద్ర మోదీ బాంబు పేలుళ్ల మధ్య జెండా ఆవిష్కరించారు. ఇప్పుడు ఆయన కేబినెట్ లోని హోం మంత్రి అమిత్ షా అదే ప్రాంతంలో అధికారికంగా త్రివర్ణ పతాకం ఎగుర వేయటానికి సిద్దమయ్యారు. ఇక...భారత క్రికెట్ టీం మాజీ కెప్టెన్ లడాఖ్ లో జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.
దేశం చూపు..జమ్ము కాశ్మీర్ వైపు..
దేశం మొత్తం 73వ స్వాంతంత్ర వేడుకలకు సిద్దం అయింది. ఇదే సమయంలో జమ్మూకశ్మీర్ లో స్వయంప్రతిపత్తిని ఎత్తివేసిన తర్వాత రాష్ట్రంలో మొదటిసారి స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం జమ్ము కాశ్మీర్ లో ఆర్టికల్ 370..35 ఏ రద్దు చేసిన తరువాత జరుగుతున్న స్వాతంత్ర వేడుకలు ఇవే కావటంతో ఇప్పుడు అందరి చూపు అటు వైపే నెలకొని ఉంది. ఎలాగైనా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను భగ్నం చేయాలని వేర్పాటు వాదుల మద్దతుతో కొందరు అలజడి క్రియేట్ చేసేందుకు సిద్దం అవుతున్నారు. కానీ, కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోంది. జమ్ము కాశ్మీర్ ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతం కావటంతో పూర్తిగా పరిస్థితి కేంద్ర హోం శాఖ పరిధిలో ఉంది. అడుగడుగునా భద్రతా దళాలు మొహరించాయి. ప్రతీ గ్రామంలో త్రివర్ణ పతాకం నిర్బయంగా ఎగుర వేయాలని కేంద్రం సూచించింది. ఇందు కోసం జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ ధోవల్ అక్కడే మకాం వేసారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. అక్కడ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉంటూ అధికారులకు అవసరమైన మార్గదర్శకాలు ఇస్తున్నారు. దీంతో.. ఈ సారి ఆగస్టు 15 దేశంలోనే కాదు..ప్రపంచలోని అనేక దేశాల్లోనూ ఆసక్తి కరంగ మారింది.
ప్రత్యేక ఏర్పాట్లతో వేడుకలు..
73 స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబు అవుతోంది. జమ్మూకశ్మీర్ లో స్వయంప్రతిపత్తిని ఎత్తివేసిన తర్వాత రాష్ట్రంలో మొదటిసారి స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుగనున్న నేపథ్యంలో.. ఈ సారి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నారు. ఇందులో భాగంగా.. శ్రీనగర్ లో వేడుకలకు రిహార్సల్ ప్రారంభమయ్యాయి. శ్రీనగర్ లో భద్రతా దళాలు చేస్తోన్న ప్రత్యేక విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. భద్రతా దళాలకు చెందిన వివిధ విభాగాలు ప్రత్యేక దుస్తులు ధరించి విన్యాసాలను ప్రదర్శిస్తున్నారు. ప్రతిసారి భద్రతపైనే ప్రత్యేక దృష్టిసారించే భద్రతా దళాలు ఈసారి రిహార్సల్ కోసం ప్రత్యేకంగా ప్రిపేర్ అవుతున్నాయి. జరుగుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీనగర్ లోని లాల్ చౌక్ లో మువ్వన్నెల జెండాను ఎగురవేయనున్నారు. ఈ నేపథ్యంలో, అన్ని ఏర్పాట్లను చేయాలని జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆదేశాలు జారీ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జమ్ముకశ్మీర్ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. కళాకారుల బృందాలతో ఇప్పటికే అక్కడ సందడి నెలకొంది. మరోవైపు, లడాఖ్ లో టీమిండియా క్రికెటర్ ధోనీ జాతీయ జెండాను ఎగురవేయనున్నాడు.
లాల్ చౌక్ లో నాడు మోదీ..నేడు అమిత్ షా
ఎవరైనా శ్రీనగర్ లో భారత జెండా ఆవిష్కరిస్తే ప్రాణాలతో తిరిగి వెళ్లరనే ఉగ్రవాదు హెచ్చిరకలకు ..నేటి ప్రధాని నాటి బీజేపీ నేత ఎదురుగా వెళ్లారు. బీజేపీ నేత మురళీ మనోహర్ జోషీతో కలిసి కన్యాకుమారి నుండి జమ్ముకు విమానంలో వెళ్లారు. అక్కడి నుండి ఆ ఇద్దరూ హెలికాఫ్టర్ లో శ్రీనగర్ చేరుకున్నారు. లాల్ చౌక్ వద్దకు చేరుకొని మువ్వెన్నల జెండాను ఆవిష్కరించారు. వెంటనే సమీపంలో అయిదు బాంబు లు పేలాయి. అయినా..మోదీ చలించలేదు. జాతీయ గీతాన్ని పూర్తి చేసి నింపాదిగా అక్కడి నుండి వెళ్లి కారు ఎక్కి వెళ్లి పోయారు. నాటి బీజేపీ నేతగా మోదీ ఎదుర్కొన్న అనుభవాలు..370 రద్దు కోసం చేసిన దీక్షలు ఆయనలో కసిని పెంచాయి. ఇక, తాజాగా అక్కడ మొత్తంగా ఆర్టికల్ 370 రద్దకు కారణమయ్యాయి. ఎక్కడైతే నాడు లాల్ చౌక్ లో మోదీ జెండా ఆవిష్కరించారో...ఇప్పుడు అక్కడే మోదీ శిశ్యుడు.. ఆయన కేబినెట్ లో హోం మంత్రిగా ఉన్న అమిత్ షా జెండా ఆవిష్కరణకు రంగం సిద్దమైంది. ఎర్రకోట నుండి మోదీ..లాల్ చౌక్ నుండి అమిత్ షా జెండా ఆవిష్కరణ చేస్తారు. నాడు దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజుల్లో ఎటువంటి భావోద్వేగం ప్రజల్లో కనిపించిందో..ఇప్పుడు సరిగ్గా జమ్ము కాశ్మీర్ లో అదే పరిస్థితి నెలకొని ఉంది. మొత్తంగా ఈ సారి ఆగస్టు 15 వేడుకల్లో కాశ్మీర్ మేనియా కనిపిస్తోంది.