ఏం జరుగుతోంది: పట్టు తప్పుతోందా?.. నెహ్రూ ఇందిరలపై మోదీ చౌకబారు విమర్శలెందుకు?
న్యూఢిల్లీ/ అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్కు మరో తొమ్మిది రోజుల టైం ఉంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మధ్య జోరుగా మాటల యుద్ధం సాగుతోంది. పాటిదార్లు, ఓబీసీలు, దళితులతోపాటు మద్దతుతో దూకుడుగా ముందుకు వెళుతున్న కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ యువ నేత రాహుల్ గాంధీ లక్ష్యంగా ప్రధాని మోదీ మొదలు కమలనాథులంతా ప్రచారం సాగిస్తున్నారు. ప్రధాని మోదీ.. రెండు, మూడు రోజులుగా తొలి ప్రధాని పండిట్ నెహ్రూ నుంచి మొదలు పెట్టి ఇందిరాగాంధీని.. ఆమె మనుమడు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని ఘాటుగా విమర్శలు సాగిస్తున్నారు.
నవ భారతావనికి దిశా నిర్దేశం చేసిన తొలి ప్రధాని నెహ్రూ.. హరిత విప్లవం ప్లస్ బ్యాంకులు, పెట్రోలియం సంస్థల జాతీయకరణ ఆ పై బంగ్లాదేశ్ విముక్తి పోరాటంతో దేశ ప్రజల గుండెల్లో ఉక్కు మహిళగా, మాజీ ప్రధాని వాజపేయి మాటల్లో చెప్పాలంటే.. దుర్గాదేవి కూడా.. కానీ ప్రధాని మోదీకి మాత్రం దుర్మార్గురాలిగా కనిపిస్తున్నారు. అసలు మరణించిన వారి గురించి ప్రస్తావించడం సరి కాదని పెద్దలు చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో సానుకూల వాతావరణం పెరిగిపోతుండటంతో కమలనాథుల్లో ప్రత్యేకించి ప్రధాని మోదీలో గుజరాత్లో తమ పట్టు తప్పుతోందా? అన్న ఆందోళన చెలరేగుతున్నదా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
177 వస్తువులపై 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింపెందుకు?
ఇక జీఎస్టీ అమలులో తొందరపాటు నిర్ణయాలను ప్రశ్నిస్తూ... గరిష్ఠంగా శ్లాబ్ను 18 శాతానికి పరిమితం చేయాలని.. అది జీఎస్టీ కాదని గబ్బర్ సింగ్ టాక్స్ అని పేరు పెట్టి రాహుల్ చేసిన ప్రచారానికి సూరత్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో విస్త్రుత మద్దతు లభించింది. జీఎస్టీ అమలుకు వ్యతిరేకంగా వ్యాపారులు నినదించడంతో గౌహతిలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఎకాఎకీనా 177 వస్తువులపై పన్ను శ్లాబ్ తగ్గిస్తూ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యం ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్రం తీసుకున్నది. ఇటువంటప్పుడు జీఎస్టీ గరిష్ఠంగా 18 శాతానికి తగ్గించాలని రాహుల్ గాంధీ చేసిన ప్రతిపాదన చాలా తెలివి తక్కువ ఆలోచనలకు నిదర్శనమని మోర్బీలో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఎదురుదాడికి దిగారు. దోపిడీ దారులు మాత్రమే ఇటువంటి ప్రతిపాదనలు ముందుకు తెస్తారని కూడా చెప్పుకొచ్చారు. ఇటీవల కొందరు ఆర్థిక వేత్తలు పుట్టుకొచ్చారని ఎద్దేవా చేశారు మోదీ.. ఇటువంటి తెలివి తక్కువ ఆలోచనలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రాహుల్ను ఉద్దేశించి అన్నారు. దేశాన్ని దోచుకునే వారికి, దోపిడీదారులకు మాత్రమే ఇటువంటి ఆలోచనలు వస్తాయని ఎద్దేవా చేశారు. జీఎస్టీపై కాంగ్రెస్ పార్టీ విమర్శలన్నీ పేదలకు వ్యతిరేకమని అభివర్ణించారు.
మచ్చు డ్యామ్కు ఇలా పోటెత్తిన వరదలతో ఇదీ దుస్థితి
ఇక మాజీ ప్రధాని ఇందిరను లక్ష్యంగా చేసుకున్న ప్రధాని మోదీ.. జనతా పార్టీ ప్రభుత్వ హయాం నాటి ఘటనలను గుర్తు చేసుకున్నారు. ‘1979లో మచ్చు డ్యామ్కు వరదలు పోటెత్తినప్పుడు నేను ఆరెస్సెస్, జనసంఘ్ కార్యకర్తల్లో ఒకరిగా నెల రోజులు సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొన్నా' అని గుర్తు చేసుకున్నారు. నాడు మోర్బీకి ఇందిరా బెన్ వచ్చినప్పుడు దుర్గంధ భరితమైన వాసనను భరించలేక ఆమె ముక్కు మూసుకున్న దృశ్యాన్ని.. ఆరెస్సెస్ కార్యకర్తలు మృతదేహాలను మోసుకెళ్తున్న దృశ్యాన్నీ స్థానిక చిత్రలేఖ అనే మ్యాగజైన్ కవర్ పేజీలో ప్రచురించిందన్నారు.
దుర్వాసన భరించలేక ఇందిర ముక్కు మూసుకున్నారిలా..
