స్టెరిలైట్ అంటే ఎందుకు వ్యతిరేకత, మరోసారి కాల్పులు, 12కు చేరిన మృతులు
చెన్నై: తుత్తుకూడిలో మరోసారి పోలీసులు రెచ్చిపోయారు. పోలీసుల కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా మరణించిన వ్యక్తితో ఈ ఘటనలో మృతి చెందినవారి సంఖ్య 12కు చేరుకొంది.దీంతో మరోసారి తుత్తుకూడిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
తుత్తుకూడిలో మరోసారి బుధవారం నాడు అన్నానగర్లో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఘటనను నిరసిస్తూ ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్ళు రువ్వారు.
దీంతో తుత్తుకూడి ఎస్పీ సహా సుమారు 20 మందికి పైగా పోలీసులకు గాయాలయ్యాయి. మొత్తంగా మరోసారి బుధవారం కూడ తుత్తుకూడిలో ఉద్రిక్తత చోటు చేసుకొంది.
గుర్తుతెలియని వ్యక్తులు ప్రభుత్వాసుపత్రి వద్ద ఉన్న పోలీసు వాహనానికి నిప్పు పెట్టారు. మరో వాహనానికి కూడ నిప్పు పెట్టారు. ప్రభుత్వాసుపత్రి వద్ద మృతదేహాలను పోస్ట్మార్టం నిర్వహించకుండా అడ్డుకొన్నారు. ఈ సమయంలో పోలీసులు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది.
తుత్తుకూడిలో 12కు చేరిన మృతులు
తుత్తుకూడిలో మరోసారి బుధవారం నాడు కాల్పులు చోటు చేసుకొన్నాయి. ఈ కాల్పుల ఘటనతో మొత్తం 12 మంది మరణించారు. తుత్తుకూడిలో మే 22న జరిగిన పోలీసుల కాల్పుల్లో 11 మంది మృత్యువాత పడ్డారు. మే 23న జరిగిన కాల్పుల్లో మరోకరరు మరణించారు. ఇంకా మరో ముగ్గురు సీరియస్గా గాయపడ్డారు. ఈ పరిణామాలతో తుత్తుకూడిలో ఉద్రిక్తత నెలకొంది.
స్టెరిలైట్ ఫ్యాక్టరీపై ప్రజల నిరసన ఎందుకు
స్టెరిలైట్ ఫ్యాక్టరీపై ప్రజలు అంతగా తీవ్ర వ్యతిరేకతను పెంచుకోవడానికి అనేక కారణాలున్నాయని స్థానికులు చెబుతున్నారు. పర్యావరణ కాలుష్యంలో తుత్తుకూడి పట్టణం చెన్నై తర్వాతి స్థానంలో ఉంది. ఈ ఫ్యాక్టరీ కారణంగానే భూగర్భజలాలు కలుషితం అవుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఫ్యాక్టరీని మూసివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వేదాంత కాపర్ యూనిట్ ను మూసివేయాలని ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ కారణంగా స్థానికులు రోగాల బారిన పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు అలర్జీలు వస్తున్నాయని కూడ ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు. 2013లో అప్పటి సీఎం జయలలిత ఈ ఫ్యాక్టరీని మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వ ఉత్తర్వులను జాతీయ హరిత ట్రిబ్యునల్ తిరస్కరించడంతో కంపెనీ మళ్ళీ తెరుచుకొంది.రాగిని కరిగించడం వల్ల సీసం, ఆర్సెనిక్, అల్యూమినియం, రాగితో భూగర్భజలాలు కలుషితం అవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
జలియన్ వాలా బాగ్ తో పోల్చిన డిఎంకె
తుత్తుకూడిలో స్టైరిలైట్ ఆందోళనకారులపై పోలీసుల కాల్పుల ఘటనను డిఎంకె మరో జలియన్ వాలా బాగ్ గా అభివర్ణించింది. ఆందోళనకారులపై కాల్పులు జరపాలని పోలీసులకు ఎవరు ఆదేశాలు జారీ చేశారని డిఎంకె చీఫ్ స్టాలిన్ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని పోలీసు రాజ్యంగా మార్చేశారని స్లాలిన్ విమర్శించారు. తమిళనాడు సీఎం పళనిస్వామిపై ఆయన నిప్పులు చెరిగారు.
కమల్హాసన్పై కేసు
తుత్తుకూడి ఘటనలో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు సినీ నటుడు రాజకీయ నేత కమల్హాసన్ బుధవారం నాడు వెళ్ళారు. దీంతో కమల్హాసన్పై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితులను పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్ళిన ప్రముఖ నటుడు కమల్ హాసన్పై పోలీసులు కేసు నమోదు చేశారు. 144 సెక్షన్ అమలవుతున్న ప్రదేశానికి ఆయన వెళ్ళినందుకు ఈ కేసు నమోదు చేశారు.