కాంగ్రెస్కు షాక్.. మెగా అపోజిషన్ మీటింగ్కు ఆ ముగ్గురు డుమ్మా..!
కరోనా వైరస్ వ్యాప్తి,లాక్ డౌన్ చర్యలు,ఉద్దీపన ప్యాకేజీ తదితర అంశాలపై చర్చించేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేత్రుత్వంలో శుక్రవారం(మే 22) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతిపక్ష పార్టీల సమావేశం జరగనుంది. అయితే ఈ మెగా అపోజిషన్ సమావేశానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్,బహుజన్ సమాజ్ అధినేత్రి మాయావతి,సమాజ్వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ దూరంగా ఉండనున్నారు. కాంగ్రెస్తో ఉన్న బేధాభిప్రాయాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఎన్డీయేకి చెందిన పలువురు నేతలు.. బీజేపీ పట్ల వారికి ఉన్న సానుకూల వైఖరి వల్లే సమావేశానికి దూరంగా ఉన్నారని పేర్కొనడం గమనార్హం.
ఎవరెవరు హాజరవుతున్నారు..
నేటి సమావేశానికి కాంగ్రెస్ మొత్తం 18 పార్టీలకు ఆహ్వానం పంపించింది. కరోనా వైరస్,ఉద్దీపన ప్యాకేజీలే ఎజెండాగా చర్చించాలనుకుంది. కానీ అనూహ్యంగా మూడు ప్రధాన పార్టీల అధినేతలు సమావేశానికి దూరంగా ఉండబోతున్నారు. నిజానికి ఎస్పీ,బీఎస్పీ చాలాకాలంగా కాంగ్రెస్కు దూరంగానే ఉంటూ వస్తున్నాయి. తాజా సమావేశానికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ,మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే,జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్,డీఎంకె చీఫ్ ఎంకె స్టాలిన్,ఎన్సీపీ అధినేత శరద్ పవార్,యూపీఏ భాగస్వామ్య పార్టీలు,వామపక్ష పార్టీల నేతలు హాజరుకానున్నారు.
మొదటిసారి ప్రతిపక్షాలతో శివసేన...
సమావేశానికి హాజరయ్యేందుకు మమతా బెనర్జీ ఇప్పటికే సానుకూలత వ్యక్తం చేశారు. అటు 35 ఏళ్లుగా బీజేపీ మిత్రపక్షంగా కొనసాగిన శివసేన కూడా మొదటిసారి ప్రతిపక్ష పార్టీల సమావేశంలో పాల్గొంటుండటం గమనార్హం. ఎన్సీపీ తొలుత కొంత వ్యతిరేకతతో ఉన్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఈ సమావేశం అవసరమని భావించి ఆమోదం తెలిపింది.
Recommended Video
భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారా..
రాష్ట్రాల హక్కులు హరించేలా కేంద్రం పెత్తనం,సంక్షోభ సమయంలో రాష్ట్రాలను ఆదుకోకపోవడం,వలస కూలీల సంక్షోభం వంటి అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. ఓ ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత దీనిపై మాట్లాడుతూ.. 'సమావేశంలో కేవలం వలస కూలీల అంశం పైనే చర్చిస్తారని మేము భావించట్లేదు. అసలు కరోనా మేనేజ్మెంట్లో కేంద్రం పూర్తిగా వైఫల్యం చెందింది. దీనిపై ప్రతిపక్షాల భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలో చర్చిస్తారని భావిస్తున్నాం.' అని చెప్పారు.