కానీ వాస్తవంగా జరిగిందేమిటో తెలియజేస్తూ ‘ఇండియా టుడే' మ్యాగజైన్ అప్పట్లో ఇండియా టుడే 1979 సెప్టెంబర్ సంచికలో ఒక వార్తాకథనం ప్రచురించింది. 1979 ఆగస్టు 11న మోర్బీ సమీపాన గల మచ్చు డ్యామ్ వరదలు పోటెత్తినప్పుడు వేలమంది మరణించారు. మానవుల మృతదేహాలు, జంతు కళేబరాలను కలిపి ట్రక్కుల్లో తరలించిన ఘటనలు కోకొల్లలు. దీంతో ఆ ప్రాంతాల్లో ముక్కు పుటాలు అదిరేలా వ్యాపించిన దుర్గంధం వారంపాటు కొనసాగింది. ఆగస్టు 16న ఇందిరాగాంధీ.. మోర్బీ పరిసర ప్రాంతాలను సందర్శించినప్పుడు దుర్వాసన భరించలేక ముక్కు మూసుకున్నారు.
రాఫెల్, జయ్ షాలపై నోరు మెదపని ప్రధాని మోదీ
ఇక భావ్నగర్ జిల్లా పాలితానాలో జరిగిన సభలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ సంపన్నుడని ఆయనకు పేదల కష్టాలు, చెమట చుక్కల విలువేం తెలుస్తుందని మండిపడ్డారు. పేదల కష్టాలంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తనయుడు జయ్ షాకు అనూహ్యంగా పలు రెట్లు టర్నోవర్ ఎలా పెరిగిందో.. దాని వెనుక నిలిచిందో చెప్పాలని రాహుల్ ప్రశ్నించడం ప్రధాని మోదీకి కష్టంగా మారింది. దీనిపై సోమవారం ప్రధాని మోదీనుద్దేశించి రాహుల్.. ముఖంలో ముడతలు, నుదుటిపై చెమటతో సాహెబ్ (ప్రధాని మోదీ) భయపడుతున్నట్లు కనిపిస్తున్నదని ట్వీట్ చేశారు. జయ్ షా వ్యాపార లావాదేవీల్లో టర్నోవర్ తోపాటు ఫ్రాన్స్ రక్షణ రంగ సంస్థ రాఫెల్ ఒప్పందంపై వస్తున్న విమర్శలకు మోదీ ఎందుకు నోరు మెదపరని ప్రశ్నించారు రాహుల్. అధికార బీజేపీ జాతీయ అధ్యక్షుడి సంస్థ టర్నోవర్ అనూహ్యంగా పెరుగడం మోదీ ద్రుష్టిలో పేదల చెమట కిందకు వస్తుందా? అని విశ్లేషకులు సందేహిస్తున్నారు. నిజమే మరి.. సంపన్న కుటుంబంలో పుట్టిన వారికి పేదవాడి చెమట కూడా వెటకారంగానే కనిపిస్తుందనే మాట నిజమే. ఒక పారిశ్రామిక సంస్థ పేరుతో కార్యకలాపాలు నిర్వహించడం కూడా పేదరికం కిందకే వస్తుందని మోదీ అభిప్రాయ పడుతున్నారన్న మాట. పేదవాడి బాధలే అర్థం కానప్పుడు సంపన్నులు చెమటనూ గేలి చేస్తారని అనడం సహజమేనని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
గుజరాత్ అంటే కాంగ్రెస్ పార్టీకి పగ అని మోదీ విసుర్లు
ప్రధాని మోదీ అంతటితో ఆగలేదు. నెహ్రూ - గాంధీ కుటుంబానికి గుజరాత్ అంటే పగ అనేందుకు వెనుకాడలేదు. ‘మీకు గుజరాత్ అంటే పగ. సర్దార్ పటేల్, మొరార్జీ దేశాయ్ పట్ల మీరు ఎలా వ్యవహరించారో ప్రజలకు తెలుసు. ఇప్పుడు మీకు మోదీ లక్ష్యంగా మారారు' అని వ్యాఖ్యానించారు. ఇక జునాగఢ్ జిల్లా సోమనాథ్ ఆలయాన్ని రాహుల్ గాంధీ దర్శించిన తీరుపై కమలనాథులు సరి కొత్త వివాదం తీసుకొచ్చారు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న హిందూయేతర సందర్శకుల రిజిస్టర్లో రాహుల్, కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ పేర్లను ఆలయసిబ్బంది నమోదు చేశారు. దాన్ని ధ్రువీకరిస్తూ కాంగ్రెస్ మీడియా కోఆర్డినేటర్ మనోజ్ త్యాగి రిజిస్టర్లో సంతకం చేశారు. దీనిపై రాహుల్ తన మతవిశ్వాసాన్ని ఇప్పటికైనా బహిరంగపర్చాలని బీజేపీ అధికార ప్రతినిధి రాజీవ్ ధ్రువ్ డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని జహర్లాల్ నెహ్రూ కూడా ఆలయ పునరుద్ధరణను వ్యతిరేకించారని ఆయన ఆరోపించారు. నాడు సర్దార్ పటేల్ లేకుంటే సోమనాథ్ ఆలయం తెరుచుకునేదే కాదని చెప్పుకొచ్చింది బీజేపీ. తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్.. సోమనాథ్ ఆలయ ప్రారంభానికి వెళ్లినందుకు తొలి ప్రధాని నెహ్రూ అసంత్రుప్తి వ్యక్తం చేశారని ఆరోపించింది.