స్టెరిలైట్ హింస: ఘటనపై వివరాలు అందించాలన్న సుప్రీం
న్యూఢిల్లీ: తమిళనాడులోని తూత్తుకుడిలో స్టెరిలైట్ కర్మాగారాన్ని మూసివేయాలని ఆందోళన చేస్తున్న ప్రజలపై పోలీసులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 13మందిని బలితీసుకున్న ఘటనపై సుప్రీంకోర్టు స్పందించింది.
ఈ ఘటనకు సంబంధించిన మొత్తం వివరాలను మే 28లోపు సమర్పించాలని ఆదేశించింది. జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, ఇందూ మల్హోత్రాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. తూత్తుకుడి ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలంటూ దాఖలైన పిల్పై సుప్రీం ఈ మేరకు స్పందించింది.
కాగా, ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ప్రజలపై కాల్పులు జరిపినందుకుగానూ తూత్తుకుడి జిల్లా కలెక్టర్, పోలీసు శాఖ అధికారిని బదిలీ చేశారు. ఈ ఘటనలో 13మంది మృత్యువాత పడిన విషయంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ జీఎస్ మణి అనే న్యాయవాది సుప్రీం కోర్డులో పిల్ దాఖలు చేశారు. ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని అందులో ఆయన పేర్కొన్నారు.
బాధితులకు నష్టపరిహారం విషయంలోనూ అన్యాయం జరిగిందని, ఘటనలో మృత్యువాత పడిన వారికి రూ.50లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.25లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని ఆయన ఆ పిల్లో పేర్కొన్నారు. అయితే ఈ పిల్కు సంబంధించిన వివరాలు అసంపూర్తిగా ఉన్నాయని, ఘటన తాలూకు పూర్తి వివరాలను మే 28లోపు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ ఘటనలో మృతి చెందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10లక్షలు నష్టపరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.